హోం మంత్రిత్వ శాఖ
తెలంగాణలోని నిజామాబాద్లో జరిగిన కిసాన్ మహా సమ్మేళన్లో ముఖ్య అతిథిగా ప్రసంగించిన కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
* పసుపు బోర్డు ఏర్పాటు చేసి నిజామాబాద్ రైతుల నాలుగు దశాబ్దాల డిమాండును నెరవేర్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
* మోదీ ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు
* బోర్డు ఏర్పాటుతో పసుపు వాణిజ్యానికి అంతర్జాతీయ కేంద్రంగా మారనున్న నిజామాబాద్: ఎఫ్పీవోలు, రైతులకు సాధికారత
* మోదీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే తెలంగాణను అభివృద్ధి చేయగలదు
* భారత్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వమని చెప్పినవారి ప్రధాన స్థావరాలను మోదీ నేలమట్టం చేశారు
* పాకిస్థాన్ ప్రస్తుత స్థితిని చూస్తే ఆపరేషన్ సిందూర్ను ప్రశ్నిస్తున్నవారికి సమాధానం దొరుకుతుంది
* ఇప్పటికీ.. తెలంగాణలో నక్సలైట్లను రక్షించడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి
* 2026, మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తాం
Posted On:
29 JUN 2025 10:30PM by PIB Hyderabad
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నిజామాబాద్లో జరిగిన కిసాన్ మహా సమ్మేళన్లో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి, కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకు ముందు, నిజామాబాద్కు చెందిన ప్రముఖ నాయకుడు డి. శ్రీనివాస్ విగ్రహాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆవిష్కరించి, నివాళులు అర్పించారు.
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని 2023లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని తెలిపారు. అలాగే నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా పసుపు రైతుల నాలుగు దశాబ్దాల డిమాండును సైతం నెరవేర్చారని పేర్కొన్నారు. మోదీ తాను ఇచ్చిన వాగ్ధానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు.
జాతీయ పసుపు బోర్డు ప్రారంభంతో నిజామాబాద్ పసుపు అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుంటుందని శ్రీ అమిత్ షా అన్నారు. పసుపు ధరలు తరచూ తగ్గుతూ ఉంటాయని, కానీ దాని ధర ఎప్పటికీ తగ్గని రోజు వస్తుందని ఆయన చెప్పారు. పసుపు ఔషధ గుణాలను బోర్డు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుందని తెలియజేశారు. పసుపు వాణిజ్యంలో నిజామాబాద్ను అంతర్జాతీయ కేంద్రంగా మారుస్తుందని వివరించారు. అలాగే రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్పీవోలు), రైతులకు సాధికారత కల్పిస్తుందని పేర్కొన్నారు.
నేషనల్ ఎక్స్పోర్ట్ కోపరేటివ్ లిమిటెడ్, నేషనల్ కోపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈ రెండు జాతీయ సహకార సంస్థల శాఖలను నిజామాబాద్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పసుపు ప్యాకేజింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు సంబంధించిన సమగ్ర వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్గానిక్ పసుపునకు అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, యూకే, వియత్నాం, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో డిమాండు ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దేశాలకు ఆర్గానిక్ పసుపు రైతులు పండించిన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేపడుతున్నామని తెలిపారు.
2014లో శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతీయ భద్రతను బలోపేతం చేయడం ప్రారంభించారని శ్రీ అమిత్ షా వెల్లడించారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు తరచూ దాడి చేసి, సునాయాసంగా తప్పించుకునేవారని గుర్తు చేసుకున్నారు. పదేళ్ల మోదీ ప్రభుత్వంలో మూడు సార్లు ప్రధాన ఉగ్రవాద దాడులు జరిగాయి: ఉరి, పుల్వామా, పహల్గాం. ఉరి ఉగ్రదాడి తర్వాత సర్జికల్ స్ట్రయిక్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం ఘటన అనంతరం పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత భద్రతా దళాలు నాశనం చేశాయని ఆయన తెలియజేశారు. పహల్గాం దాడి తర్వాత వారికి గుణపాఠం నేర్పాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ నుంచి అణుదాడుల బెదిరింపులు, ప్రతిపక్షాల నుంచి అనుమానాలు వెల్లువెత్తినప్పటికీ భారత బలగాలు ఒక్క రాత్రిలో పాకిస్థాన్లోని ప్రధాన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. వందలాది ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ అంశంలో ప్రతిపక్ష నేతలు ఇప్పటికీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే వారికి సమాధానాలు దొరకుతాయని శ్రీ షా అన్నారు. భారత్లో శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నవారి ప్రధాన స్థావరాలను ఆపరేషన్ సిందూర్ ద్వారా ధ్వంసం చేసి దేశభద్రతకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
దేశంలో గడచిన నాలుగు దశాబ్దాల్లో వామపక్ష అతివాద ప్రభావం ఉన్న జిల్లాల్లో 40,000 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా వెల్లడించారు. ఎంతో మంది గిరిజనులు తమ ప్రాణాలను లేదా అవయవాలను పోగొట్టుకున్నారని తెలిపారు. ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని, సాధారణ జనజీవన స్రవంతిలో చేరాలని నక్సలైట్లకు విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 10,000 మంది మిలటెంట్లు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరారని తెలిపారు. ఇప్పుడు వారు తాలుకా, పంచాయతీ, జిల్లా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వెల్లడించారు. 2,000 మంది నక్సలైట్లు కూడా లొంగిపోయారని తెలిపారు. అయితే, ఇప్పటికీ తమ చేతుల్లో ఆయుధాలు పట్టుకున్నవారితో చర్చలు జరపబోమని తెలిపారు. 2026, మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రకటించారు. తెలంగాణాలో నక్సలైట్లకు మద్దతు తెలుపుతున్నవారు.. వారి వల్ల ప్రాణాలు కోల్పోయిన గిరిజనులు, పోలీసులు, భద్రతా సిబ్బంది కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని, గిరిజన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధి నిలిచిపోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణలో పారిపోతున్న నక్సలైట్లకు ప్రతిపక్షం ఆశ్రయం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. 2026 మార్చి 31 నాటికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నక్సలిజంను పారదోలుతుందని హామీ ఇచ్చారు.
రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, యువత సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటే దాన్ని మోదీ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే అందించగలదని పేర్కొన్నారు. రైతుల కోసం ప్రధానమంత్రి మోదీ విస్తృతస్థాయిలో పనిచేశారని వ్యవసాయ బడ్జెట్ను రూ.లక్ష కోట్లకు పెంచారన్నారు. అలాగే రైతుల ఖాతాల్లో నెలకు రూ. 6,000 వేస్తున్నామని, యూరియా, డీఏపీ ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నామని తెలియజేశారు. గతంలో లేని విధంగా రైతులకు బీమా సౌకర్యం కల్పించామని తెలిపారు. పసుపు బోర్డు సైతం ఏర్పాటైందన్నారు. దళితులు, వెనకబడిన తరగతులు, గిరిజనులు, పేదలు, యువత, మహిళల సంక్షేమానికి పీఎం మోదీ చేపడుతున్న ప్రయత్నాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని శ్రీ షా తెలిపారు.
***
(Release ID: 2140746)