బొగ్గు మంత్రిత్వ శాఖ
ఈశాన్య భారత్లో ఖనిజ, బొగ్గు రంగాల వృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందన్న కేంద్ర మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి
Posted On:
28 JUN 2025 5:52PM by PIB Hyderabad
ఖనిజాలు, బొగ్గుకు నెలవైన ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతును అందిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. గౌహతిలో జరిగిన రెండో ఈశాన్య భారత మైనింగ్ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రెండో రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గనుల తవ్వకం విషయంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం, ప్రాజెక్టుల ఆమోదాన్ని వేగవంతం చేయటం, ఈ ప్రాంతంలో గనుల తవ్వకం విషయంలో సుస్థిర పద్ధతులను ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి వికసిత్ భారత్-2047 దార్శనికతకు కీలకమని ఆయన అన్నారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం అనే ఎనిమిది రాష్ట్రాలను అష్ట లక్ష్ములుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఖనిజ, బొగ్గు రంగ అభివృద్ధి ద్వారా ఉపాధిని సృష్టించడానికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు, సమగ్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర-రాష్ట్ర సమన్వయాన్ని మెరుగుపరచడం కీలకమని ప్రధానంగా పేర్కొన్నారు.
గనుల తవ్వకం, బొగ్గు రంగాలను మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు తమ తమ ప్రణాళికలను ప్రకటించారు. రాష్ట్ర-నిర్దిష్ట వ్యూహాలు, విజయాలు, భవిష్యత్తు ప్రణాళికలను మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల మంత్రులతో పాటు నాగాలాండ్ ముఖ్యమంత్రి సలహాదారు వివరించారు. బ్లాకుల వేలం, కీలక ఖనిజాల అన్వేషణ, బొగ్గు గనుల పునరుద్ధరణ, చిన్న ఖనిజ వనరుల అభివృద్ధి, సుస్థిర గనుల తవ్వకం విధానాలను అనుసరించటంలో సాధించిన పురోగతిని అందరితో పంచుకున్నారు.
పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలు, ఆర్థిక వృద్ధి మధ్య సమతుల్యతను తీసుకొచ్చే విషయంలో అందరి నిబద్ధతను ఈ చర్చలు ప్రతిబింబించాయి. ప్రాంతీయ సవాళ్లను అధిగమించేందుకు, రాష్ట్రాలు తమ వనరులను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకునేందుకు కేంద్రం మరింత సహాయం చేయాలని ఆయా రాష్ట్రాలు కోరాయి.
దేశవ్యాప్తంగా ఖనిజ, బొగ్గు అన్వేషణ కార్యక్రమాలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా అన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), ఖనిజాన్వేషణ సంస్థ (ఎంఈసీఎల్-మినరల్ ఎక్స్ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్), రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో పనిచేయాలని.. ఆధునిక, లక్ష్యంతో కూడిన సమయానుకూల అన్వేషణ పద్ధతులను అవలంబించాలని తెలిపారు. ముఖ్యంగా కీలక, వ్యూహాత్మక ఖనిజాలపై దృష్టి సారించాలని కోరారు.
ఖనిజాన్వేషణ కార్యకలాపాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన, బడ్జెట్పరమైన సహయాన్ని భారీగా పెంచిందని.. అదే ఉత్సాహాన్ని ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూపించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
మంత్రుల సమావేశానికి సమాంతరంగా జరిగిన మరో కార్యక్రమంలో గౌహతిలోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి ప్రారంభించారు. అస్సాం గనుల శాఖ మంత్రి శ్రీ కౌశిక్ రాయ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గనుల శాఖ కార్యదర్శి వీ.ఎల్. కాంతారావు, గనుల శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా, ఐబీఎం కంట్రోలర్ జనరల్ పియూష్ శర్మ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈశాన్య ప్రాంతంలో గనుల తవ్వకానికి సంబంధించి పర్యవేక్షణ, సాంకేతిక మద్దతు, సులభతర సేవలను పెంచటంలో ఈ నూతన ఐబీఎం కార్యాలయం కీలక పాత్ర పోషించనుంది.
గనుల తవ్వకం విషయంలో ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధి, ఇంధన భద్రత, ఆర్థిక పరివర్తనలతో కూడిన జాతీయ అజెండా దిశగా ప్రాంతీయ వ్యూహాలను తయారు చేసుకునేందుకు ఈ రెండు రోజుల సదస్సు ఒక ప్రధాన వేదికగా మారింది.
***
(Release ID: 2140507)