రైల్వే మంత్రిత్వ శాఖ
2022 దాహోద్ ఫ్యాక్టరీ బిడ్లో పాల్గొన్న 9000 హార్స్పవర్ రైలింజను తయారీ సామర్థ్యం గల సిమెన్స్, ఆల్స్టోమ్ సంస్థలు
పోటీదారుల కంటే అత్యల్ప ధర కోట్ చేసి బిడ్ గెలుచుకున్న సిమెన్స్ సంస్థ
భారత రైల్వే పారదర్శక ప్రక్రియలకు అనుగుణంగా బిడ్ మదింపు నిర్వహించిన సాంకేతిక-ఆర్థిక నిపుణుల బృందం
దాహోద్ రైలింజను భాగాల్లో 89 శాతానికి పైగా భారత్లోనే తయారీ
దేశీయ తయారీకి, భారతీయ రైల్వేల 'మేక్ ఇన్ ఇండియా' దార్శనికతకు ఊతమివ్వనున్న ప్రాజెక్ట్
Posted On:
23 JUN 2025 6:29PM by PIB Hyderabad
ఇది దాహోద్లో రైలింజన్ల తయారీకి సంబంధించి 2022లో నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియపై లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలకు సంబంధించినది. దీనికి సంబంధించిన వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.
పారదర్శక టెండర్ ప్రక్రియ: 9,000 హెచ్పి ఎలక్ట్రిక్ రైలింజన్ల తయారీ, నిర్వహణ కోసం పారదర్శక విధానంలో టెండరు ప్రక్రియ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ రైలింజను తయారీలో పేరుగాంచిన ఆల్స్టోమ్, సిమెన్స్ సంస్థలు రెండూ టెండరు ప్రక్రియలో పాల్గొన్నాయి. ఈ రెండు సంస్థలకూ 9000 హెచ్పి ఎలక్ట్రిక్ రైలింజను తయారీ సామర్థ్యం ఉంది.
మదింపు ప్రక్రియ: భారత రైల్వేలు ఎల్లప్పుడూ అనుసరించే పారదర్శక ప్రక్రియలకు అనుగుణంగా సాంకేతిక-ఆర్థిక నిపుణుల బృందం ఈ టెండర్ మదింపును నిర్వహించింది. సాంకేతిక మదింపులో ఆల్స్టోమ్, సిమెన్స్ సంస్థలు రెండూ సమాన స్థానాల్లో నిలిచాయి. ఆర్థిక మదింపులో అత్యల్ప ధర కోట్ చేసిన బిడ్డర్కు ఈ కాంట్రాక్ట్ దక్కింది.
పారదర్శకంగా ధర నిర్ణయం: పారదర్శక పద్ధతి ద్వారా నిర్ణయించిన ధర పోటీదారుల కంటే చాలా తక్కువగా ఉంది. కాంట్రాక్ట్ కూడా టెండర్ పత్రాలకు అనుగుణంగానే ఉంది. టెండర్ నిబంధనల్లో ఎటువంటి మార్పు లేదు.
నిష్పక్షపాతంగా ప్రామాణిక మదింపు: ఇటువంటి మదింపు నిర్వహణలో సాంకేతికంగా, ఆర్థికంగా సమర్థులైన అధికారుల బృందం నిబంధనల ప్రకారం మొత్తం టెండర్ ప్రక్రియను నిర్వహించాయి. భారతీయ రైల్వేలు ఎల్లప్పుడూ అనుసరించే నియమాలు, విధానాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి నిష్పక్షపాతంగా జరిగింది. టెండర్ మదింపు ప్రక్రియలో రైల్వే మంత్రి పాత్ర ఏమీలేదు. రైల్వే మంత్రులు టెండర్లను ఆమోదించే విధానాన్ని 2016 నుంచే రద్దు చేశారు. పూర్తి సంస్థాగత పారదర్శకత, తటస్థత, అధికారుల ప్రాతినిధ్యాన్ని నిర్ధారించేందుకు అన్ని అనుమతుల ప్రక్రియలు సాధికార రైల్వే బోర్డు సభ్యులు, జోనల్ యూనిట్ల ఆధీనంలో ఉన్నాయి. అంతేకాకుండా సిమెన్స్, ఆల్స్టోమ్ సంస్థలు రెండూ అనేక దశాబ్దాలుగా భారతీయ రైల్వేలతో కలిసి పనిచేస్తున్నాయి.
కచ్చితమైన విశ్వసనీయ ఆధారిత ఒప్పందాలు: గత రెండు దశాబ్దాలుగా భారతీయ రైల్వేలు జీవన కాల వ్యయ ఆధారిత కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నాయి. దీని కారణంగా ఉత్పత్తుల విశ్వసనీయత పెరుగుతుంది. అలాగే ప్రయాణికుల భద్రత మెరుగవుతుంది.
విడి భాగాల తయారీ: ప్రస్తుత తయారీ ప్రక్రియ ప్రకారం, దాహోద్ రైలింజన్ల తయారీలో ఉపయోగించే భాగాల్లో దాదాపు 89 శాతం దేశంలోనే తయారవుతాయి. భారత్లో రైల్వే విడిభాగాల తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రైలింజను చాలా సంక్లిష్టమైన యంత్రం.. దాని భాగాలు అంతే సంక్లిష్టంగా ఉంటాయి. వీటిని దేశంలోని వివిధ ప్రదేశాల్లో తయారు చేసి వివిధ రైలింజను తయారీదారులకు సరఫరా చేస్తారు. గత దశాబ్దంలో తయారీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా భారత్ సాధించగలిగిన విడి భాగాల తయారీ స్థాయిని ప్రపంచంలోని చాలా తక్కువ దేశాలు మాత్రమే చేరుకోగలవు.
***
(Release ID: 2139131)