లోక్సభ సచివాలయం
యోగా ప్రభావాన్ని తేటతెల్లం చేసిన ప్రపంచవ్యాప్త శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనలు: లోక్సభ స్పీకర్
· యోగాను ప్రజలు జీవితాల్లో భాగం చేసుకోవాలి, సానుకూల మార్పులను నలుగురితో పంచుకోవాలి.. అది అందరికీ ప్రేరణనిస్తుంది
· సమర్థతను, ఆత్మవిశ్వాసాన్నీ, లక్ష్యం దిశగా స్పష్టతను అందించే సాధనంగా... యోగాను స్వీకరించాలంటూ యువతకు పిలుపు
· శరీరం, మనస్సు, ఆత్మలను అనుసంధానించే శక్తిమంతమైన సాధనం... యోగా
· మెరుగైన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం అనేక దేశాల్లో ప్రజలు యోగాను తమ జీవితాల్లో భాగం చేసుకున్నారు: స్పీకర్
· పార్లమెంటు ప్రాంగణంలో లోక్సభ స్పీకర్ నేతృత్వంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
Posted On:
21 JUN 2025 12:31PM by PIB Hyderabad
లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలో ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీలూ, మాజీ సభ్యులు, లోకసభ, రాజ్యసభ సచివాలయాల ఉద్యోగులు ఇతరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ బిర్లా మాట్లాడుతూ శరీరం, మనస్సు, ఆత్మల మధ్య అనుసంధానాన్ని సాధించడానికి యోగా ఓ శక్తిమంతమైన సాధనంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మనిషి సమగ్రాభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యోగా కేవలం ఓ వ్యాయామం మాత్రమే కాదని, ఇది వ్యక్తులకు బలాన్ని, ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తితో సాధికారతను అందించే సమగ్ర జీవన విధానమని ఆయన వ్యాఖ్యానించారు.
యోగాను ప్రజలు జీవితాల్లో భాగం చేసుకుని, అది తమలో కలిగించిన సానుకూల మార్పులను అందరితో పంచుకోవాలని శ్రీ బిర్లా కోరారు. యోగా సానుకూల శక్తిని తెలుసుకునేలా ఇది ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా యువత సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, లక్ష్యం పట్ల స్పష్టతను పెంపొందించుకునే మార్గంగా యోగాను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
యోగా దినోత్సవాన్ని భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని శ్రీ బిర్లా పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో లక్షలాదిగా ప్రజలు యోగా కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ, ఈ పురాతన సంప్రదాయ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్నారని ఆయన అన్నారు.
భారత పురాతన, ప్రశస్తమైన ఆచరణల్లో ఒకటైన యోగాకు నేటి ఆధునిక, శాస్త్రీయ యుగంలోనూ అమితమైన ప్రాధాన్యం ఉందన్నారు. మన శారీరక, మానసిక ఆరోగ్యంపై యోగా సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్న విషయం ప్రపంచవ్యాప్తంగా అనేక శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనల్లో స్పష్టమైందని ఆయన తెలిపారు. ఒత్తిడిని అధిగమించడానికి, అంతర్గత శక్తిని పెంపొందించుకోవడానికి, శక్తిని నిర్మాణాత్మకంగా, శాంతియుతంగా వినియోగించుకోవడానికి యోగా దోహదపడుతుందనన్నారు. ఏకాగ్రతను, పని సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఆరోగ్యకరమైన, సమతౌల్యంతో కూడిన జీవనశైలిని యోగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
మెరుగైన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం అనేక దేశాల్లో ప్రజలు యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవడం హర్షణీయమన్నారు. ఆరోగ్యకరమైన, మరింత శాంతియుతమైన ప్రపంచం దిశగా అన్ని సంస్కృతుల ప్రజలను యోగా ఇకముందు కూడా ఏకం చేస్తూ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రహ్మకుమారీలు భారతీయుల జీవనాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని అందించారు: లోక్సభ స్పీకర్
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలో ఎర్రకోట ప్రాంగణంలో బ్రహ్మకుమారీలు ఈరోజు సామూహిక యోగాభ్యాసాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజయోగా, జ్ఞానయోగా ద్వారా శాంతిని, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి బ్రహ్మ కుమారీ సంస్థ చేస్తున్న అమూల్యమైన కృషిని అభినందించారు. ఈ సంస్థ భారతీయుల జీవితాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని వ్యాప్తి చేసిందని ప్రశంసించారు. ప్రజలు ఒత్తిడి, ఆందోళనలను అధిగమించడంతోపాటు అంతర్గత శాంతిని పొందడంలో ఇది సహాయపడుతుందన్నారు.
ఇటీవలి తన బ్రెజిల్ పర్యటనను గుర్తుచేసుకుంటూ, బ్రహ్మ కుమారీల కృషి అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేసిందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో సానుకూల ప్రభావాన్ని వారు కలిగించారని శ్రీ బిర్లా పేర్కొన్నారు. భారతీయ విలువలు మూలాలుగా ఉన్న ఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రేరణగా నిలుస్తూ, అర్థవంతమైన పరివర్తన దిశగా నడిపిస్తుండటం గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు.
***
(Release ID: 2138404)