ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిశా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రూ. 18,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు
ప్రారంభించి.. శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
వందల ఏళ్లుగా భారత నాగరికతను, సంస్కృతిని ఒడిశా సుసంపన్నం చేస్తోంది
అభివృద్ధి, వారసత్వ మంత్రం దేశ పురోగతికి మూలాధారంగా ఉన్న నేటి సమయంలో ఒడిశా పాత్ర మరింత కీలకంగా మారింది
గడిచిన కొన్నేళ్లలో, గిరిజన సమాజాన్ని హింస నుంచి సరికొత్త అభివృద్ధి మార్గంలోకి నడిపించేందుకు కృషి చేశాం
21వ శతాబ్దంలో దేశాభివృద్ధి తూర్పు భారతం నుంచే ఊపందుకుంటోంది: ప్రధానమంత్రి
Posted On:
20 JUN 2025 7:20PM by PIB Hyderabad
ఒడిశా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భువనేశ్వర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఒడిశా సమగ్ర అభివృద్ధి పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా.. తాగునీరు, నీటిపారుదల, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, గ్రామీణ రహదారులు-వంతెనలు, జాతీయ రహదారుల విభాగాలు, కొత్త రైల్వే లైన్ పనులు సహా కీలక రంగాలకు సంబంధించి, రూ. 18,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించిన శ్రీ నరేంద్ర మోదీ, ఒడిశాలో తొలి బీజేపీ ప్రభుత్వం ఈరోజుతో ఏడాది పాలన పూర్తి చేసుకుందన్నారు. "ఈ వార్షికోత్సవం కేవలం ప్రభుత్వ వార్షికోత్సవం కాదు, ప్రజాసేవ.. ప్రజల విశ్వాసానికి అంకితమైన సుపరిపాలనకు నిదర్శనం" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒడిశాలోని కోట్లాది మంది ఓటర్ల అంచనాలను అందుకోవడానికి ప్రభుత్వం నిజాయితీగా కృషి చేసిందని ఆయన ప్రశంసించారు. ఒడిశా ప్రజల మద్దతు, విశ్వాసాన్ని ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝి, ఆయన సహచర బృందం చేసిన కృషికి అభినందనలు తెలిపారు. వారి ప్రయత్నాలు ఒడిశా అభివృద్ధికి కొత్త ఊపునిచ్చాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
"ఒడిశా కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ఘనమైన భారత వారసత్వంలో ఒక ధ్రువతార" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. శతాబ్దాలుగా ఒడిశా భారత నాగరికతను, సంస్కృతిని సుసంపన్నం చేసిందన్నారు. అభివృద్ధి, వారసత్వ మంత్రం దేశ పురోగతికి పునాదిగా మారిన నేటి కాలంలో, ఒడిశా పాత్ర మరింత కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సర కాలంలో రాష్ట్ర వారసత్వ పరిరక్షణతో పాటు అభివృద్ధి మంత్రాన్నీ హృదయపూర్వకంగా స్వీకరించిన ఒడిశా.. ఈ మార్గంలో వేగంగా ముందుకు సాగిందని ప్రశంసించారు.
ఒడిశాలో తమ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలోనే, జగన్నాథుని మహా రథయాత్రకు సన్నాహాలు ప్రారంభం కావడం యాదృచ్ఛికమే అయినా శుభప్రదమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జగన్నాథుడు కేవలం పూజనీయుడు మాత్రమే కాదు, అపారమైన ప్రేరణకు మూలమని పేర్కొన్నారు. భగవంతుని అనుగ్రహం కారణంగా శ్రీ మందిరానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవించిన శ్రీ మోహన్ మాఝిని, ఆయన ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శ్రీ మందిరం నాలుగు ద్వారాలు తెరుచుకున్నాయన్నారు. ఆలయ రత్న భాండాగారాన్ని తెరవడం రాజకీయ విజయానికి సంబంధించిన విషయం కాదనీ, కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని గుర్తించే గౌరవప్రదమైన చర్య అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈరోజు జగన్నాథుని పవిత్ర భూమిని సందర్శించాలని ముందుగానే ప్రణాళిక చేసుకున్నందున.. కెనడాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం పూర్తయిన తర్వాత అమెరికాను సందర్శించాలని కోరిన ఆ దేశ అధ్యక్షుడి ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించినట్లు ప్రధానమంత్రి తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు దేశ ప్రజలు మంచి పరిపాలన లేని, ప్రజల జీవితాలను ఏమాత్రం సులభతరం చేయని పాలనా నమూనాను చూశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులను ఆలస్యం చేయడం, అడ్డుకోవడం, పాలన గాడి తప్పడం, అత్యంత అవినీతికి పాల్పడడం గత పాలన నమూనా అని విమర్శించారు. అలాంటి అధ్వాన్నమైన పాలనే వారి అభివృద్ధి నమూనాకు ముఖ్య లక్షణమని పేర్కొన్నారు. ఇటీవల గత కొద్ది సంవత్సరాలుగా దేశం మా అసలైన అభివృద్ధి నమూనాను చూస్తోందన్నారు. గత దశాబ్దంలో, అనేక రాష్ట్రాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. సుపరిపాలనతో పాటు.. ఈ రాష్ట్రాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధి విషయంలో నవశకం ప్రారంభమైందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. తూర్పు భారత్ ఉదాహరణను ఉటంకిస్తూ, దశాబ్దం కిందట అస్సాం అస్థిరత, వేర్పాటువాదం, హింసతో నిండి ఉండేదని ప్రధానమంత్రి తెలిపారు. నేడు అస్సాం సరికొత్త అభివృద్ధి మార్గంలో పురోగమిస్తోందన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న తిరుగుబాటు కార్యకలాపాలు ఇప్పుడు ఆగిపోయాయని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అస్సాం ఇప్పుడు అనేక అంశాల్లో దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలను అధిగమిస్తోందని స్పష్టం చేశారు. త్రిపుర గురించి ప్రస్తావిస్తూ.. దశాబ్దాల వామపక్ష పాలన తర్వాత ఆ రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు. వామపక్ష పాలనలో త్రిపుర ప్రతి అభివృద్ధి సూచీలోనూ వెనుకబడి ఉండేదని, మౌలిక సదుపాయాలు శిథిలావస్థకు చేరాయని, ప్రభుత్వ వ్యవస్థ ప్రజా సమస్యలకు స్పందించే పరిస్థితి కూడా లేదని తెలిపారు. హింస, అవినీతితో ప్రజలు ఇబ్బంది పడేవారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు త్రిపుర శాంతి, పురోగతికి చిహ్నంగా ఎదుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఒడిశా కూడా దశాబ్దాలుగా అనేక సవాళ్లతో సతమతమవుతోందని ప్రస్తావించిన ప్రధానమంత్రి.. పేదలు, రైతులు వారి హక్కులు కూడా పొందలేదని పేర్కొన్నారు. అవినీతి, రెడ్-టేపిజం ఆధిపత్యం ఉండేదని, రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు దారుణమైన స్థితిలో ఉండేవన్నారు. ఒడిశాలోని అనేక ప్రాంతాలు అభివృద్ధి ప్రక్రియలో వెనుకబడిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటువంటి సవాళ్లు ఒడిశాకు దురదృష్టకర వాస్తవంగా మారాయని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయితే గత ఏడాది కాలంగా ఈ సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం పూర్తి సంకల్పంతో పనిచేసిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అభివృద్ధి నమూనా స్పష్టమైన ఫలితాలను అందించడం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి విధానాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ నమూనా ఒడిశా ప్రజలకు రెట్టింపు ప్రయోజనాలను కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఒడిశాలోని లక్షలాది పేద కుటుంబాలు చాలా కాలంగా ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి రాలేదని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేశారు. నేడు ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన, గోపబంధు జన్ ఆరోగ్య యోజన రెండూ కలిసి పనిచేస్తున్న ఉదాహరణను ఆయన ఉటంకించారు. దీని వల్ల ఒడిశాలోని దాదాపు 3 కోట్ల మందికి ఉచిత వైద్య చికిత్స లభిస్తోందన్నారు. ఒడిశాలోని ఆసుపత్రుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ప్రయోజనం అందుబాటులో ఉందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు చికిత్స పొందిన ఒడిశాలోని 2 లక్షల మందిలో.. చాలా మంది డజనుకు పైగా ఇతర రాష్ట్రాల్లో ఉచిత చికిత్స పొందారని ఆయన పేర్కొన్నారు. కేవలం ఒక సంవత్సరం క్రితం ఇటువంటి వైద్య సదుపాయాన్ని ప్రజలు ఊహించలేదన్నారు. ప్రధానమంత్రి వయ వందన యోజన వంటి కార్యక్రమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నమూనా మరింత విలువను తెచ్చిందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశాలో 70 ఏళ్లు పైబడిన 23 లక్షలకు పైగా వృద్ధులు ఇప్పుడు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారని ఆయన పేర్కొన్నారు. ఇది సాధారణ మధ్యతరగతి కుటుంబాల వైద్య చికిత్సల భారాన్ని గణనీయంగా తగ్గించిందని తెలిపారు. అదేవిధంగా ఒడిశాలోని రైతులు గతంలో పీఎమ్-కిసాన్ పథకం పూర్తి ప్రయోజనాన్ని పొందలేదన్నారు. ఇప్పుడు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి రైతులు రెట్టింపు ప్రయోజనాలను పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వరి ధాన్యం సేకరణ ధరలను పెంచేందుకు హామీ ఇచ్చిందన్న ప్రధానమంత్రి, ఇది ఒడిశాలోని లక్షలాది వరి రైతులకు ప్రయోజనం చేకూర్చిందని తెలిపారు.
గతంలో ఒడిశా పూర్తి ప్రయోజనాలు పొందలేని అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయని, కానీ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు రెండింటినీ ప్రజలు పొందుతున్నారని ప్రధాని ఉద్ఘాటించారు. మహిళలు, రైతులు, యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేశామన్నారు
అణగారిన వర్గాల సాధికారత ప్రభుత్వ ప్రధాన విజయమని స్పష్టం చేస్తూ, ఒడిశాలో పెద్ద సంఖ్యలో గిరిజన జనాభా నివసిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. గతంలో గిరిజన సమాజం వెనుకబాటుతనం, పేదరికం, అణచివేతతో నిరంతరం నిర్లక్ష్యానికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన పార్టీ గిరిజన ప్రజలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని, వారికి అభివృద్ధిని అందించలేదని, అభివృద్ధిలో గిరిజన వర్గాలకు భాగస్వామ్యాన్ని కల్పించలేదని ప్రధాని వ్యాఖ్యానించారు. వారు దేశంలోని విస్తారమైన ప్రాంతాలను నక్సలిజం, హింస, అణచివేత జ్వాలల్లోకి నెట్టారని ఆయన ఆరోపించారు.
2014కు ముందు దేశవ్యాప్తంగా 125కు పైగా గిరిజన మెజారిటీ జిల్లాలు నక్సలైట్ హింసతో ప్రభావితమయ్యాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘రెడ్ కారిడార్‘ పేరుతో గిరిజన ప్రాంతాలపై అన్యాయంగా చెడు ముద్ర వేసి కించపరిచారని అన్నారు. వీటిలో చాలా జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించారని, ఆ తర్వాత గత పాలకులు వాటిని పట్టించుకోలేదని ప్రధాని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో గిరిజన సమాజాన్ని హింసాత్మక వాతావరణం నుంచి తప్పించి నూతన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హింసను వ్యాప్తి చేసే వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని ప్రధాని తెలిపారు. అదే సమయంలో గిరిజన ప్రాంతాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామని, ఫలితంగా నక్సలైట్ హింస ప్రభావం దేశంలో 20 కంటే తక్కువ జిల్లాలకు పరిమితమైందని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న చర్యలతో గిరిజన సమాజాలు త్వరలోనే హింస బారి నుంచి విముక్తి పొందుతాయని, దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
"గిరిజన వర్గాల కలలను నెరవేర్చడం, వారికి కొత్త అవకాశాలను కల్పించడం, వారి జీవితంలో ఇబ్బందులను తగ్గించడం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత" అని శ్రీ మోదీ పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రెండు ప్రధాన జాతీయ పథకాలను తొలిసారిగా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. మొదటి పథకం ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్త్కర్ష్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా 60,000కుపైగా ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఒడిశాలో కూడా గిరిజన కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నామని, రోడ్లు నిర్మిస్తున్నామని, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒడిశాలోని 11 జిల్లాల్లో 40 రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు.
రెండో ప్రధాన పథకమైన ప్రధానమంత్రి జన్ మన్ యోజన గురించి వివరిస్తూ, ఈ పథకానికి ప్రేరణ ఒడిశా భూమి నుంచి ఉద్భవించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో దేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి, ఒడిశా కుమార్తె శ్రీమతి ద్రౌపది ముర్ము మార్గదర్శకత్వాన్ని ఆయన ప్రస్తావించారు. విస్తృత గిరిజన సమాజంలోని ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాలకు (పివిటిజి) మద్దతు ఇవ్వడంపై ఈ పథకం దృష్టి సారించిందని ప్రధానమంత్రి తెలియచేశారు. ఈ పథకం కింద అనేక చిన్న గిరిజన తండాల్లో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఒడిశాలో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు నివసిస్తున్నారని, వారి సంక్షేమం కోసం తొలిసారిగా దేశవ్యాప్తంగా పీఎం మత్స్య సంపద యోజన అనే బృహత్తర పథకాన్ని రూపొందించినట్లు ప్రధాన మంత్రి గుర్తు చేశారు. మత్స్యకారులు ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయం కూడా పొందుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.25,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తోందని, ఇది ఒడిశా తీరప్రాంతంలో నివసించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, యువతకు అవకాశాలను కల్పిస్తుందని ప్రధాని ప్రకటించారు.
‘‘21వ శతాబ్దపు భారత అభివృద్ధికి తూర్పు భారతదేశమే ప్రధాన నాయకత్వం వహిస్తుంది. ఇది పూర్వోదయ యుగం" అని శ్రీ మోదీ ప్రకటించారు, ఈ స్ఫూర్తితో, మొత్తం తూర్పు ప్రాంతంతో పాటు ఒడిశా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన అన్నారు. ఏడాది క్రితం తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుందని పారాదీప్ నుంచి ఝార్సుగూడ వరకు పారిశ్రామిక జోన్ల విస్తరణ ఒడిశా ఖనిజ, ఓడరేవు ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. ఒడిశాలో రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని ప్రధాని చెప్పారు. పరదీప్ లో మెగా డ్యూయల్ ఫీడ్ క్రాకర్ అండ్ డౌన్ స్ట్రీమ్ యూనిట్ ఏర్పాటు, చండిఖోల్ లో ముడిచమురు నిల్వ కేంద్రం, గోపాల్ పూర్ లో ఎల్ఎన్జీ టెర్మినల్ వంటి ప్రాజెక్టులు ఒడిశాను ప్రధాన పారిశ్రామిక రాష్ట్రంగా నిలుపుతాయని ఆయన అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు పెట్రోలియం, పెట్రోకెమికల్స్, టెక్స్ టైల్స్, ప్లాస్టిక్ లకు సంబంధించిన పరిశ్రమలకు ఊతమిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇది చిన్న, మధ్యతరహా పరిశ్రమల విస్తృత వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తుందని, తద్వారా యువతకు లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. .ఇటీవలి సంవత్సరాల్లో ఒడిశా పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, భారతదేశ పెట్రోకెమికల్స్ హబ్ గా మారే దిశగా ఒడిశా వేగంగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
గొప్ప లక్ష్యాలను సాధించడానికి దూరదృష్టి, దీర్ఘకాల వ్యూహం అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఏడాది విజయాలు, అయిదేళ్ల లక్ష్యాలకే తమ ప్రభుత్వం పరిమితం కాబోదని స్పష్టం చేశారు. రాబోయే దశాబ్దాల కోసం దిశా నిర్దేశక ప్రణాళికను నిర్మిస్తున్నామని చెప్పారు. అదే విధంగా, ఒడిశా రాష్ట్రం ఏర్పాటు శతాబ్ది సంవత్సరం అయిన 2036 కోసం ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని ఆయన తెలిపారు. భారత స్వాతంత్ర్యానికి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి కూడా ఒడిశా బీజేపీ ప్రభుత్వం ఒక దిశానిర్దేశక ప్రణాళికను సిద్ధం చేసిందని ప్రధానమంత్రి తెలిపారు. విజన్ 2036 ను సమీక్షిస్తూ, అది చాలా మహత్తరమైన, లక్ష్యసాధన దిశగా బలమైన ప్రణాళిక అని పేర్కొన్నారు. అలాగే, ఒడిశా యువతలో ఉన్న ప్రతిభ, కృషి పట్ల తనకు పూర్తి నమ్మకముందని చెప్పారు.“మనమంతా కలిసి ఒడిశాను అభివృద్ధి మార్గంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం,” అని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ, మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, కేంద్రమంత్రులు శ్రీ జువల్ ఓరం, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
జిల్లాను జాతీయ రైల్వే నెట్ వర్క్ లో విలీనం చేయడానికి ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తూ, బౌధ్ జిల్లాకు రైలు కనెక్టివిటీని విస్తరించే కొత్త రైలు సేవలను ప్రధానమంత్రి ప్రారంభించారు.
క్లీన్ ఎనర్జీ, సుస్థిర రవాణాకు ఊతమిచ్చేలా, ఆధునిక, పర్యావరణహితమైన అర్బన్ మొబిలిటీ నెట్ వర్క్ కు మద్దతునిస్తూ క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ (సీఆర్ యూటీ) వ్యవస్థ కింద 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధానమంత్రి ప్రారంభించారు.
ఒడిశా విజన్ డాక్యుమెంట్ ను ప్రధాని విడుదల చేశారు. 2036 (భారతదేశ మొదటి భాషాపరమైన రాష్ట్రంగా ఒడిశా ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయ్యే సంవత్సరం), 2047 (భారత స్వాతంత్ర్యానికి 100 సంవత్సరాలు పూర్తయ్యే సంవత్సరం) వంటి కీలక సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ విజన్, సమగ్ర అభివృద్ధి కోసం ఒక దూరదృష్టితో కూడిన, భవిష్యత్కు సిద్ధంగా ఉన్న దార్శనిక ప్రణాళికను అందిస్తుంది.
గౌరవ ఒడియా ప్రముఖుల సేవలకు నివాళిగా ‘బరపుత్ర ఐతియా గ్రామ యోజన’ అనే కొత్త పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. వారి జన్మస్థలాల్లో మ్యూజియాలు, సమాచార అధ్యయన కేంద్రాలు, విగ్రహాలు, గ్రంథాలయాలు, ప్రజా స్థలాలు నిర్మించి, ఒడిశా వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా సాంస్కృతిక పర్యాటకానికి ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని రూపొందించారు.
16.50 లక్షలకు పైగా లఖ్పతి దీదీలను రాష్ట్ర సౌభాగ్యానికి, స్వావలంబనకు చిహ్నాలుగా అభివర్ణించిన ప్రధానమంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యాన్ని సాధించిన మహిళలను సన్మానించారు.
(Release ID: 2138198)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam