గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సీఎస్ఎంసీ మూడో సమావేశంలో పీఎంఏవై-అర్బన్ 2.0 కింద 2.25 లక్షల గృహాలు మంజూరు
పథకం కింద ఇప్పటివరకు మొత్తం 7.10 లక్షల గృహాలు మంజూరు
Posted On:
18 JUN 2025 6:21PM by PIB Hyderabad
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ కటికితల అధ్యక్షతన జూన్ 18న నిర్వహించిన మూడో ‘కేంద్ర అనుమతులు, పర్యవేక్షణ కమిటీ’ (సీఎస్ఎంసీ) సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 (పీఎంఏవై-యూ 2.0) కింద 2.35 లక్షల గృహాలకు నిర్మాణ అనుమతి లభించింది.
ఈ సమావేశానికి ‘హౌసింగ్ ఫర్ ఆల్’ (హెచ్ఎఫ్ఏ) మిషన్ డైరెక్టర్, సంయుక్త కార్యదర్శి శ్రీ కుల్దీప్ నారాయణ్.. వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, పీఎంఏవై-యూ మిషన్ డైరెక్టర్లు.. మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి మొత్తం 2,34,864 గృహాలు మంజూరయ్యాయి.
పీఎంఏవై-యూ 2.0 నాలుగు విభాగాల ద్వారా అమలవుతోంది – లబ్ధిదారుల ద్వారా నిర్మాణం, (బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ -బీఎల్సీ), భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో నిర్మాణం (అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్-ఏహెచ్పీ), చౌక ధరల్లో అద్దె ఇళ్ళు (అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్-ఏఆర్హెచ్), వడ్డీ రాయితీ పథకం (ఇంటరెస్ట్ సబ్సిడీ స్కీమ్-ఐఎస్సీ). తాజా సమావేశంలో మంజూరైన గృహాలు బీఎల్సీ, ఏహెచ్పీ విభాగాల కింద మంజూరయ్యాయి. ఇప్పటివరకు పీఎంఏవై-యూ 2.0 కింద మొత్తం 7,09,979 గృహాలు మంజూరయ్యాయి.
సమావేశం సందర్భంగా మంత్రిత్వశాఖ కార్యదర్శి మాట్లాడుతూ, పెద్ద రాష్ట్రాలు అందుబాటు ధరల్లో గృహానిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పీఎంఏవై-యూ 2.0 లోని ఏహెచ్పీ విభాగానికి అందించాలని సూచించారు. మహారాష్ట్రలో అమలవుతున్న ఆవాస విధానాన్ని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అధ్యయనం చేసి, దాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా అనుసరించవచ్చని సూచించారు. ప్రారంభ దశలోనే ఏహెచ్పీ విభాగ లబ్దిదారులను ఎంపిక చేయడం ద్వారా నిర్మాణం పూర్తయిన గృహాలు ఖాళీగా ఉండే సమస్యను నివారించవచ్చని పేర్కొన్నారు.
నేటి సమావేశంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, మంజూరైన ఇళ్ళలో 1.25 లక్షలకుపైగా ఇళ్ళు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులకు కేటాయించారు. మరో 44 గృహాలను ట్రాన్స్జెండర్లకు కేటాయించడం విశేషం. అణగారిన వర్గాలకు సామాజిక సమానత్వాన్ని అందించాలనే లక్ష్యంతో ఎస్సీ లబ్దిదారుల కోసం 42,400 గృహాలు, ఎస్టీ లబ్దిదారులకు 17,574 గృహాలు, ఓబీసీ లబ్దిదారులకు 1,13,414 గృహాలు కేటాయించారు.
పీఎంఏవై-యూ 2.0 ఏకీకృత వెబ్ పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తుల ధ్రువీకరణ, లబ్ధిదారుల పేర్ల జోడింపు ప్రక్రియను పూర్తి చేయాలని హెచ్ఎఫ్ఏ మిషన్ డైరెక్టర్, సంయుక్త కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. స్పెషల్ ఫోకస్ గ్రూప్స్ లబ్దిదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
పీఎంఏవై-యూ 2.0 కింద నగరాల్లో నివసించే 1 కోటి కుటుంబాలకు పక్కా ఇళ్ళు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు అవసరమైన ఆర్థిక సహాయం లభిస్తుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించే లక్ష్యంతో ఈ పథకం లబ్ధిదారులకు సురక్షితమైన గృహాలను అందిస్తుంది. దేశంలో ఎక్కడా పక్కా స్వంత ఇల్లు లేని వ్యక్తులు లేదా కుటుంబాలు ఈ పథకం ద్వారా ఇళ్ళు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు అర్హులు. ఒక్కో యూనిట్కు గరిష్ఠంగా రూ. 2.50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహాయం లభిస్తుంది.
2015 జూన్లో ప్రారంభమైన పీఎంఏవై-యూ పునరుద్ధరించబడి పీఎంఏవై-యూ 2.0గా కొనసాగుతోంది. పథకం కింద ఇప్పటివరకు 93.19 లక్షల గృహాలు నిర్మించి లబ్దిదారులకు అప్పగించారు. తాజా సంచికలో మరో 1 కోటి నిరుపేద(ఈడబ్ల్యూఎస్), ఎల్ఐజీ (అల్పాదాయ వర్గాలు), ఎంఐజీ(మధ్య తరగతి వర్గాలు) కుటుంబాలకు పక్కా ఇళ్ళను అందజేస్తారు.
అర్హులైన వారు నేరుగా https://pmay-urban.gov.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు లేదా తమ స్థానిక నగర పాలక సంస్థను సంప్రదించవచ్చు. ఏహెచ్పీ, బీఎల్సీ విభాగాలకు వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు గల కుటుంబాలు అర్హులు. ఐఎస్సీ విభాగానికి రూ. 9 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలు అర్హులు. దరఖాస్తుదారులందరూ (వారి కుటుంబ సభ్యులు సహా) కచ్చితంగా ఆధార్ లేదా ఆధార్ వర్చువల్ ఐడీను కలిగి ఉండాలి.
రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తాము అనుసరించే ఉత్తమ పద్ధతులను జాతీయ వేదికపై పంచుకోవాలని సమావేశ ముగింపు సందర్భంగా కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. పెద్ద నగరాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి (‘ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్’-టీఓడీ) నమూనాకు ప్రాధాన్యమివ్వాలని.. నమో భారత్, మెట్రో స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో పీఎంఏవై-యూ 2.0 కింద ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
****
(Release ID: 2137645)