గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చెత్త సేకరణలో విద్యుత్తు వాహనాల (ఈవీస్) చేరిక పట్టణ స్వచ్ఛ్ భారత్ పథకం(ఎస్బీఎమ్-యూ)లో గణనీయ మార్పులకు సూచిక
Posted On:
17 JUN 2025 1:01PM by PIB Hyderabad
స్వచ్ఛ, హరిత భారత్ ఆశయ సాధనలో భాగంగా, ఇంటి చెత్త సేకరణ విధుల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీస్)ను ప్రవేశపెట్టారు. దీంతో స్వచ్ఛ్ భారత్ మిషన్- అర్బన్ (ఎస్బీఎమ్-యూ)లో ఓ గణనీయ మార్పునకు నాందీప్రస్తావన చేసినట్లయింది. ఈ హరిత వాహనాలు రాబోయే కాలంలో పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక ప్రాతిపదికను కలిగి ఉండే తరహా పారిశుధ్య ముఖచిత్రాన్ని ఆవిష్కరించగలవు. ఈ ఈవీస్ రోజువారీ వ్యర్థాల సమస్యను సమర్ధంగా పరిష్కరిస్తూనే, అదే సమయంలో వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని తగ్గించనున్నాయి. సంప్రదాయ ఇంధనంతో నడుస్తున్న చెత్త వాహనాల స్థానంలో విద్యుత్తు వాహనాలు రావడం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గడమే కాకుండా నగరాలను శుభ్రంగా ఉంచాలన్న ఎస్బీఎమ్-యూ లక్ష్యానికి అనువుగా ఉన్నాయి. పొగకు తావు ఉండని రవాణా సాధనాలతో పాటే ఘన వ్యర్థాల నిర్వహణ.. ఈ రెండిటి మేలుకలయిక పర్యావరణ పరంగా మరింత బాధ్యతాయుత భవిష్యత్కాలానికి బాట వేస్తోంది.
ఇళ్ల నుంచి చెత్తను సేకరించడానికి 200కు పైగా విద్యుత్తు ఆటోలను రంగంలోకి దించి వ్యర్థాల నిర్వహణలో పర్యావరణానుకూల మార్పునకు ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి, సస్టెయినబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ పైలట్ అప్రోచ్ (ఎస్సీఐఏపీ)లో భాగంగా ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యూఎన్ఐడీఓ)తో పాటు గ్లోబల్ ఎన్విరాన్ మెంటల్ ఫెసిలిటీ (జీఈఎఫ్) మద్దతు అందిస్తోంది. వాస్తవ-కాల ప్రాతిపదికన పర్యవేక్షణ కొనసాగాలన్న ఉద్దేశంతో ఈ విద్యుత్తు ఆటోల్లో జీపీఎస్ ట్రాకింగు జోడించారు. ఈ ఆటోలు నగర పరిధిలో మొత్తం 159.46 కి.మీ చుట్టి వస్తున్నాయి. ఏటా 71,000 లీటర్లకు పైగా డీజిల్ వినియోగించాల్సిన అవసరాన్ని నివారించడం ద్వారా, ఈ ప్రాజెక్టు గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను చాలావరకు తగ్గించగలుగుతుంది. పది సంవత్సరాల కాలంలో రమారమి 21,000 టన్నుల ఉద్గారాలు వెలువడే ప్రమాదం ఇక ఉండదని ఒక అంచనా. వాయు నాణ్యతను పెంచనుంది. నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు సాంప్రదాయక చెత్త లారీలతో పోలిస్తే విద్యుత్తు ఆటోలు మరింత ఎక్కువ కాలం పనిచేయగలిగేవి కావడంతో, ఈ రకం వాహనాలు వ్యర్థాల నిర్వహణకు నగరపాలక సంస్థ పెట్టాల్సిన ఖర్చును ఆదా చేసే మార్గాన్ని చూపగలుగుతాయి. దీనికి అదనంగా, ఈ కార్యక్రమం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటుగా సేవలో విశ్వసనీయతను మెరుగుపరిచి, మొత్తంమీద పట్టణ సుస్థిరత్వానికి దన్నుగా కూడా నిలుస్తుంది.
నగరం అంతటా చెత్త సేకరణకు బ్యాటరీతో తిరిగే ఎలక్ట్రిక్ రిక్షాలను గ్రేటర్ చెన్నయ్ కార్పొరేషన్ (జీసీసీ) ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం పర్యావరణ అనుకూల అభివృద్ధి సాధన లక్ష్యానికి అనుగుణంగా ఉండడం ఒక్కటే కాకుండా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి నగర ప్రాంతాల్లోని కీలక సవాళ్లను కూడా పరిష్కరించగలుగుతుంది. ఇ-రిక్షాలు ప్రతి రోజూ ఇంచుమించుగా 40 కి.మీ ప్రయాణించగలవు. డీజిల్తో నడిచే లారీలకు బదులుగా ఇ-రిక్షాలు రంగంలోకి రావడంతో, నగరం ప్రతి రోజూ దాదాపు 41 టన్నుల కర్బన ఉద్గారాల బారి నుంచి తప్పించుకోగలుగుతుంది. ఏడాది కాలానికయితే ఇది 15,160 టన్నులుగా లెక్కకు వస్తుంది. ఇళ్లు, వాణిజ్య భవనాలు, నివాసేతర ప్రాంతాల నుంచి చెత్తను రోజూ పోగు చేసి తీసుకుపోవడానికి వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యేకంగా తయారు చేశారు. తడి చెత్త, పొడి చెత్తలతో పాటు అపాయకార వ్యర్థాల కోసం వేర్వేరు కుండీలను అమర్చిన ఈ ఇ-రిక్షాలు మూలం వద్దే చెత్తను వేరు చేసేందుకు తగిన ఏర్పాట్లను కూడా కలిగి ఉన్నాయి. ప్రస్తుతం, 5,478 ఇ-రిక్షాలను జీసీసీ నిర్వహిస్తోంది. ఇవి నగరంలోని మొత్తం 15 మండలాల్లో 24,621 వీధుల నుంచి చెత్తను తరలించడం ద్వారా 2 కోట్ల 10 లక్షల కుటుంబాలకు సేవలను అందిస్తున్నాయి. ఈ సమగ్ర వ్యవస్థ బహుళ ప్రయోజనాలను అందిస్తోంది. పెట్రోలు-డీజిల్ వంటి సాంప్రదాయక ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోవడం, నిర్వహణ- మరమ్మతు ఖర్చులు తక్కువ కావడం సున్నా స్థాయి ఉద్గారాల వల్ల పర్యావరణానికి కలిగే మేలు చాలా ఎక్కువ. ఈ కార్యక్రమంతో 6,000 మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ఇ-రిక్షాలలో శ్రవణ వ్యవస్థల (ఆడియో సిస్టమ్స్)ను జతపరచారు. దీంతో వివిధ వ్యర్థ పదార్థాలను వేరు చేసి అట్టిపెట్టడం ముఖ్యమంటూ ప్రత్యేక పాటలు, సార్వజనిక సమాచార ప్రచారం ద్వారా నగరవాసులను జాగృతం చేయడానికి కూడా వీలవుతోంది.
ఇంటి చెత్త సేకరణకు వాడుతున్న డీజిల్ వాహనాలకు బదులు 100 విద్యుత్తు వాహనాలను (ఇ-వెహికిల్స్)ను ఇండోర్ నగరపాలక సంస్థ ప్రవేశపెట్టి, పర్యావరణ స్థిరత్వంతో పాటుగా నిర్వహణ కార్యకలాపాల సామర్థ్యం దిశగా ఒక పెను మార్పునకు చొరవ తీసుకొంది. ఈ కార్యక్రమం, నగరంలోని రాజ్వాడా వంటి ప్రధాన ప్రాంతాలపై శ్రద్ధ తీసుకొంటూ, ఒక సంవత్సరంలో వాతావరణంలోకి చొరబడుతున్న కర్బన ఉద్గారాలను సుమారుగా 24,918 టన్నుల మేరకు తగ్గించడంలో తన వంతుగా తోడ్పాటును అందిస్తోంది. అంతేకాదు, చెత్త రవాణాకు అవసరమయ్యే ఇంధనంతో పాటు నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గడానికి కూడా దోహదపడుతోంది. సమీకృత కమాండ్, కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) పర్యవేక్షణలో వాస్తవ-కాల జీపీఎస్ ఊతం లభిస్తూ ఉండడంతో, ఈ వాహనాలు పారదర్శక సేవలనూ, జవాబుదారుతనాన్నీ పెంపొందించగలుగుతాయి. డీజిల్ వాహనాలకు స్వస్తి పలకడంతో ఇంధనానికీ, ఇంజిన్ ఆయిల్కూ, క్లచ్ మార్పిళ్లకూ నగరపాలక సంస్థ పెట్టవలసి వచ్చిన ఖర్చులతో పాటు మరమ్మతులను కూడా లెక్కలోకి తీసుకొంటే, ఏటా దాదాపు రూ.5.97 కోట్ల వరకు ఆదా అయ్యేందుకు అవకాశం ఉంది. హరిత ప్రధాన వాహనాలను దీర్ఘకాల ప్రాతిపదికన నడపడానికి నగరపాలక సంస్థ 20 సౌర చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఒక్కో స్టేషన్లోనూ 10 కేడబ్ల్యూ సౌర శక్తి ఫలకాలు అమర్చారు. వీటికి రోజుకు 800 యూనిట్ల నుంచి 1000 యూనిట్ల హరిత ఇంధనాన్ని అందించే సామర్థ్యం ఉంది. ఈ స్టేషన్లు నిత్యం 80 నుంచి 100 వాహనాలకు విద్యుత్తును సరఫరా చేయగలవు. దీంతో సాంప్రదాయక విద్యుత్తు వనరులపై ఆధారపడడం చాలావరకు తగ్గిపోతుంది.
గుంటూరు, చెన్నైతో పాటు ఇండోర్ వంటి నగరాలు ఈ తరహా మార్గదర్శక ప్రయత్నాలను చేపట్టి ‘స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్’లో భాగంగా స్వచ్ఛ, ఆకర్షణీయ, మరింత సుస్థిర పట్టణ వ్యర్థపదార్థాల నిర్వహణ దిశగా ఒక ప్రభావవంత మార్పును ఆవిష్కరించే చొరవను తీసుకుంటున్నాయి. విద్యుత్ వాహనాల వినియోగం, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సాంకేతికతలు.. వీటి వైపు ఈ నగరాలు మొగ్గు చూపి పర్యావరణపరంగా ప్రతికూల ప్రభావాలను తగ్గించడం ఒక్కటే కాకుండా నిర్వహణ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని ఇనుమడింపచేయడంతో పాటు, సమాజ శ్రేయస్సుకు కూడా తమ తోడ్పాటును అందిస్తున్నాయి.
***
(Release ID: 2136924)