నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశీయ జలమార్గాలపై ‘ఐడబ్ల్యుఎఐ’ సంప్రదింపుల వర్క్‌ షాప్‌: జాతీయ జలమార్గం 1 (ఎన్‌డబ్ల్యు-1) అభివృద్ధిపై దృష్టి


· ‘ఐడబ్ల్యుటి’ ద్వారా సుస్థిర సరకు-ప్రయాణిక రవాణాకు గంగానదీ మార్గం (ఎన్‌డబ్ల్యు-1) వినియోగంపై పాట్నాలో తొలి విధానపరమైన చర్చలు

· బీహార్.. ఉత్తర ప్రదేశ్.. జార్ఖండ్.. పశ్చిమ బెంగాల్లలో గంగానదిపై సరకు రవాణాలో 11 ఏళ్ల వృద్ధిమీద దృష్టి సారించనున్న మంత్రిత్వశాఖ వర్క్‌ షాప్

· జాతీయ జల మార్గాలపై పాట్నాలో చర్చలకు తొలిసారి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షత: ‘ఎన్‌డబ్ల్యు-1’ పరిధిలోని వారణాసి-హాల్దియా విభాగంలో సరకు రవాణాను 3 రెట్లు పెంచడంపై దృష్టి

Posted On: 14 JUN 2025 5:25PM by PIB Hyderabad


దేశీయ జలమార్గాల రవాణా అభివృద్ధి మీద... ప్రత్యేకించి గంగానది (ఎన్‌డబ్ల్యు-1) మార్గంపై దృష్టి సారిస్తూ ఈ నెల 16న భారత దేశీయ జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యుఎఐ) పాట్నా నగరంలో సంప్రదింపుల వర్క్‌ షాప్‌ నిర్వహించనుంది. జలమార్గాల అభివృద్ధి ప్రాజెక్టు (జెఎంవిపి) కింద బీహార్‌కు సంబంధించి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం మొట్టమొదటిది. ఈ భాగంగా అంతర-మంత్రిత్వశాఖల చర్చకు కేంద్ర ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమంలో బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల విధాన నిర్ణేతలు పాల్గొంటారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్, బీహార్ జలవనరుల మంత్రి విజయ్ చౌదరి, రవాణా మంత్రి షీలా కుమారి, ఉత్తర ప్రదేశ్ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ తదితరులు హాజరవుతారు. అలాగే కేంద్ర-రాష్ట్రాల సీనియర్ అధికారులు, సాంకేతిక నిపుణులు కూడా పాల్గొంటారు. ఈ చర్చల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిధిలోని గంగానదీ (ఎన్‌డబ్ల్యు-1) మార్గంలో గత 11 ఏళ్ల సరకు రవాణా వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.

దీనికి సంబంధించి ‘ఐడబ్ల్యుఎఐ ‘ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ- “దేశీయ జలమార్గాల రవాణా అభివృద్ధి మీద... ప్రత్యేకించి గంగానది (ఎన్‌డబ్ల్యు-1) మార్గంపై దృష్టి సారిస్తున్నాం. గంగానదిలో సరకులు-ప్రయాణిక అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం దిశగా మా కృషిలో కీలక పాత్ర పోషించే ఈ సంప్రదింపుల వర్క్‌ షాప్‌ను నిర్వహించడం మాకు గర్వకారణం. పాట్రాలో తొలిసారి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘ఎన్‌డబ్ల్యు-1’ పరిధిలోని వారణాసి-హల్దియా విభాగం అంతర్గత జల రవాణా (ఐడబ్ల్యుటి)కు ప్రధాన కూడలి కాగలదు. ఒక రోజంతా సాగే సమావేశంలో విధాన స్థాయి చర్చల సారాంశాన్ని తదుపరి సాంకేతిక చర్చలు మరింత బలోపేతం చేస్తాయి. ప్రాంతీయ వాణిజ్య అవకాశాలు కల్పన...  ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలతో సంధానం పెంపు, ఈ ప్రాంత ఆర్థిక వృద్ధికి చేయూత దీని ప్రధాన లక్ష్యాలు” అని వివరించారు.
గంగానదిపై జాతీయ జలమార్గం-1 రవాణా సామర్థ్య పునరుజ్జీవనం ద్వారా బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిధిలో ‘ఐడబ్ల్యుటి’ పునరుద్ధరణ దిశగా ‘జెఎంవిపి’ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు సజావైన రవాణా మార్గాల అభివృద్ధి (ఫెయిర్‌వే డెవలప్‌మెంట్), బహుళ రవాణా కూడళ్లు, అత్యాధునిక నావిగేషనల్ లాక్‌లు, కమ్యూనిటీ జెట్టీలు, ఆధునిక రవాణా ఉపకరణాలు, మెరుగైన నదీ నిర్వహణ వంటి లక్షిత కార్యకలాపాలతో దీర్ఘకాలిక సవాళ్లను ‘జెఎంవిపి’ పరిష్కరిస్తోంది. అంతేకాకుండా సరకులతో పాటు ప్రయాణిక రవాణా కోసం కూడా విశ్వసనీయ, సుస్థిర, పొదుపైన జలమార్గ రవాణా వ్యవస్థను రూపుదిద్దుతోంది.

 

***


(Release ID: 2136512)