గనుల మంత్రిత్వ శాఖ
కీలక ఖనిజాలపై సదస్సును ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
భారత్ లోని క్లిష్టమైన ఖనిజాల వ్యవస్థను ముందుకు నడిపించడానికి ఎన్ సిఎంఎం అవుట్ రీచ్ ఫోరాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి
Posted On:
06 JUN 2025 7:22PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు కీలక ఖనిజాల సదస్సును, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్ సిఎంఎం) కింద ఎన్ సిఎంఎం ఔట్ రీచ్ ఫోరాన్ని ప్రారంభించారు. న్యూఢిల్లీలో క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పై జరిగిన జాతీయ సదస్సులో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి ప్రధానోపన్యాసం చేస్తూ, దేశంలో పరిశుభ్రమైన ఇంధన మార్పు, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అధునాతన తయారీ రంగాల కోసం కీలకమైన ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరించారు.
సుస్థిర, స్వావలంబన కలిగిన కీలక ఖనిజాల వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, అంకుర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.
కీలక ఖనిజాల శుద్ధి, సాంకేతిక పరిజ్ఞానానికి అంతర్జాతీయ కేంద్రంగా మారాలన్న భారతదేశ దార్శనికతకు అనుగుణంగా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఔట్ రీచ్ ఫోరం కీలక వేదికగా పనిచేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు.
ఇటీవల జరిగిన వేలం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కీమ్ తదితర మిషన్ కార్యకలాపాల పురోగతిపై గనుల మంత్రిత్వ శాఖ ఒక అప్ డేట్ ను సమర్పించింది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్ అండ్ డీ సెంటర్లు, విద్యా సంస్థలు, ఏడీబీ, ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వ సంస్థల వంటి అంతర్జాతీయ ఫైనాన్సింగ్ ఏజెన్సీలు సహా సుమారు 200 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, గనుల మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న సిపిఎస్ఇ - హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే రైట్స్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలోనూ, విదేశాలలోనూ అన్వేషణ, వెలికితీత, శుద్ధి, ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టడం ద్వారా కీలక ఖనిజాలతో సహా లోహాలు, ఖనిజాల వేగవంతమైన, విశ్వసనీయమైన, స్థిరమైన సరఫరా వ్యవస్థ కోసం ఈ అవగాహన ఒప్పందాన్ని ఉద్దేశించారు. ఈ ఒప్పందం ప్రకారం కీలక ఖనిజాల కోసం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి రెండు కంపెనీలు తమ అనుబంధ సాంకేతిక, ఆర్థిక వనరులను ఉపయోగిస్తాయి.
సీనియర్ విధాన నిర్ణేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు, విద్యా సంస్థలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్న ఈ సదస్సులో పలు సాంకేతిక, విధాన చర్చలు జరిగాయి. పరిశోధనా సంస్థలకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంలో ఆవిష్కరణలు, తక్కువ గ్రేడ్, సంక్లిష్ట ధాతువుల ప్రాసెసింగ్ కోసం సమర్థవంతమైన పరిష్కారాలను సాధించడానికి అవకాశాలపై సాంకేతిక చర్చలు దృష్టి సారించాయి. సమర్థవంతమైన, స్థిరమైన ఖనిజశుద్ధి సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న కార్యక్రమాలపై ప్రముఖ ప్రైవేట్ రంగ నిపుణులు సమాచారాన్ని పంచుకున్నారు. కీలక ఖనిజాల ప్రాసెసింగ్ ను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి.
ఖనిజశుద్ధి సాంకేతిక పరిజ్ఞానాల్లో సాధించిన పురోగతి, మౌలిక సదుపాయాలు, అనుమతులను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, లిథియం, నికెల్, గ్రాఫైట్ వంటి కీలక ఖనిజ పరిశ్రమల ఆధ్వర్యంలోని శుద్ధి చర్యలు, పెట్టుబడులను హాని లేకుండా చేయడానికి వినూత్న ఆర్థిక నమూనాలు, రీసైక్లింగ్, విస్తృత ఉత్పత్తిదారుల బాధ్యతా పద్ధతుల ద్వారా పునరుపయోగ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.
రోజంతా జరిగిన ఈ సదస్సు- భారతదేశంలోనూ, భారతదేశం కోసం మైనింగ్, ప్రాసెసింగ్ పరిశ్రమలను బలోపేతం చేయడానికి ఆసక్తిదారులతో సంస్థల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు దోహదపడింది.
***
(Release ID: 2134749)