గనుల మంత్రిత్వ శాఖ
వేలం వేసిన ఖనిజ బ్లాకుల నిర్వహణను వేగవంతం చేసేలా ‘మైనింగ్ డాష్బోర్డ్’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
04 JUN 2025 5:07PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ‘మైనింగ్ డాష్బోర్డ్’ను ప్రారంభించారు. వేలం వేసిన ఖనిజ బ్లాకుల నిర్వహణ స్థితిని పర్యవేక్షించడంతోపాటు దేశవ్యాప్తంగా చట్టబద్ధమైన అనుమతులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవడం కోసం గనుల మంత్రిత్వ శాఖ రూపొందించిన కేంద్రీకృత డిజిటల్ వేదిక ఇది. ఖనిజ రంగంలో పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనాన్ని పెంపొందించేలా భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో ఈ కార్యక్రమం అంతర్భాగం.
గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957 (సవరించిన) కింద వేలం విధానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ఈ మైనింగ్ డ్యాష్బోర్డును ప్రారంభించడం ఓ ముఖ్యమైన మైలురాయి. ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 500 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు 466 బ్లాకులను, కేంద్ర ప్రభుత్వం 34 కీలక ఖనిజాల బ్లాకులను వేలం వేశాయి. వీటిలో 64 బ్లాకులు పనులు ప్రారంభించాయి.
అవరోధాలను గుర్తించడానికి వీలు కల్పిస్తూ, సకాలంలో పరిష్కారానికి అవకాశాన్నిస్తూ.. నిర్మాణాత్మకమైన, వాస్తవిక పర్యవేక్షణ విధానాన్ని ఈ డాష్బోర్డ్ అందిస్తుంది. తద్వారా మైనింగ్ కార్యకలాపాలు వేగంగా ప్రారంభమయ్యేలా సహాయపడుతుంది. ఆచరణీయ మార్గాలు, సమాచార ఆధారిత నిర్ణయాలతో చేయూతనివ్వడం ద్వారా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాజెక్టు ప్రతిపాదకులు, భాగస్వాములుగా ఉన్న అందరికీ కీలకమైన సాధనంగా ఇది ఉపయోగపడుతుంది.
దేశీయ ఖనిజ ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు మొత్తం భారత ఆర్థిక వృద్ధికి దోహదపడేలా మైనింగ్ డాష్బోర్డ్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
***
(Release ID: 2133991)