ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీ (పీఎస్‌జీఐసీ)ల సమీక్షా సమావేశం


* సరికొత్త నష్టభయాలపై దృష్టి సారిస్తూ నవకల్పన సహిత బీమా పథకాల్ని రూపొందించండి.. పీఎస్‌జీఐసీలకు శ్రీమతి సీతారామన్ ఆదేశం

* సేవల అందజేతలో, సామర్థ్యంలో మెరుగుదల కోసం పీఎస్‌జీఐసీలన్నింటా డిజిటల్ మార్పును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న కేంద్ర ఆర్థిక మంత్రి

Posted On: 28 MAY 2025 8:41PM by PIB Hyderabad

ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల (పీఎస్‌జీఐసీ)ల సమీక్షా సమావేశం బుధవారం (మే 28న) న్యూ ఢిల్లీలో జరగగా, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులతో పాటు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి శ్రీ ఎమ్. నాగరాజు, ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రీఇన్సూరెన్స్), అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ల మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ప్రీమియం వసూళ్లు, వివిధ బీమా సేవల లభ్యత ఎన్ని ప్రాంతాలకు విస్తరించింది?, బీమా కంపెనీలు చెల్లించిన క్లెయిముల నిష్పత్తులు ఏ విధంగా ఉన్నాయి? వంటి అంశాలతో పాటు పనితీరుకు సంబంధించిన కీలక సూచికలపై ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి సమీక్షించారు. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు సేకరించిన మొత్తం ప్రీమియమ్ విలువ 2019లో సుమారు రూ.80,000 కోట్లుగా ఉండగా ఈ ఏడాదిలో దాదాపు రూ. ఒక లక్షా ఆరు వేల కోట్లకు పెరిగినట్లు గమనించారు. సాధారణ బీమా పరిశ్రమ కూడా మొత్తంమీద వృద్ధిని నమోదు చేసింది.  2024–25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం కలెక్షన్లు రూ.3 లక్షల ఏడు వేల కోట్లకు చేరాయి.  

దేశంలో సాధారణ బీమా వ్యాప్తిని చూస్తే, 2023లో ప్రపంచ సగటు 4.2 శాతంతో పోల్చినప్పడు చాలా తక్కువగా- జీడీపీలో ఒక శాతం స్థాయిలో- ఉంది.  వివిధ బీమా సేవల లభ్యత మాత్రం వేగంగా విస్తరించింది. ఇది 2019లో 9 డాలర్ల స్థాయిలో ఉండగా, 2023లో 25 డాలర్లకు ఎగబాకింది. మరింత ఎక్కువ మందికి ఆర్థిక రక్షాకవచాన్ని సమకూర్చడానికి బీమా వ్యాప్తితో పాటు బీమా సేవల లభ్యతను కూడా మెరుగుపరిచే దిశగా ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక మంత్రి ప్రధానంగా చెప్పారు.

అయిదేళ్ల కాలంలో ఆరోగ్య బీమా విభాగం విశ్లేషణను కూడా అధికారులు ఈ సమావేశంలో నివేదించారు. ఈ విభాగంలో ప్రయివేటు బీమా సేవల సంస్థలు, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరర్ల (ఎస్ఏహెచ్ఐల)తో పాటు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రీమియంలో నిరంతరాయ వృద్ధి నమోదైనట్లు వారు వివరించారు. భరించిన క్లెయిముల నిష్పత్తులు 2021 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన కాలంలో అత్యధిక స్థాయిలో ఉన్నవి కాస్తా ఆ తరువాత తగ్గుతూ వస్తున్నాయి. అప్పట్లో ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు చెల్లించిన క్లెయిముల నిష్పత్తి 126 శాతంగాను, ప్రయివేటు బీమా సేవల సంస్థలు చెల్లించిన క్లెయముల నిష్పత్తి 105 శాతం గాను నమోదయ్యాయి. 24 ఆర్థిక సంవత్సరానికల్లా, ఈ నిష్పత్తులు ప్రయివేటు బీమా సేవల సంస్థల విషయంలో 103 శాతానికి,  ప్రయివేటు బీమా సేవల సంస్థల విషయంలో 89 శాతానికి, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరర్ల విషయంలో 65 శాతానికి పరిమితమయ్యాయి.
ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు చెప్పుకోదగ్గ మార్పును కనబరిచాయి. అవి అన్నీ మళ్లీ లాభాల బాట పట్టాయి. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఓఐసీఎల్) 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికం నుంచి, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎన్ఐసీఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికం నుంచి త్రైమాసికం వారీ లాభాలను ఆర్జించడం మొదలుపెట్టాయి. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ (యూఐఐసీఎల్) 7 సంవత్సరాల తరువాత 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభాన్ని ఆర్జించింది. న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏసీఎల్) వరుసగా మార్కెటులో అగ్రగామిగా నిలుస్తూ, తన స్థితిని పదిలపరుచుకుంటూ వచ్చింది. ఈ సంస్థ క్రమం తప్పక లాభాలు గడిస్తోంది.

సేవల అందజేతతో పాటు సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి  ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలన్నీ డిజిటల్ మార్పును ఆశ్రయించాల్సిన తక్షణ అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ఈ సమావేశంలో స్పష్టం చేశారు. దీనిలో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత క్లెయిము పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా మోటారు సామర్థ్య క్షీణత, ఆరోగ్య బీమా పథకాల విషయంలో ఈ పద్ధతిని అనుసరించాలని, ఇలా చేస్తే క్లెయిములను వేగంగా, మరింత కచ్చితత్వంతో పరిష్కరించడం సాధ్యపడుతుందని సూచించారు.

సైబర్ మోసాలకు తోడు కొత్తగా తెర మీదకు వస్తున్న నష్టభయాల (రిస్కుల)తో సరిపోలే నవకల్పనలతో కూడిన సరికొత్త బీమా సేవా పథకాలను రూపొందించాల్సిందిగాను, ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని తీర్చగల రకరకాల పథకాలను ప్రవేశపెట్టాల్సిందిగాను శ్రీమతి సీతారామన్ ఆదేశించారు. పటిష్టమైన అండర్‌రైటింగ్ పద్ధతులతో పాటు అనుకూల పోర్ట్‌ఫోలియోల రూపకల్పనకు పెద్దపీట వేయడం ముఖ్యమని తెలిపారు. వీటికి తోడు లాభదాయకతను, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ప్రపంచ పరిశ్రమ ప్రమాణాలతో సంయుక్త నిష్పత్తులు సరిపోలేటట్లు చూసుకోవాలని కూడా ఆదేశాలిచ్చారు.

వినియోగదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యాన్నివ్వడాన్ని శ్రద్ధ తీసుకోవాల్సి ఉన్న రంగంగా గుర్తించారు. వినియోగదారుల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడానికి, సామాజిక మాధ్యమాలతో అనుబంధాన్ని పటిష్టపరుచుకోవడానికి, ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) ప్రక్రియలు సహా అకౌంట్ ఎగ్రిగేటర్ వ్యవస్థతో ఎలాంటి ఇబ్బందులకు తావులేని విధంగా ఏకీకరణకూ పూనుకోవాలంటూ శ్రీమతి సీతారామన్ ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు ఆదేశాలిచ్చారు. ఈ చర్యలను ఆన్‌బోర్డింగును సరళతరం చేయడంతోపాటు వినియోగదారులకు మెరుగైన అనుభూతిని పంచడానికి ఉద్దేశించారు.

మార్కెట్ అందుబాటును విస్తరించడంతో పాటు సేవల లభ్యతను పటిష్టపరచడానికి మధ్యవర్తి సంస్థలతో, ఫిన్‌టెక్‌లతో, ఇన్సూర్‌టెక్ సంస్థలతో వ్యూహాత్మక సహకారం ఏర్పరుచుకోవాలంటూ ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు ప్రోత్సాహాన్ని అందించారు. దేశం అంతటా విస్తరించి ఉన్న ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల నెట్‌వర్కును ఈ భాగస్వామ్యాలు మరింత బలోపేతం చేస్తాయని, బీమా పథకాలను వివిధ వయోవర్గాల వినియోగదారుల చెంతకు  చేర్చడంలో తోడ్పడతాయని ఆశిస్తున్నారు.
కచ్చితత్వంతో కూడిన ధరల నిర్ధారణ నమూనాలను, సమర్థమైన క్లెయిముల నమూనాలను రూపొందించడంలో ఉన్నత సమాచార విశ్లేషణను (అడ్వాన్స్‌డ్ డేటా ఎనలిటిక్స్), కృత్రిమ మేధను (ఏఐ) సద్వినియోగపర్చుకోవడానికి పెద్దపీట వేయాలని కూడా ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇవి మెరుగైన నష్టభయ అంచనాకు, దీర్ఘకాల స్థిరత్వానికి ఎంతో అవసరమన్నారు.

ఈ ఆదేశాలను నిర్ణీత కాల ప్రాతిపదికన అమలు చేయాలని ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు సూచించారు. ప్రగతిని పర్యవేక్షించడానికీ, కోరుకున్న ఫలితాలను రాబట్టడానికీ క్రమం తప్పక సమీక్షలను చేపట్టనున్నారు.

 

***


(Release ID: 2132390)