భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటీఎమ్ అభివృద్ధి చేసిన అధిక విశ్లేషణసహిత ‘భారత్ ఫోర్‌క్యాస్ట్ సిస్టమ్’ను ఆవిష్కరించిన భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రపంచంలో ఈ తరహా మొట్టమొదటి సిస్టమ్‌లలో ఇది ఒకటి

* ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానంలో నిలిచి భారత్ పండుగ చేసుకుంటోంది: మంత్రి...
ముందస్తు అంచనాలను కచ్చితత్వంతో అందించడంలో మన ఉద్దేశం
సంభావిత నష్టాల్ని తగ్గిస్తూ, సంభావ్య లాభాలను పెంచుతూ ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడమే: మంత్రి

* గ్రామం వారీ నిర్దిష్ట ముందస్తు అంచనాలతో పాటు, ఇప్పుడున్న 12 కి.మీ.ల వాతావరణ ముందస్తు అంచనాల నమూనా నుంచి 6 కి.మీ.ల విశ్లేషణ దిశలో ఇది ఓ పెద్ద ముందంజ’’: డాక్టర్ జితేంద్ర సింగ్

* ఆచరణ రూపం దాల్చిన ప్రధాని శ్రీ మోదీ ‘నారీ శక్తి’ దార్శనికత...
‘భారత్ ఫోర్‌క్యాస్ట్‌’కు నలుగురు మహిళా శాస్త్రవేత్తల నాయకత్వం

Posted On: 26 MAY 2025 6:07PM by PIB Hyderabad

ప్రపంచంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధిక విశ్లేషణ సామర్థ్యం కలిగిన  (హై-రిజొల్యూషన్‌) వాతావరణ స్థితుల ముందస్తు అంచనా వ్యవస్థల్లో ఒకటైన ‘భారత్ ఫోర్‌క్యాస్ట్ సిస్టమ్’ను కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం (ఈ నెల 26న) విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో దేశ ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ, భారత్ తన ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి ఎగబాకిన విశిష్ట సందర్భాన్ని పండుగ చేసుకుంటున్న క్రమంలోనే ఒకటో స్థానానికి చేరుకోవాలని ఎదురుచూస్తోందన్నారు. ఈ కారణంగా మన ముందస్తు అంచనాలకు సంబంధించిన కచ్చితత్వం ఉద్దేశం.. సంభావిత నష్టాలను తగ్గించడంతో పాటు సంభావిత లాభాలను పెంపొందింప చేసుకొని ఆర్థిక వృద్ధికి తోడ్పడాలనేదే.. అని ఆయన చెప్పారు.
పుణె ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న భారత ఉష్ణమండల వాతావరణ అధ్యయన శాస్త్ర సంస్థ (ఇండియన్ ట్రాపికల్ మీటియరాలజీ ఇనిస్టిట్యూట్..ఐఐటీఎమ్) అభివృద్ధిపరిచిన ఈ అత్యాధునిక వ్యవస్థ దేశంలో వాతావరణ ముందస్తు అంచనా విశ్లేషణను 12 కిలోమీటర్ల నుంచి పెంచి, 6 కి.మీ. స్థాయికి చేరుస్తుంది.  దీనితో భారత్‌లో ప్రతి గ్రామానికీ ఎక్కువ కచ్చితత్వంతో నిర్దిష్ట ప్రాంత- ప్రధానమైన ముందస్తు అంచనాలను అందించడంలో అండదండలు లభించనున్నాయి. ఈ ప్రగతి మన దేశ వాతావరణ సేవల్లో ఒక పెద్ద ముందంజే కాకుండా ‘ఆత్మనిర్భర్ భారత్’తో పాటు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాల్లో భాగంగా  చెప్పుకోదగిన ఒక సాఫల్యం కూడా అని చెప్పవచ్చు.
 
‘‘దేశీయంగా సాధించిన ఈ విజయం వాతావరణ ముందస్తు అంచనాల్లో ప్రపంచ అగ్రగామి దేశాల సరసన ఇండియాను నిలబెడుతోంది.  ఇది ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన ఎదుగుదలకు గౌరవపూర్వక నిదర్శనం. అంతేకాదు.. అత్యాధునిక, స్వయంసమృద్ధ విజ్ఞానశాస్త్ర సంబంధిత పరిష్కారాలను కనుగొనడంలో మన సత్తా ఎంతటిదో ఇది చాటిచెబుతోంది.  దేశం సాధించిన గొప్ప విజయాల్లో ఇదిమరో విజయం’’ అని డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు. ఆయన కేంద్ర విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం - పృథ్వీ శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం, అణు శక్తి విభాగం మరియు అంతరిక్ష విభాగం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రిగా పదవీబాధ్యతలను నిర్వహిస్తున్నారు.

భారత్ ఫోర్‌క్యాస్ట్ సిస్టమ్ (భారత్ ముందస్తు అంచనాల వ్యవస్థ)కు నలుగురు మహిళా శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారని, ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్న ‘నారీ శక్తి’ దార్శనికతకు అద్దం పడుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ‘‘విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖలు ఇక మహిళలకు సాధికారతను కల్పించడం లేదు, మేమే వారి (మహిళల) వల్ల సాధికారతను సంతరించుకొంటున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్సాహాన్ని పెంచే ఒక కబురును డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడిస్తూ, భారత్ ముందస్తు అంచనాల వ్యవస్థకు నాయకత్వాన్ని నలుగురు మహిళా శాస్త్రవేత్తలు అందిస్తున్నారన్నారు. ‘‘ఇందులో ప్రయత్నాలు భారత్‌వి, సాంకేతికత భారత్‌ది, లబ్ధిదారులు కూడా భారతీయులే. సిసలైన ఆత్మనిర్భరత (స్వయంసమృద్ధి) అంటే ఇదే. దీనికి తోడు, ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అన్నిటి కంటే క్లిష్టమైన, పెనుమార్పులకు లోనవుతూ సవాళ్లబారిన పడుతున్న ఇతర ఉష్ణమండలీయ ప్రాంతాలకు సైతం ప్రయోజనాలను అందిస్తుంది’’ అంటూ ఆయన వివరించారు.
‘వికాస్ సే విరాసత్’ (అభివృద్ధి నుంచి వారసత్వం వరకు) గొప్పతనంతో పాటు, వ్యవసాయం వంటి సాంప్రదాయక రంగాలకు మద్దతివ్వడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలన్న ప్రభుత్వ నిబద్ధతను మంత్రి డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ వ్యవస్థ విపరీత వాతావరణ ముందస్తు అంచనాల్లో మెరుగుదలకు తోడ్పడుతూ పంట నష్టాన్ని, వ్యత్యాసాలను తగ్గించడంలో దోహదపడుతుందన్నారు. అంతేకాక, ‘త్రికోణీయ ఘన అష్టముఖీయ గ్రిడ్ నమూనా’ (ట్రయాంగులర్ క్యూబిక్ ఆక్టాహెడ్రల్ గ్రిడ్ మోడల్)పై ఆధారపడ్డ వాస్తవ కాల మోడలింగును ఉపయోగించుకొంటూ తీవ్ర వర్షపాత ముందస్తు అంచనాల్లో 30 శాతం మెరుగుదలతో పాటు కోర్ జోన్లలో 64 శాతం వృద్ధికి సాయపడుతుందని కూడా ఆయన అన్నారు.    

ఐఐటీఎమ్, భారత వాతావరణ అధ్యయన విభాగం (ఐఎండీ), భారతీయ అంతరిక్ష పరిశోధనసంస్థ (ఇస్రో)లతో పాటు ఇతర సంస్థల మధ్య ‘‘సంపూర్ణ విజ్ఞానం’’, ‘‘సంపూర్ణ ప్రభుత్వం’’ వైఖరుల మధ్య నిరంతర సమన్వయాన్ని మంత్రి ప్రశంసించారు. ఈ విధమైన సహకారంతో భారత సమగ్ర విజ్ఞాన శాస్త్ర వ్యూహానికి బలం సమకూరినట్లయింది.
ఐఎండీ 150వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొనడాన్ని, ఇటీవలే  ‘మిషన్ మౌసమ్’ను మొదలుపెట్టడాన్ని మంత్రి ప్రస్తావించారు. ‘ఐఎండీ ముందస్తు అంచనాల వెల్లడి సామర్థ్యం గత పదేళ్ల కాలంలో గణనీయంగా పెరిగింది’’ అని ఆయన చెప్పారు. ‘మిషన్ మౌసమ్‌’లో భారత వాతావరణ మార్పు ముందస్తు అంచనాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల స్థాయిని పెంచడానికి రూ.2000 కోట్ల బడ్జెటును కేటాయించడం గమనించదగ్గది.

జీవించడంలో, వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్నిపెంచడంలో భూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ, ఐఎండీలు పోషిస్తున్న పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఎందుకంటే వ్యవసాయం, అంతరిక్షం, రవాణా సహా 20కి పైగా మంత్రిత్వ శాఖలు ప్రతి రోజూ వాతావరణ సేవలపై ఆధారపడుతుంటాయి అని ఆయన అన్నారు. ముందస్తు అంచనాలను వాటితో అవసరమున్న ప్రతి వర్గానికీ తెలియజేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనివల్ల పౌరులతో పాటు రైతులకు కూడా సూచించిన నిర్ణయాలను తీసుకోవడానికి, నష్టభయాలను (రిస్క్‌స్) తగ్గించుకోవడానికి సాయం అందుతుంది.
విజ్ఞ‌ానశాస్త్ర సంబంధిత సమాచారాన్ని అందించడంలో అన్ని భాషలను కలుపుకొని ముందుకుసాగుతున్న ఐఐటీఎమ్ హిందీ రాజభాషా పత్రిక ‘‘ఇంద్రధనుష్’’ను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ ఇదే కార్యక్రమంలో ఆవిష్కరించారు.

 

***


(Release ID: 2131658)
Read this release in: English , Urdu , Hindi , Odia , Tamil