రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో ఎనిమిది డీపీఎస్యూల పనితీరుపై రక్షణ మంత్రి సమీక్ష: సమావేశంలో పాల్గొన్న సంస్థల సీఎండీలు
* ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత రక్షణ సన్నద్ధతను ప్రదర్శించిన ఉత్పత్తులను అభివృద్ధి చేసిన డీపీఎస్యూలతో సహా రక్షణ రంగ పరిశ్రమకు ప్రశంసలు
* నూతన రంగాల్లో పరిశోధన, అభివృద్ధి పెంచి నూతన సాంకేతికతలను ఉత్పత్తిని విస్తరింపచేయాలని డీపీఎస్యూలకు సూచన
* రక్షణ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు, డీపీఎస్యూల పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీ రాజ్నాథ్ సింగ్
Posted On:
26 MAY 2025 7:29PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లో మే 26న ఎనిమిది ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ (డీపీఎస్యూ)ల సీఎండీలతో రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతీయ భద్రతా బలగాల సన్నద్ధతను ప్రదర్శించిన ఆయుధ వ్యవస్థలు, సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో డీపీఎస్యూలతో సహా మొత్తం పరిశ్రమ పోషించిన ప్రాతను రక్షణ మంత్రి ప్రశంసించారు. రక్షణ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి, డీపీఎస్యూల మధ్య పోటీ తత్వాన్ని పెంచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆధునిక యుద్ధ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై మరింత దృష్టి సారించి నూతన సాంకేతికతల ఉత్పత్తిని పెంపొందించాలని డీపీఎస్యూలకు శ్రీ రాజ్నాథ్ సింగ్ సూచించారు.
ఈ సమావేశంలో డీపీఎస్యూల పనితీరును తెలియజేసే గణాంకాలను కార్యదర్శి (రక్షణ ఉత్పత్తులు) శ్రీ సంజీవ్ కుమార్ సమర్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రూ.1,40,000 కోట్లకు పైగా ఉంటుందని, వాటిలో 78 శాతం వాటా డీపీఎస్యూలదే అని తెలిపారు.
డీపీఎస్యూల ఉత్పత్తి విలువలో పెరుగుదలను రక్షణ మంత్రి ప్రశంసించారు. అయితే నిర్దేశించిన సమయానికి భద్రతా బలగాలతో పాటు ఇతర వినియోగదారులకు ఉత్పత్తులను సరఫరా చేయాలని సూచించారు. ఎగుమతుల పెరుగుదలలో డీపీఎస్యూల పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ఉత్పత్తుల మార్కెటింగ్పై దృష్టి సారించాలని ఆదేశించారు.
మహారత్న హోదాను పొందిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), నవరత్న హోదాను పొందిన మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్)కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎనిమిది డీపీఎస్యూల సీఎండీలు - హెచ్ఏఎల్, ఎండీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని), గార్డెన్ రీచ్ షిఫ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ), గోవా షిప్యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్), బీఈఎంఎల్ లిమిలెడ్ - సంస్థల్లో ప్రభుత్వానికి ఉన్న ఈక్విటీ షేర్లకు సంబంధించి రూ. 2,138 కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్ చెక్కులను సమర్పించారు.
***
(Release ID: 2131591)