కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రుణ పథకాలను భారత్లో నలుమూలలకు సులభంగా చేరవేయడానికి ఆదిత్య బిర్లా కేపిటల్ సంస్థతో జట్టు కట్టిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు
Posted On:
22 MAY 2025 3:47PM by PIB Hyderabad
రుణ పథకాలను దేశం అంతటా సులభంగా అందించడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ), ఆదిత్య బిర్లా కేపిటల్ సంస్థ (‘ఏబీసీఎల్’) ప్రకటించాయి. ఈ సంస్థల్లో ఐపీపీబీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ‘ఏబీసీఎల్’ విభిన్న ఆర్థిక సేవలను అందిస్తున్న ప్రధాన సంస్థల్లో ఒక సంస్థ.
ఈ భాగస్వామ్యం ఆదిత్య బిర్లా క్యాపిటల్కు చెందిన వివిధ రుణ ఉత్పాదనలను ఐపీపీబీ విస్తృత నెట్వర్క్తోపాటు డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యవస్థతోనూ అనుసంధానిస్తుంది. దేశవ్యాప్త ఐపీపీబీ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యాలకూ తావు లేని విధంగా రుణలభ్యతకు తోడ్పడడం ఈ భాగస్వామ్య ఉద్దేశం. ఈ సహకారానికి బాటవేయడం ద్వారా, ఐపీపీబీ తన వినియోగదారుల సమూహానికి ఆదిత్య బిర్లా క్యాపిటల్ బహుళ రుణ పథకాలను రెఫరల్ సర్వీస్ రూపంలో అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ రుణ పథకాల్లో.. వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, ఆస్తిపై ఇచ్చే రుణాలు వంటివి భాగంగా ఉన్నాయి.
ఐపీపీబీ వినియోగదారులు ఇక ఆదిత్య బిర్లా క్యాపిటల్కు చెందిన అత్యాధునిక డిజిటల్ వేదికల అండదండలతో రుణ సదుపాయాలను పొందగలుగుతారు. దీంతో ఆమోదం త్వరగా లభింస్తుంది. సమర్పించాల్సిన దస్తావేజుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా రుణ పంపిణీ ముగుస్తుంది. ఈ అనుబంధ విస్తారిత వ్యవస్థ అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ), సమాచార విశ్లేషణ (డేటా ఎనలిటిక్స్)ను సంధానించి దేశం అంతటా వినియోగదారుల విభిన్న అవసరాలను నెరవేరుస్తూ, వ్యక్తిగత ఆర్థిక సేవలను అందజేయనుంది.
భాగస్వామ్యంపై ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఎండీ, సీఈఓ శ్రీ ఆర్. విశ్వేశ్వరన్ మాట్లాడుతూ, ‘‘మేం ఆదిత్య బిర్లా క్యాపిటల్కు చెందిన వైవిధ్య భరిత రుణ పథకాలను మా వినియోగదారులకు అందించగలుగుతామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ భాగస్వామ్యం మా కస్టమర్లకు సరళతర డిజిటల్ మాధ్యమ రుణ దరఖాస్తు ప్రక్రియతోపాటు అనేక సౌలభ్యాలతో కూడిన ఐచ్ఛికాలతో రుణ ప్రాప్తి సులభంగా మారడానికి వీలు కల్పిస్తుంది. ఈ సహకారం బ్యాంకింగ్ ఉత్పాదనలు, సేవలలో అత్యుత్తమమైన వాటిని అన్నింటినీ భారత్లో ప్రతి ఒక్కరికీ అందించాలన్న మా దృష్టికోణానికి అనుగుణంగా ఉంది’’ అన్నారు.
ఆదిత్య బిర్లా క్యాపిటల్ కార్యనిర్వాహక డైరెక్టరు, ఎన్బీఎఫ్సీ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా నియామకం జరిగిన (సీఈఓ డిజిగ్నేట్) శ్రీ రాకేశ్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఆర్థిక సేవలను సమాజంలో అందరి చెంతకు చేర్చడాన్ని ముమ్మరం చేసే, వ్యక్తులతో పాటు వాణిజ్య సంస్థలకు కూడా ఇట్టే రుణాలను అందించాలన్నదే మా దృష్టికోణం. దీనికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం రూపుదిద్దుకొంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు విస్తృత వ్యవస్థతో పాటు మా సరళతర డిజిటల్ మాధ్యమ రుణ దరఖాస్తు ప్రక్రియను సద్వినియోగపరుచుకొంటూ సౌకర్యవంతంగా ఉండే, సులభ రుణ ఐచ్ఛికాలతో పెద్ద సంఖ్యలో ఉండే వినియోగదారుల సమూహానికి సేవ చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అన్నారు.
ఈ సహకారం వ్యక్తులకు ఆర్థిక సేవల అందజేతను బలోపేతం చేయడంతో పాటు వారి పురోగతిని ప్రోత్సహించాలన్న ఐపీపీబీ-ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఉమ్మడి నిబద్ధతను ప్రధానంగా చాటిచెబుతోంది. నష్ట భయంలో తనకు (ఐపీపీబీ కి) ఎలాంటి ప్రమేయమూ ఉండని, రుణ మంజూరు పూర్తిగా ఏబీసీఎల్ వివేకంపైనే ఆధారపడే పద్ధతిలో ఐపీపీబీ రెఫరల్ భాగస్వామి పాత్రను పోషించనుంది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకును గురించి:
కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేసే తపాలా విభాగంలో ఓ భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ను (ఐపీపీబీ) ఏర్పాటు చేశారు. దీనిలో 100 శాతం మూలధనం భారత ప్రభుత్వం సమకూర్చిందే. ఐపీపీబీని 2018 సెప్టెంబరు 1న ప్రారంభించారు. మన దేశంలో సామాన్య మానవుడికి చాలా చేరువగా ఉండే, చౌకగా సేవలను అందించే, విశ్వాసనీయమై బ్యాంకును ప్రసాదించాలన్న విజన్తో ఈ బ్యాంకును స్థాపించారు. సమాజంలో బ్యాంకింగ్ సేవలను అంత ఎక్కువగా అందుకోలేకపోతున్న వర్గాల వారితో పాటు ఈ తరహా సేవలకు అసలు ఎంతమాత్రం నోచుకోని వర్గాల వారికి అలాంటి అడ్డంకులను తొలగించాలన్నది ఐపీపీబీకి ఇచ్చిన విధియుక్త ఆజ్ఞ. అలాగే దేశంలో 1,65,000 వరకు ఉన్న తపాలా కార్యాలయాలతో పాటు సుమారు 3 లక్షల మంది తపాలా ఉద్యోగుల నెట్వర్కును ఉపయోగించుకొంటూ సమాజంలో అందరికీ సేవలను అందించడం కూడా ఐపీపీబీని స్థాపించడంలో మరో ప్రధానోద్దేశం.
ఐపీపీబీ విస్తతి, అది తన కార్యకలాపాలను నిర్వహించే నమూనా ఇండియా స్టాక్ (India Stack) కీలక స్తంభాల మీద ఆధారపడి ఉంది... ఇవి ఏవేవి అంటే, వాటిలో- సీబీఎస్ ద్వారా సంధానించిన స్మార్ట్ఫోన్, బయోమెట్రిక్ సాధనం మాధ్యమం- వీటి ద్వారా వినియోగదారులకు వారి ఇంటి ముంగిటే సరళమైన, సురక్షితమైన పద్ధతిలో కాగితాలతో పని ఉండని, నగదు చలామణితో పని పడనటువంటి, హాజరు అక్కర్లేని బ్యాంకింగ్ సేవలను అందించడం. తక్కువ ఖర్చులో నవకల్పన ప్రయోజనాలను అందుకొంటూ, సాధారణ ప్రజలకు బ్యాంకింగును తేలికపరచడంపైన ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడంతో పాటు, భారత్లోని 5.57 లక్షల గ్రామాలు, పట్టణాల్లో 11 కోట్ల మంది వినియోగదారులకు 13 భాషల్లో సరళమైన, చౌకైన బ్యాంకింగ్ సేవలను ఐపీపీబీ అందిస్తోంది.
నగదు అవసరం తక్కువగా ఉండే తరహా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికీ, డిజిటల్ ఇండియా దృష్టికోణానికి తన వంతు తోడ్పాటును అందించడానికీ ఐపీపీబీ కట్టుబడి ఉంది. దేశంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక భద్రత లభించినప్పుడు, సాధికారతను సంతరించుకున్నప్పుడు... అప్పుడే భారత్ సమృద్ధమవుతుంది. ‘ప్రతి వినియోగదారూ ముఖ్యమే, ప్రతి లావాదేవీ ప్రముఖమే, మరి ప్రతి డిపాజిటూ విలువైందే’నన్న మన ఆదర్శ వాక్యం సార్థకమవుతుంది. మమ్మల్ని ఇక్కడ సంప్రదించగలరు: marketing@ippbonline.in
***
(Release ID: 2130742)