భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
గోవాలోని “పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్” వద్ద "సాగర్ భవన్", "పోలార్ భవన్" కేంద్రాలను ప్రారంభించిన భూవిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్యలో గల ఈ రకం కేంద్రాలు మొదటిసారిగా భారత్లో ప్రారంభం
ప్రపంచ దేశాలన్నీ మహాసముద్రాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నం
ఈ తరుణంలో, భౌగోళిక రాజకీయాల్లో మెరుగైన భారత్ పాత్రను రానున్న కాలంలో ఈ సంస్థ మరింత సులభతరం చేస్తుంది
మహాసముద్రాలపై ఆధిపత్యం కోసం చేస్తున్న రాజకీయాల్లో భారత్ ప్రపంచస్థాయి పాత్ర పోషించేందుకు ఇది వీలు కల్పిస్తుంది: కేంద్రమంత్రి
వాతావరణ నమూనాల అధ్యయనంలో, వాతావరణ సమస్యల పరిష్కారంలోనూ ఈ సంస్థ ఆధిపత్యానికి వీలు కల్పించనున్న కొత్త కేంద్రాలు : డాక్టర్ జితేంద్ర సింగ్
భారత తీరప్రాంత రక్షణ కోసం ధ్రువాల వద్ద కరుగుతున్న మంచు పర్యవేక్షణ అత్యవసరమని స్పష్టం చేసిన మంత్రి
బ్లూ ఎకానమీ పట్ల ప్రధానమంత్రి దార్శనికతను ఉటంకిస్తూ, దేశ అభివృద్ధిలో సముద్ర శాస్త్ర పాత్ర కీలకమని వ్యాఖ్య
Posted On:
22 MAY 2025 5:36PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్రసాంకేతిక, భూవిజ్ఞాన (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, అణుఇంధనం, అంతరిక్ష శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు..పింఛనుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గోవాలోని "నేషనల్ సెంటర్ ఆఫ్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్" (ఎన్సీపీవోఆర్) వద్ద "సాగర్ భవన్", "పోలార్ భవన్" కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి కొద్ది సంఖ్యలో ఉన్న ఈ రకం కేంద్రాలను దేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేశారు.
ప్రపంచ దేశాలన్నీ మహాసముద్రాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో, రాబోయే కాలంలో భౌగోళిక రాజకీయాల్లో భారత పాత్రను మెరుగుపరిచేందుకు, మహాసముద్రాలపై ఆధిపత్యం కోసం చేసే రాజకీయాల్లో భారత్ ప్రపంచస్థాయి పాత్రను పోషించేందుకు ఈ సంస్థ దోహదం చేస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. అదనంగా, వాతావరణ నమూనాల అధ్యయనంలో, వాతావరణ సమస్యల పరిష్కారంలోనూ ఈ సంస్థ ఆధిపత్యం సాధించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు వీలు కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ధృవాలు, మహాసముద్రాల అధ్యయనాలపై భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రం కీలక ముందడుగు కానుంది.
ఎన్సీపీవోఆర్ రజతోత్సవ సందర్బంగా మంత్రి పర్యటన యాదృచ్ఛికం.
ఎన్సీపీవోఆర్ 25 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానంగా ప్రదర్శించే ఒక డాక్యుమెంటరీని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఆసక్తికరమైన, సైన్స్ ఆధారితమైన ప్రజా భాగస్వామ్య అనుభవాలను అందించే వేదికగా భావిస్తున్న మ్యూజియం త్వరలో ఏర్పాటు కానున్న క్రమంలో కేంద్రమంత్రి దాని విశేషాలను వీడియో మాధ్యమం ద్వారా తెలుసుకున్నారు. భౌగోళిక వ్యవస్థలు, వాతావరణ సంబంధిత డేటాను ప్రదర్శించే త్రిమితీయ దృశ్య మాధ్యమ వేదిక అయిన “సైన్స్ ఆన్ స్పియర్ (ఎస్ఓఎస్)” ను కూడా ఆయన ప్రారంభించారు.
ప్రస్తుతం ఎన్సీపీవోఆర్ క్యాంపస్లోనే అతిపెద్ద భవనం అయిన పోలార్ భవన్ను 11,378 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, రూ.55 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో ధృవాలు, మహాసముద్రాల పరిశోధన కోసం ప్రయోగశాలలు, శాస్త్రీయ సిబ్బంది కోసం 55 గదులు, ఒక సమావేశ మందిరం, సెమినార్ హాల్, గ్రంథాలయం, క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కొత్తగా ప్రారంభించిన ఎస్ఓఎస్ కూడా ఇక్కడ ఉంది. అలాగే ఇది భారత మొట్టమొదటి పోలార్, మహాసముద్ర మ్యూజియంగా కూడా ఉపయోగపడనుంది.
1,772 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, రూ. 13 కోట్ల వ్యయంతో సాగర్ భవన్ నిర్మించారు. ఇందులో రెండు మైనస్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఐస్ కోర్ ప్రయోగశాలలు, అలాగే అవక్షేపాలు, జీవసంబంధ నమూనాల నిల్వ కోసం +4 డిగ్రీ సెంటీగ్రేడ్ నిల్వ యూనిట్లు ఉన్నాయి. ఈ భవనంలో 29 గదులు కూడా ఉన్నాయి. వీటిలో ట్రేస్ మెటల్, ఐసోటోప్ అధ్యయనాల కోసం లోహ రహిత క్లాస్ 1000 క్లీన్ రూమ్ కూడా ఉంది.
వెచ్చగా ఉండే అంటార్కిటికా దుస్తులు ధరించిన డాక్టర్ జితేంద్ర సింగ్ మైనస్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల ప్రయోగశాల విభాగాన్ని కూడా సందర్శించారు.
ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఎన్సీపీవోఆర్ సమీకృత ధ్రువాలు, మహాసముద్రాల పరిశోధన సామర్థ్యాలు గల సంస్థల సరసన చేరిందని మంత్రి తెలిపారు. ధృవ సంబంధ దృగ్విషయాల విషయంలో హద్దులు లేనందున, ఈ సంస్థ శాస్త్రీయ ప్రయత్నాలు ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయని ఆయన తెలిపారు.
నిపుణుల అంచనాలను ఉటంకిస్తూ, ప్రపంచంలోని సుమారు 70 శాతం మంచినీరు ధృవాల వద్ద మంచు రూపంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ మంచు వేగంగా కరిగితే, సముద్ర మట్టాలు ఒక్కసారిగా పెరిగి లోతట్టు తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ప్రస్తుత భారత తీరప్రాంతం 1,000 కిలోమీటర్లకు పైగా ఉందన్న అంచనాల క్రమంలో, ఇటువంటి మార్పులు నిరంతర శాస్త్రీయ పర్యవేక్షణ, ప్రతిస్పందన అవసరం అయ్యే పర్యావరణ, సామాజిక-ఆర్థికపరమైన సవాళ్లను కలిగిస్తాయని తెలిపారు.
అంటార్కిటికా (మైత్రి, భారతి స్టేషన్లతో), ఆర్కిటిక్ (హిమాద్రి), హిమాలయాలు (హిమాన్ష్) వంటి కీలక జోన్లలో భారత్ పరిశోధనలను కొనసాగించడంలో ఎన్సీపీవోఆర్ పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దేశ బ్లూ ఎకానమీ ప్రణాళికలో కీలకమైన భారత డీప్ ఓషన్ మిషన్కు కూడా ఈ సంస్థ మార్గదర్శనం చేస్తుందన్నారు.
దేశ అభివృద్ధి లక్ష్యాలతో మహాసముద్ర విజ్ఞానాన్ని అనుసంధానిస్తూ, ప్రపంచ వ్యవహారాల్లో మహాసముద్రాలపై ఆధిపత్యం కోసం చేసే రాజకీయాల ఔచిత్యం పెరుగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రభుత్వ దార్శనికత పరంగా, ఎన్సీపీవోఆర్ వంటి సంస్థలు భారత శాస్త్రీయ, వ్యూహాత్మక కార్యకలాపాల కేంద్రంగా ఉంటాయన్నారు. ఎర్రకోట నుంచి వరుసగా రెండు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ప్రధానమంత్రి బ్లూ ఎకానమీ, డీప్ ఓషన్ మిషన్ ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
భారత ఆర్కిటిక్ విధానం (2022), భారత అంటార్కిటిక్ చట్టం (2022) ధృవ ప్రాంతాల్లో సైన్స్ ఆధారితమైన, పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన కార్యకలాపాల నిర్వహణకు వీలు కల్పించే మార్గదర్శక విధానాలుగా డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రమాణాలకు అనుగుణంగా, ఆ ఖండంలో భారత కార్యకలాపాలకు భారత అంటార్కిటిక్ చట్టం చట్టపరమైన పునాదిని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు సీజన్స్ వ్యాప్తంగా మిషన్లు కెనెడియన్ ఆర్కిటిక్, గ్రీన్ల్యాండ్, సెంట్రల్ ఆర్కిటిక్ మహాసముద్రంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో, ధృవాల ప్రాంతంలో భారత పరిశోధన ఇటీవలి సంవత్సరాల్లో దాని భౌగోళిక, తాత్కాలిక పరిధిని మించి విస్తరించిందని తెలిపారు.
ప్రపంచ వాతావరణ, మహాసముద్ర సంబంధిత కార్యక్రమాల్లో వ్యూహాత్మక, సైన్స్ ఆధారిత భాగస్వామ్యం అవసరం ఎంతగానో ఉందని స్పష్టం చేస్తూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఎన్సీపీవోఆర్లో ఏర్పాటు చేసిన కొత్త మౌలిక సదుపాయాలు ఈ రంగంలో భారత నిరంతర కృషికి మద్దతునిస్తాయని, బలమైన అంతర్జాతీయ సహకారాన్ని సులభతరం చేస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
***
(Release ID: 2130699)