కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘భారత్ 6జీ 2025’- మూడో అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శనలో కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ప్రసంగం
· 6జీలో అగ్రగామిగా నిలిచేలా సాహసోపేతంగా అడుగులేస్తున్న భారత్: జాతీయ మిషన్గా భారత్ 6జీపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన డాక్టర్ పెమ్మసాని
· మానవ జీవనంలో విప్లవాత్మక మార్పులకు 6జీ ఓ అవకాశం; కనెక్టివిటీ భవిష్యత్తును భారత్ నిర్దేశించనుంది: కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని
Posted On:
14 MAY 2025 2:33PM by PIB Hyderabad
తదుపరి తరం 6జీ సాంకేతికతల అభివృద్ధిలో అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలవడం భారత సంకల్పమని కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ‘భారత్ 6జీ 2025’- మూడో అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవాత్మక మార్పులతో సాంకేతికతను అందిపుచ్చుకునే స్థితి నుంచి ప్రమాణాలను నిర్దేశించే స్థాయికి దేశం ఎదిగిందని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో ప్రవేశమున్నవారంతా భారత్ 6జీని కేవలం సాంకేతిక అంశంగా కాకుండా జాతీయ లక్ష్యంగా పరిగణించాలని ఆయన కోరారు.
ఆరో తరం (6జీ) కమ్యూనికేషన్ టెక్నాలజీలో దేశం నిర్దేశక స్థాయికి చేరేలా భారత్ రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా కలిసి పనిచేయడం కోసం అంతర్జాతీయ స్థాయి సాంకేతిక దిగ్గజాలు, పరిశోధకులు, విధాన నిర్ణేతలను ఈ సదస్సు ఒక్క చోటకు తెచ్చింది.
భవిష్యత్తు తరాలకు అనుసంధానాన్ని విప్లవాత్మకంగా మెరుగుపరచగల అవకాశంగా 6జీ సాంకేతికతను మంత్రి అభివర్ణించారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం వంటి రంగాలతోపాటు స్మార్ట్ సిటీల దిశగా సమూలమైన మార్పులను తీసుకురాగల సామర్థ్యం 6జీకి ఉందన్నారు.
2023 మార్చి 23న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన భారత్ 6జీ ప్రణాళిక.. భారత్లో 2030 నాటికి 6జీ టెక్నాలజీలను రూపొందించి, అభివృద్ధి చేసి, అమలు చేయడానికి ఓ ప్రతిష్ఠాత్మకమైన మార్గాన్ని సిద్ధం చేసిందని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భారత్ 6జీ కూటమి, 111కు పైగా పరిశోధన ప్రాజెక్టులకు నిధులందించడంతోపాటు జపాన్, సింగపూర్, ఫిన్లాండ్ దేశాలతో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్, దేశీయంగా ఏఐ నెట్వర్క్లో పురోగతి ద్వారా 2030 నాటికి 6జీలో దేశాన్ని అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సాంకేతికంగా 6జీకి ఆశాజనకమైన పరిస్థితులున్నాయన్నారు. “6జీ ఓ చిన్న క్రమానుగత అభివృద్ధి మాత్రమే కాదు, సమూలమైన పరివర్తన... టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు, సెకనుకు 1 టెరాబిట్ వేగం, జాప్యాన్ని మిల్లీ సెకన్ల కన్నా తక్కువకు తగ్గించడం, స్వీయ సమస్య పరిష్కార నెట్వర్కులు, జలగర్భం నుంచి అంతరిక్షం వరకు – భారీ పరిమాణంలో డేటాను అందించగల అనుసంధాయకతకు 6జీ ద్వారా అవకాశం లభిస్తుంది’’ అని మంత్రి చెప్పారు.
సురక్షిత, సమ్మిళిత, అంతర్జాతీయ స్థాయి ఔచిత్యం కలిగిన 6జీ వ్యవస్థ ప్రధానమంత్రి శ్రీ మోదీ లక్ష్యమని డాక్టర్ పెమ్మసాని పునరుద్ఘాటించారు. మానవాళి ప్రయోజనం కోసం సాంకేతికతను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను రూపొందించడం, డిజిటల్ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడం భారత్ విధానమని స్పష్టం చేశారు. ఈ మిషన్కు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రపంచ 6జీ ప్రస్థానంలో ముందంజలో నిలవడానికి అవసరమైన స్థాయి, ఆవిష్కరణ సామర్థ్యం, రాజకీయ సంకల్పం భారత్కు ఉన్నాయని పునరుద్ఘాటిస్తూ ప్రసంగాన్ని ముగించారు.
మరిన్ని వివరాల కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ హాండిళ్లను ఫాలో అవ్వండి: -
ఎక్స్ - https://x.com/DoT_India
ఇన్స్టా https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ ==
ఫేస్బుక్ - https://www.facebook.com/DoTIndia
https://x.com/PemmasaniOnX/status/1922569789790118325?t=YyzkKAmO_-N1M8XhZ9BmXw&s=19
https://www.instagram.com/p/DJoKUr7Sgdb/?igsh=MTJib3Vna3R0eTRlOA ==
https://www.facebook.com/share/p/16V6he3qyo/
***
(Release ID: 2128789)