రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
కొత్తగా ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ ఆగ్రా- గ్వాలియర్ ఎక్స్ప్రెస్ రహదారిని బీవోటీ (టోల్) విధానంలో నిర్మించనున్న ఎన్హెచ్ఏఐ
Posted On:
30 APR 2025 7:46PM by PIB Hyderabad
ఆగ్రా, గ్వాలియర్లలోని పర్యాటక నిలయాలకు రవాణా సదుపాయాలను మెరుగుపరిచేలా.. అంతరాయం లేకుండా అత్యంత వేగంగా వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించేలా (యాక్సెస్ కంట్రోల్డ్) కొత్తగా 88 కి.మీ పొడవైన 6 వరుసల ఆగ్రా - గ్వాలియర్ ఎక్స్ప్రెస్ రహదారిని (జాతీయ రహదారి 719 డీ) జాతీయ రహదారుల ఆధీకృత సంస్థ (ఎన్ హెచ్ఏఐ) నిర్మించనుంది. ఎన్హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్, సంస్థ సీనియర్ అధికారులు, రాయితీదారుల సమక్షంలో మెసర్స్ జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్తో ఎన్హెచ్ఏఐ ఈ ప్రాజెక్టు అమలు కోసం ఈరోజు అంగీకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఎక్స్ప్రెస్ రహదారి ఆగ్రాలోని డియోరి గ్రామం నుంచి మొదలై గ్వాలియర్లోని సుసేరా గ్రామంలో ముగుస్తుంది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టోల్) విధానంలో మొత్తం రూ. 4613 కోట్ల మూలధన వ్యయం (ఎల్ఏ వ్యయం సహా)తో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు.
ఈ కాంట్రాక్టు నిర్దేశిత వ్యవధి (కన్సెషన్ పిరియడ్) 20 సంవత్సరాలు. నిర్మాణ కాలం 30 నెలలు కూడా ఇందులో భాగంగా ఉంటుంది. నిర్మాణ సమయంలో రాయితీదారుకు ఎన్హెచ్ఏఐ రూ. 820 కోట్ల నిర్మాణ సాయాన్ని అందిస్తుంది. ప్రాజెక్టు పురోగతికి అనుగుణంగా దీనిని అందిస్తారు. ఇప్పుడున్న జాతీయ రహదారి-44కు కప్పు వేయడం/నాణ్యతను పెంపొందించడం, రోడ్డు భద్రత, మెరుగులు దిద్దే చర్యలను కూడా ఆగ్రా - గ్వాలియర్ ప్రాజెక్టు ఒప్పందంలో చేర్చారు.
ఈ ప్రాజెక్టు ప్రీమియాన్ని 2.42%గా అంచనా వేశారు. అయితే, రెవెన్యూ షేర్ల రూపంలో కోట్ చేసిన 17.170% ప్రీమియం వద్ద ప్రాజెక్టును కేటాయించారు. వాటిని రుసుము (ఫీ)గా మార్చవచ్చు. ప్రాజెక్టు పూర్తయిన రెండో ఏడాది నుంచి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ఒప్పంద కాలానికి, తర్వాతి సంవత్సరాల్లో ఉచితంగా పొందగలిగే మొత్తంలో అది ఏటా 1% పెరుగుతుంది.
ఈ రహదారి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఇది ఆగ్రా, గ్వాలియర్ మధ్య అత్యంత వేగవంతమైన రవాణా సదుపాయాన్ని అందించడం మాత్రమే కాకుండా, జాతీయ రహదారి -44 లో ఆగ్రా-గ్వాలియర్ సెక్షన్లోని వివిధ నగరాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో రద్దీని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఎక్స్ప్రెస్ రహదారి ప్రయాణ సమయాన్ని, కర్బనోద్గారాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా వాణిజ్యపరమైన రవాణా సామర్థ్యాన్ని, ఆగ్రా, ధోల్పూర్, మొరెనా, గ్వాలియర్ మధ్య సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ ఎక్స్ప్రెస్ రహదారిలో ఎనిమిది ప్రధాన వంతెనలు, 23 చిన్న వంతెనలు, ఆరు ఫ్లైఓవర్లు, ఒక రైల్ ఓవర్ బ్రిడ్జి, 192 కల్వర్టులు ఉంటాయి. ఈ ప్రాజెక్టు జాతీయ చంబల్ వన్యప్రాణుల అభయారణ్యం గుండా కూడా వెళ్తుంది. వన్యప్రాణుల రక్షణ చర్యల్లో భాగంగా నదీ జలాల్లోని కుండ మూతి మొసళ్ల సంరక్షణ కోసం చంబల్ నదిపై కేబుల్ స్టేడ్ బ్రిడ్జిని నిర్మించడానికి కూడా ప్రణాళికలు రూపొందించారు. దీనితోపాటు, వంతెనపై ధ్వని నిరోధకాల, లైట్ కట్టర్ల వంటి ఇతర వన్యప్రాణి సంరక్షణ చర్యలు కూడా చేపడతారు.
బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టోల్) ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇటీవల 121 కి.మీ. పొడవైన గౌహతి రింగ్ రోడ్డును బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టోల్) విధానంలో అభివృద్ధి చేయడానికి ఓ అంగీకార ఒప్పందం (కన్సెషన్ అగ్రిమెంట్)పై ఎన్హెచ్ఏఐ సంతకం చేసింది. రహదారి రంగంలో బలమైన ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం అభివృద్ధికి దోహదం చేయడంతోపాటు దేశంలోని జాతీయ రహదారి వ్యవస్థ కార్యకలాపాల్లో, ప్రపంచస్థాయి ప్రమాణాలతో దానిని నిర్వహించడంలో విశేషంగా ఉపయోగపడుతుంది.

***
(Release ID: 2125674)