కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోస్టాఫీసుల ద్వారా తక్కువ ఖర్చులో పుస్తకాలు, అధ్యయన సామగ్రి అందజేతను సులభతరం చేయడానికి

‘జ్ఞాన్ పోస్ట్’ కోసం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురణ...
గౌరవనీయ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ప్రకటన...

* ‘‘విద్యను ప్రతి ఒక్కరి చెంతకు చేర్చే ముఖ్య అందజేత యంత్రాంగం ‘జ్ఞాన్ పోస్ట్’: శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా

Posted On: 28 APR 2025 7:36PM by PIB Hyderabad


‘జ్ఞాన్ పోస్ట్’కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించినట్లు కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి మాన్య శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ప్రకటించారు. విద్యాసంబంధ పుస్తకాలను, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక పుస్తకాలను దేశమంతటా తక్కువ ఖర్చులో అందించడం ఈ కొత్త సేవతో సాధ్యపడుతుంది. దేశంలో ప్రతి ప్రాంతంలోనూ విద్యకు మద్దతును అందించడంతోపాటు చదువుకోవాలన్న ఆరాటం ఉన్నవారి వద్దకు చేరుకోవడానికి ఇండియా పోస్ట్ కనబరుస్తున్న నిరంతర నిబద్ధతకు ఈ నూతన సేవ అద్దంపడుతోంది.  

విద్య ఒక శక్తిమంతమైన భవితకు పునాది వేస్తుంది. అయితే విద్యను అభ్యసించే వనరుల ప్రాప్తి భోగోళిక పరిస్థితి, లేదా కొనుగోలు సామర్థ్యం వంటి అంశాలపైన ఆధారపడి ఉండకూడదు. ఒక పాఠ్యపుస్తకాన్ని గాని, ఒక మార్గదర్శనాన్నిచ్చే గైడ్‌ను గాని, లేదా ఒక సాంస్కృతిక గ్రంథాన్ని అయినా సరే చివరి దశ వరకు... చాలా దూరంలో ఉన్న పట్టణానికి లేదా పల్లెకు సైతం... చేర్చగలగాలన్న విశ్వాసంతో ‘జ్ఞాన్ పోస్ట్’ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ, ‘‘నూతన విద్యావిధానం, సిలబస్‌లలో భాగంగా ‘జ్ఞాన్ పోస్ట్’ ప్రతి ఒక్కరి వద్దకు విద్యను చేర్చగలగడానికి ఒక ముఖ్య బట్వాడా యంత్రాంగం పాత్రను పోషిస్తుంద’’న్నారు.

నేర్చుకోవడంలోనూ, జ్ఞానాన్ని పంచుకోవడంలోనూ సాయపడడానికి రూపొందించిన ‘జ్ఞాన్ పోస్ట్’ భారత విస్తృత తపాలా నెట్‌వర్క్ ద్వారా పుస్తకాలను, ముద్రణ పూర్తి అయిన విద్యాసంబంధిత సామగ్రిని చేరవేయడానికి చౌకైన ఐచ్ఛికాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. దీనికి ధరను నిర్ణయించేటప్పుడు, సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరుకొనేటట్లు ఈ సేవను ప్రోత్సహించాలనే సంగతిని దృష్టిలో పెట్టుకున్నారు.

‘జ్ఞాన్ పోస్ట్’లో భాగంగా పంపే పుస్తకాలు, ముద్రణ పూర్తయిన విద్యా సంబంధ సామగ్రిని అది ఏ సమయానికి ఎక్కడికి చేరుకొందీ తెలుసుకొనే ఏర్పాటు కూడా చేశారు. దీనిని తక్కువ ఖర్చుతో ప్రభావవంతంగా బట్వాడా చేసేందుకు వీలుగా ఉపరితల పద్ధతిలో కూడా రవాణా చేసేందుకు వెసులుబాటు కల్పించారు.  ప్యాకేజీలలో 300 గ్రాముల బరువు ఉన్న ప్యాకెట్లు కేవలం రూ.20తో మొదలై, 5 కిలోల వరకు ఉండే ప్యాకెట్లనయితే గరిష్ఠంగా రూ.100తో (పన్నులు వర్తిస్తాయి) చాలా చౌక ధరలకు పంపించవచ్చు.

‘జ్ఞాన్ పోస్ట్’ ద్వారా కేవలం వాణిజ్యేతరమైన, విద్యాసంబంధిత సామగ్రినే పంపాలి. ఏదైనా వ్యాపార, వాణిజ్య సంబంధిత ప్రచురణలు, లేదా ప్రకటనలు (అకస్మాత్తుగా ప్రకటించాల్సిన సంగతులు లేదా పుస్తకాల జాబితాలు వంటివి తప్ప) ‘జ్ఞాన్ పోస్ట్’లో పంపడం కుదరదు. ప్రతి ఒక్క పుస్తకం నిర్దేశిత షరతులను పాటిస్తూ ముద్రాపకుడు లేదా ప్రచురణకర్త పేరును తెలియజేయాల్సిందే.

సర్వజనులకు సేవలను అందించాలన్న ఇండియా పోస్ట్  నిబద్ధతను ‘జ్ఞాన్ పోస్ట్’ పునరుద్ఘాటిస్తోంది. ఈ పద్ధతిలో చేరవేసే ఒక్కొక్క పుస్తకం రూపంలోనూ విద్యపరమైన అంతరాలను క్రమంగా తగ్గిస్తూ పోవడం సాధ్యమవుతుంది. విద్యను నేర్పే వనరులను ఇదివరకటి కంటే మరింత సులభంగానూ, తేలికగానూ మార్చివేస్తూ, ఇండియా పోస్ట్ యావత్తు దేశంలో వ్యక్తులతోపాటు సముదాయాలకు సాధికారితను సంతరించడంలో తన వారసత్వాన్ని ఇకమీదటా కొనసాగిస్తుంది.    

వచ్చే గురువారం (2025 మే 1) నుంచి భారత్ అంతటా అన్ని పోస్టాఫీసులలోనూ ‘జ్ఞాన్ పోస్ట్’ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. మరిన్ని వివరాలు మీకు అత్యంత సమీపంలోని తపాలా కార్యాలయంలోనూ, లేదా ఆన్‌లైన్‌లో అయితే www.indiapost.gov.in వెబ్ చిరునామాలోనూ లభ్యమవుతాయి.

 

***


(Release ID: 2125127)