పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
గురుగ్రామ్లో ఎయిర్ ఇండియా ప్రధాన కేంద్రాన్ని, శిక్షణ సదుపాయాలను సందర్శించిన కేంద్ర విమానయాన మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు
* శ్రీ రామ్ మోహన్ నాయుడు చేతుల మీదుగా ఎయిర్ ఇండియా సేఫ్టీ ప్రమోషన్ కేంద్రం ప్రారంభం
Posted On:
21 APR 2025 8:17PM by PIB Hyderabad
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు సోమవారం గురుగ్రామ్ వెళ్లి అక్కడ ఎయిర్ ఇండియా కార్పొరేట్, శిక్షణ సంబంధిత మౌలిక సదుపాయాలను పరిశీలించారు. భారత్ పౌర విమానయాన రంగంలో భద్రత, శిక్షణ, నిర్వహణ సంబంధిత శ్రేష్ఠత్వాలను పెంచే విషయంలో మంత్రిత్వ శాఖకున్న నిబద్ధతకు ఇది అద్దంపడుతోంది. మంత్రి ముందుగా ఎయిర్ ఇండియా ఎక్స్పీరియన్స్ సెంటర్లో కలియదిరిగారు. ఈ కేంద్రం ఈ విమాన సంస్థకున్న 92 సంవత్సరాల వారసత్వానికి ఒక ప్రతీకగా నిలవడమే కాకుండా విహాన్.ఏఐ పరివర్తన ప్రస్థానాన్ని కూడా కళ్లకు కడుతోంది.
మంత్రి ఆ తరువాత, అత్యవసర నియంత్రణ కేంద్రాన్ని (ఈసీసీ), ఏకీకృత కార్యకలాపాల నియంత్రణ కేంద్రాన్ని (ఐఓసీసీ) కూడా చూశారు. ఇవి ఎయిర్ ఇండియా నిర్వహణ దక్షతను, కాలబద్ధ పనితీరుకు సంబంధించిన నిబద్ధతను చాటిచెబుతున్న కీలక కేంద్రాలు. గురుగ్రామ్లో ఎయిర్ ఇండియా విమానయాన శిక్షణ అకాడమీను చూసిన మంత్రి, విమానయాన వృత్తినిపుణులను తీర్చిదిద్దడంలో ఈ సంస్థ పోషిస్తున్న పాత్రపై తన అవగాహనను మరింతగా పెంచుకున్నారు. అనంతరం, ఆయన సేఫ్టీ ల్యాబును, గ్రూమింగ్ సెంటరును, సెక్యూరిటీ ల్యాబును, నిర్మాణ పనులు జరుగుతున్న సిమ్యులేటర్ భవనాలు సహా శిక్షణ సంబంధిత మౌలిక సదుపాయాలను ఒక్కొక్కటిగా చూశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు ఎయిర్ ఇండియా భద్రత ప్రోత్సాహక కేంద్రాన్ని (ఎయిర్ ఇండియా సేఫ్టీ ప్రమోషన్ సెంటర్) ఎయిర్ ఇండియా, టాటా సన్స్ ల చైర్మన్ల సమక్షంలో ప్రారంభించారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఎయిర్ ఇండియా సేఫ్టీ ప్రమోషన్ సెంటరును ప్రారంభిస్తున్న వేళలో... భారతీయ విమానయాన రంగంలో భద్రతకు ప్రాధాన్యాన్నిచ్చే సంస్కృతిని పెంపొందించే బలమైన నిబద్ధతను నేను గమనించాను. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ రోజు ప్రారంభించిన ఈ అత్యాధునిక కేంద్రం ద్వారా ఎయిర్ ఇండియా తన సిబ్బందికి శిక్షణనివ్వడానికి భారీ పెట్టుబడితో అత్యంత ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి భద్రతను బలపరుస్తున్నందుకు ఈ సంస్థను నేను అభినందిస్తున్నాను...ఇక్కడ గత కాలంలో జరిగిన సంఘటనల నుంచి నేర్చుకున్న పాఠాలను ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ ఒక చోటులో ఏర్చి కూర్చారు... తరగతి గదిలో నేర్చుకొనే వాటి కన్నా మించిన స్థాయిలో, వాస్తవికత ప్రధానమైన శిక్షణను ఇచ్చేందుకు చక్కని రంగాన్ని ఇక్కడ సిద్ధం చేశారు’’ అంటూ మంత్రి ప్రశంసించారు.
భారతీయ విమానయాన రంగానికున్న తనదైన విస్తృత దృష్టికోణాన్ని గురించి మంత్రి వివరిస్తూ, ‘‘భారత్ వేర్వేరు రంగాల్లో తన విమాన సంధానాన్ని విస్తరించుకొంటున్న క్రమంలో, భద్రతకు కూడా మనం పెద్ద పీట వేస్తున్నాం. టాటా గ్రూపు సారథ్యంతోపాటు జేఆర్డీ టాటా వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్న నిబద్ధత కలిగిన సిబ్బంది అంకితభావంతో కూడిన ప్రయత్నాల దన్నుతో ఎయిర్ ఇండియా ప్రపంచంలో అన్నింటి కంటే ఉత్తమ విమాన సంస్థల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందే దారిలో ముందుకు సాగుతోంద’’న్నారు. విమానయాన రంగంతో ప్రభుత్వం నిరంతర భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగిన, భద్రమైన, విశ్వసనీయమైన విమానయాన అనుబంధ విస్తారిత వ్యవస్థను మన విమాన సంస్థలు సమకూర్చేటట్లుగా ఆ సంస్థలకు భారత ప్రభుత్వం పూర్తి మద్దతును అందిస్తుంద’’ని మంత్రి అన్నారు.
వాస్తవ ప్రపంచాన్ని పోలిన స్థితులను కల్పించి, వెనుకటి కాలం ఘటనల నుంచి నేర్చుకున్న విలువైన పాఠాలను బోధిస్తూ ఎయిర్ ఇండియా సంస్థలో భద్రతకే ప్రాథమ్యాన్నిచ్చే సంస్కృతిని అలవరచడం సేఫ్టీ ప్రమోషన్ కేంద్రం ధ్యేయం. సేఫ్టీ ప్రోటోకాల్స్ను, ఉన్నత స్థాయి శిక్షణను, పరిశ్రమలోని ఆసక్తిదారులతో సన్నిహిత సమన్వయాన్ని ఏర్పరచుకొంటూ భారత్లో విమానయాన రంగ మౌలిక సదుపాయాల కల్పనను బలోపేతం చేయడంపై మంత్రిత్వ శాఖ దృష్టిని కేంద్రీకరించిందన్న విషయాన్ని మంత్రి తాజా సందర్శన కార్యక్రమం సుస్పష్టం చేసింది. అంతక్రితం... ఎయిర్ ఇండియా ప్రధాన కేంద్రానికి చేరుకొన్న మంత్రికి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, మేనేజింగ్ డైరెక్టరు శ్రీ క్యాంప్బెల్ విల్సన్తోపాటు ఆయన నిర్వాహక బృందం సభ్యులు స్వాగతం పలికారు.
***
(Release ID: 2123434)