బొగ్గు మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ సాధనలో బొగ్గు రంగం కీలకంగా మారుతోంది: శ్రీ జి కిషన్ రెడ్డి
· వాణిజ్య బొగ్గు గనుల 12వ విడత వేలాన్ని విజయవంతంగా ప్రారంభించిన బొగ్గు శాఖ
· ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో బృహత్తర లక్ష్యాన్ని అధిగమించడం ద్వారా బొగ్గు రంగం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది
· 12వ విడత వేలం ద్వారా మరో ముందడుగు పడుతోంది – 28 బొగ్గు, లిగ్నైట్ గనులను వేలం వేస్తున్నాం
· ఈ వేలాలు బొగ్గు దిగుమతులను తగ్గించి విలువైన విదేశీ మారకాన్ని ఆదా చేయడమే కాక దేశాన్ని నిజమైన ఆత్మ నిర్భర్ గా తీర్చిదిద్దుతున్నాయి
Posted On:
27 MAR 2025 10:20PM by PIB Hyderabad
దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచి దేశ ఇంధన భద్రతను పెంపొందించాలన్న లక్ష్యంతో, వాణిజ్య బొగ్గు గనుల 12వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించింది. కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా కేంద్ర సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలకోపన్యాసం చేసిన శ్రీ కిషన్ రెడ్డి... ఇటీవల భారత్ ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించి చారిత్రాత్మక ఘనతను సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. బొగ్గు రంగం నేడు ఆధునిక, పారదర్శక, ప్రగతిశీల ధోరణి అలవర్చుకోవడం ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వం వల్లే సాధ్యపడిందన్నారు. 2015 నుంచీ చేపట్టిన పారదర్శక వేలం పద్ధతులు, పెరిగిన ప్రైవేటు రంగ భాగస్వామ్యం, సాంకేతిక ప్రగతి వంటి కీలక సంస్కరణలు ఈ రంగం ముఖచిత్రాన్ని మార్చివేసి, సామర్థ్య పెంపు, పోటీతత్వం పెంపొందేందుకు దోహదపడ్డాయి.

11 విడతల్లో 125 బొగ్గు గనులను విజయవంతంగా వేలం వేయడం ద్వారా సుమారు రూ. 40,900 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని, 4 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. 12వ విడతలో మరో 28 బొగ్గు, లిగ్నైట్ బ్లాకులు వేలం వేస్తున్నారు... దాంతో భారత్ విదేశీ బొగ్గు మీద ఆధారపడటం తగ్గి, విదేశీ మారకం ఆదా కానుంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ఇది కీలకమవుతోంది. పారదర్శకమైన వేలం ప్రక్రియ ఆరోగ్యకరమైన పోటీని ప్రేరేపించి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలతో పోటీ పడేలా చేస్తోంది. ఈ పోటీ సామర్థ్య పెంపు, సంస్కరణలు, కార్యకలాపాల పద్ధతుల్లో పరివర్తనకు దోహదపడుతోంది. ఈ మార్పు భారతదేశ బొగ్గు రంగ గ్లోబల్ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచింది.
బొగ్గు రంగం ఆత్మనిర్భర్ భారత్ సాధనలో కీలకంగా మారుతోందని, పారదర్శకమైన, సమ్మిళిత వేలం పద్ధతులు కొత్త కంపెనీలను, చిన్న మైనింగ్ సంస్థలను ఆకర్షిస్తున్నాయని, దరిమిలా వారికి ఈ రంగంలో ప్రవేశించే కొత్త అవకాశాలు అందుతున్నాయని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. 12వ విడత వేలంలో పరిశ్రమల వారు సహా భాగస్వాములందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిస్తూ ప్రధానమంత్రి దార్శనికతకి అనుగుణంగా ఇంధన భద్రత, స్వయం సమృద్ధుల పరంగా బలమైన భారత్ నిర్మాణంలో బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు.

భారతదేశం ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించడం వల్ల, 12వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభం ఇంధన స్వయం సమృద్ధి దిశగా మరో ముఖ్యమైన ముందడుగును సూచిస్తోందని బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే తమ ప్రసంగంలో పేర్కొన్నారు. పారదర్శక వేలం విధానం, పరిశ్రమ అనుకూలమైన విధానాలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం పెరగడం వల్ల బొగ్గు ఉత్పత్తి పెరగడమే కాక పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాలను సృష్టి, వేగవంతమైన మౌలిక సదుపాయాల వృద్ధి సాధ్యపడుతున్నాయని మంత్రి చెప్పారు.
బొగ్గు రంగంలో కొత్త ఆలోచనలకు, సుస్థిరతకు పెద్దపీట వేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన శ్రీ దూబే, ఇది దీర్ఘకాల ఇంధన భద్రతను అందిస్తుందని చెప్పారు. సులభ వ్యాపారానికి ప్రాముఖ్యాన్ని కొనసాగిస్తామన్న మంత్రి, ఇది ఇంధన రంగంలో ఆత్మ నిర్భరత సాధించేందుకు సహాయపడుతుందన్నారు.
బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్త్... అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్, బొగ్గు, మైనింగ్ రంగ కీలక భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ ప్రసంగిస్తూ 2020 నుండి వాణిజ్య బొగ్గు గనులు ఈ రంగంలో పరివర్తన - సామర్థ్య పెంపు, అమాంతంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడం, పరిశ్రమలకు నిష్పక్షపాతమైన సరఫరా నిర్ధారణ వంటి వాటికి దోహదపడుతున్నాయని చెప్పారు. 1 బీటీ (బిలియన్ టన్నులు) బొగ్గు ఉత్పత్తి మైలురాయి లక్ష్యాన్ని చేరుకున్నందుకు ప్రశంసిస్తూ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, పారదర్శకత, విధాన సంస్కరణలు ఈ రంగాన్ని మరింత పోటీతత్వంతో భవిష్యదభిముఖంగా తీర్చిదిద్దాయని వ్యాఖ్యానించారు. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ (ఎంఓఈఎఫ్), రైల్వేలు సహా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయ ప్రయత్నాల ద్వారా వేగవంతమైన గనుల నిర్వహణ, క్రమబద్ధీకరించిన అనుమతులు, మెరుగైన అనుసంధాన వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రతి వేలంతో బొగ్గు రంగం కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తోందని, ఉద్యోగాలను సృష్టిస్తోందని, భారతదేశ ఇంధన భద్రతను పటిష్టం చేస్తోందని చెప్పారు. వాణిజ్య బొగ్గుగనుల కార్యకలాపాలు ఈ రంగానికి సరికొత్త దిశను చూపాయని, ఆర్థిక వృద్ధికి ఊతమిస్తూ, మౌలిక సదుపాయాల వృద్ధికి దోహదపడుతూ బొగ్గు ఉత్పత్తిలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్గా మార్చేందుకు సహాయపడుతున్నాయని శ్రీ విక్రమ్ దేవ్ దత్ వివరించారు.
వేలం కార్యకలాపాలు త్వరగా ప్రారంభించడానికి అనుమతులను శీఘ్రగతిన అందిస్తామని, నియంత్రణలను సరళీకరిస్తామని, ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణ, అటవీ అనుమతులు త్వరగా ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు వివిధ మంత్రిత్వశాఖలు, నియంత్రణ సంస్థల మధ్య అనుసంధానాన్ని పెంపొందిస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణ అనుకూల, బాధ్యతాయుత గనుల తవ్వకానికి ప్రాధాన్యం కొనసాగుతుందని, ఒట్టి పోయిన గనుల పునరుద్ధరణ, అడవుల పెంపకం, పర్యావరణ చట్టాల అనుసరణ వంటి వాటికి మరింత ప్రాధాన్యాన్నిస్తామని చెప్పారు. వాణిజ్య బొగ్గు గనులు త్వరితగతిన అభివృద్ధి చెంది కాలుష్య-రహిత, పరిశుభ్రమైన బొగ్గు రంగాన్ని తయారు చేసేందుకు భాగస్వాములందరికీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు.

బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, నామినేటెడ్ అధికారిణి రూపిందర్ బ్రార్ స్వాగత ప్రసంగం చేస్తూ, దేశంలో వాణిజ్య బొగ్గు మైనింగ్ పరివార్తనాత్మక ప్రభావాన్ని గురించి తెలియజేశారు. 12వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రైవేటు రంగం వారికి కొత్త అవకాశాలను కల్పిస్తుందని, పోటీని పెంపొందిస్తుందని, పరిశ్రమలకు స్థిరమైన బొగ్గు సరఫరాను ఖరారు చేస్తుందని చెప్పారు. భారతదేశం బొగ్గు రంగం మరింత పారదర్శకంగా, పెట్టుబడిదారులకు అనుకూలమైనదిగా, ప్రపంచస్థాయి పోటీ కోసం సంసిద్ధమయ్యేలా రూపొందటంలో విధాన సంస్కరణల పాత్ర ఎంతైనా ఉందని బ్రార్ చెప్పారు.
అనుకూలమైన పద్ధతుల్లో మైనింగ్కు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బొగ్గు అన్వేషణ, వెలికితీతల్లో నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వాణిజ్య బొగ్గు తవ్వకం కేవలం అధిక ఉత్పత్తికి పరిమితం కాదని, సుస్థిరమైన స్వావలంబనతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ దార్శనిక ప్రణాళికకు అనుగుణమైన బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులను అనుసరించడం అవసరమని చెప్పారు.
కొత్త పెట్టుబడి అవకాశాల కల్పన, బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులు, దేశ బొగ్గు రంగంలో అధిక భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా నేటి ప్రారంభం మరో ప్రధాన అడుగును సూచిస్తోంది. బొగ్గు గనుల తవ్వకంలో పారదర్శకత, సామర్థ్యం, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే ప్రభుత్వ నిబద్ధతను తేటతెల్లంచేస్తూ, వేలాన్ని దక్కించుకున్న బిడ్డర్లతో మునుపటి విడత ఒప్పంద పత్రాలను అందరి ముందూ ఉంచారు. చారిత్రాత్మక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడంలో భారత్ కీలక మైలురాయిని దాటినట్లయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బొగ్గు కంపెనీలు, గని కార్మికులు, పరిశోధకులు, ప్రైవేట్ రంగ భాగస్వాముల సమష్టి కృషిని ఈ విజయం ప్రతిబింబిస్తోంది.
12వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలంలో భాగంగా, బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) చట్టం-2015 (సీఎంఎస్పీ) కింద 25 కొత్త బొగ్గు గనులు... గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957 (ఎంఎండీఆర్) కింద 18 గనులును వేలం వేస్తున్నారు. వైవిధ్యమైన ఇంధన అవసరాలకు తగినట్లు వేలంలో రెండు లిగ్నైట్ గనులు కూడా ఉన్నాయి.
మొత్తం గనుల్లో 13 గనులు అన్వేషణ పూర్తి చేసుకుని తక్షణ వృద్ధికి సిద్ధంగా ఉండగా, మరో 12 గనుల్లో అన్వేషణ పాక్షికంగానే జరిగింది. దరిమిలా ఇవి దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలను కలిగి, దేశ బొగ్గు రంగం వృద్ధికి దోహదం చేస్తాయి. గతసారి వాణిజ్య బొగ్గు గనుల వేలానికి చెందిన మూడు గనులను కూడా ఈసారి కేటాయిస్తారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి బొగ్గు, లిగ్నైట్ నిల్వలు కలిగిన రాష్ట్రాల్లో వేలం వేయబడుతున్న గనులు విస్తరించి ఉన్నాయి.

బొగ్గు ఉత్పత్తి, ఈ రంగంలో పరిశ్రమల వృద్ధి కోసం గణనీయమైన కృషి చేసిన బొగ్గు బ్లాక్ కేటాయింపుదారులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. రికార్డు స్థాయి 1 బీటీ బొగ్గు ఉత్పత్తిని సాధించడంలో అత్యుత్తమ పనితీరును కనపర్చి, నిబద్ధత చూపిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అనుబంధ సంస్థల ప్రతినిధులను సత్కరించారు.
వాణిజ్య బొగ్గు గనుల12వ విడత వేలం కొత్త పెట్టుబడి అవకాశాలకు తెరతీసి, దేశీయ బొగ్గు సరఫరా మెరుగుదల, దేశ ఇంధన భద్రతలకు దన్నుగా నిలవగలదని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, సమాజ సంక్షేమానికి ప్రాధాన్యాన్నిస్తూనే, స్వయం-సమృద్ధ బొగ్గు ఆర్థిక వ్యవస్థ సాధనకు అవసరమైన వృద్ధి, సుస్థిరత, భద్రతలను పెంపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(Release ID: 2116193)
Visitor Counter : 42