పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: కాలం చెల్లిన వాహనాల నియమాలు- 2025 అమలు
Posted On:
03 FEB 2025 3:42PM by PIB Hyderabad
కాలం చెల్లిన వాహనాల నిర్వహణను పర్యావరణ హితంగా ఉంచడం కోసం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి ఆరో తేదీ నాటి ఎస్ వో 98 (ఇ) ద్వారా పర్యావరణ పరిరక్షణ (కాలం చెల్లిన వాహనాలు) నియమాలు- 2025ను ప్రకటించింది. తయారీదారుకు మరిన్ని బాధ్యతలు (ఎక్స్ టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ- ఈపీఆర్) సూత్రంపై ఈ నియమాలు ఆధారపడి ఉంటాయి. దీనిప్రకారం - కాలం చెల్లిన వాహనాలను తుక్కుకింద మార్చేలా వాహన తయారీదారులకు తప్పనిసరి ఈపీఆర్ టార్గెట్లను ఇస్తారు. వ్యవసాయ ట్రాక్టర్లు, వ్యవసాయ ట్రైలర్, కంబైన్ హార్వెస్టర్, పవర్ టిల్లర్ మినహా అన్ని రకాల రవాణా, రవాణాయేతర వాహనాలు ఈ నియమాల పరిధిలోకి వస్తాయి.
స్వీయ వినియోగ వాహనాలు సహా దేశీయ మార్కెట్ లో ప్రవేశపెట్టిన, ప్రవేశపెట్టే వాహనాలకు సంబంధించి ఉత్పత్తిదారులు తమ ఈపీఆర్ బాధ్యతను తప్పక నెరవేర్చాలని ఆదేశిస్తూ.. ఈ నియమాలు నిర్దేశిత స్క్రాపింగ్ లక్ష్యాలను ఉత్పత్తిదారుల ముందుంచుతున్నాయి. కాలం చెల్లిన వాహనాల స్క్రాపింగ్ కు సంబంధించిన వార్షిక లక్ష్యాలను 2025-26 సంవత్సరం నుంచి ఉత్పత్తిదారులకు అందించారు. రవాణా వాహనాల విషయంలో 15 సంవత్సరాలు, రవాణాయేతర వాహనాల విషయంలో 20 సంవత్సరాలను వాటి కాలవ్యవధిగా పరిగణిస్తారు.
పనిచేయని లేదా కాలం చెల్లిన వాహనాలను స్క్రాపింగ్ కోసం తీసుకోవడంతోపాటు వాటి నిర్వహణ, కాలుష్య నిర్మూలన, విచ్ఛిన్నం, వేర్పాటు, స్క్రాపింగ్ కార్యకలాపాల కోసం నమోదైన వాహనాల స్క్రాపింగ్ కేంద్రాల (ఆర్ వీఎస్ఎఫ్) ఏర్పాటును తప్పనిసరి చేశారు. ఆర్ వీఎస్ఎఫ్ లో పునరుద్ధరణ సదుపాయం ఉంటే- కాలం చెల్లిన వాహనాల నుంచి సేకరించిన, వేరు చేసిన సామగ్రిని ఆ విడిభాగాల పునరుద్ధరణ, పునర్వినియోగం కోసం నమోదై ఉన్న పునరుద్ధరణదారులు, కో-ప్రాసెసర్లకు పంపించాల్సి ఉంటుంది. దానితోపాటు పునరుద్ధరించలేని సామగ్రిని, నిరుపయోగమైన హానికర సామగ్రిని.. ప్రమాదకరమైన, ఇతర వ్యర్థాల (నిర్వహణ, తరలింపు) నియమాలు- 2016 ప్రకారం నిర్వహించే ఉమ్మడి ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ, నిల్వ, తొలగింపు కేంద్రాలకు వారు పంపించాల్సి ఉంటుంది.
ఉత్పత్తిదారులు ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రాలు కాలం చెల్లిన వాహనాలను పర్యావరణ హితమైన రీతిలో నిర్వహించి.. వాటిని నమోదై ఉన్న స్క్రాపింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. వాహనం నమోదై ఉన్న యజమాని లేదా బల్క్ వినియోగదారుడు కాలం చెల్లిన వాహనాన్ని.. ఉత్పత్తిదారు నిర్దేశించిన ఏదైనా విక్రయ కేంద్రంలో లేదా నిర్ణీత సేకరణ కేంద్రం లేదా ఆర్ వీఎస్ఎఫ్ లో.. వాహనం గడువు తీరిన నూట ఎనభై రోజుల్లోగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ నియమాల్లోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించినా లేదా అమలు చేయకపోయినా.. వివరణను స్వీకరించి వారి నమోదును రద్దు చేయవచ్చు. ఉత్పత్తిదారు విషయంలో కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ (సీపీసీబీ); ఆర్ వీఎస్ఎఫ్, బల్క్ వినియోగదారు విషయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థ (ఎస్ పీఎస్బీ) ఈ చర్యలు తీసుకుంటాయి. ఈ నియమాలు అందించిన బాధ్యతలకు సంబంధించి రిటర్నులను ఉత్పత్తిదారు, బల్క్ వినియోగదారుడు, ఆర్వీఎస్ఎఫ్ కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్లో దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆ కేంద్రం ఈ నియమాలు ఏర్పరిచిన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించేలా.. సీపీసీబీ కాలానుగుణంగా ఉత్పత్తిదారులపై తనిఖీ, ఆడిట్ వంటి చర్యలను తప్పక తీసుకోవాలి. నమోదు చేసుకున్న వాహన స్క్రాపింగ్ కేంద్రంపై కాలానుగుణ తనిఖీ, ఆడిట్ ను సీపీసీబీ చేపట్టవచ్చు, లేదా ఏదైనా ఆధీకృత సంస్థ ద్వారా నిర్వహించవచ్చు. ఈ నియమాల ద్వారా నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఉల్లంఘించిన లేదా అమలు చేయని ఉత్పత్తిదారు లేదా నమోదు చేసుకున్న వాహన స్క్రాపింగ్ కేంద్రం లేదా ఎవరైనా ఇతర వ్యక్తులపై కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ తగిన చర్యలు తీసుకోవచ్చు.
అదేవిధంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థలు కూడా ఆర్వీఎస్ఎఫ్ లపై కాలానుగుణంగా తనిఖీలు, ఆడిట్ లు చేపట్టి, లేదా ఏదైనా ఆధీకృత సంస్థ ద్వారా వాటిని నిర్వహించి ఈ నియమాలు తప్పక అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఈ నియమాల ద్వారా నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఉల్లంఘించిన లేదా అమలు చేయని ఉత్పత్తిదారు లేదా నమోదు చేసుకున్న వాహన స్క్రాపింగ్ కేంద్రం లేదా బల్క్ వినియోగదారు లేదా ఎవరైనా ఇతర వ్యక్తులపై ఎస్పీసీబీ తగిన చర్యలు తీసుకోవచ్చు.
ఒకవేళ, ఈ నిబంధనల ప్రకారం పర్యావరణ హిత పద్ధతిలో కాలం చెల్లిన వాహనాల నిర్వహణ, స్క్రాపింగ్కు సంబంధించిన నిబంధనలను పాటించడంలో ఉత్పత్తిదారు లేదా ఆర్వీపీఎస్ లేదా బల్క్ వినియోగదారు విఫలమైతే.. పర్యావరణం లేదా ప్రజారోగ్యానికి కలిగిన నష్టం, హానిపై పర్యావరణ పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ఉపయోగార్హం కాని పాత, కాలుష్య కారక వాహనాలను దశలవారీగా తొలగించడం కోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహనాల స్క్రాపింగ్ విధానాన్ని రూపొందించింది. ఫిట్నెస్ ప్రాతిపదికగా.. ఉపయోగార్హం కాని, కాలుష్య కారక వాహనాలను స్క్రాప్ చేయడం ఈ విధానం లక్ష్యం. ఈ విధానం కింద దేశవ్యాప్తంగా ఆర్వీఎస్ఎఫ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 84 ఆర్వీఎస్ఎఫ్ లు పనిచేస్తున్నాయి.
ఆర్వీఎస్ఎఫ్ నమోదు, వాహనాల స్క్రాపింగ్ కు ప్రమాణాలు, స్క్రాపింగ్ ప్రక్రియ, ఆడిట్, ఆర్వీఎస్ఎఫ్ ల పనితీరుకు ధ్రువీకరణల విధానాలను రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ ప్రకటించిన మోటారు వాహనాల (నమోదు, వాహన స్క్రాపింగ్ కేంద్రాల విధులు) నిబంధనలు- 2021 వివరిస్తాయి. అంతే కాకుండా సీపీసీబీ జారీ చేసిన ‘పర్యావరణ అనుకూల పద్ధతిలో కాలం చెల్లిన వాహనాల నిర్వహణ’ మార్గదర్శకాలను ఆర్వీఎస్ఎఫ్ అమలు పరచాల్సి ఉంటుంది.
2021 అక్టోబరు 4 నాటి జీఎస్ఆర్ 714 (ఇ) ప్రకారం కేంద్ర మోటారు వాహనాల (ఇరవై మూడవ సవరణ) నిబంధనలు-2021ని రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీని ప్రకారం.. కొత్త వాహన కొనుగోలుదారు కాలం చెల్లిన వాహనానికి సంబంధించిన ‘డిపాజిట్ సర్టిఫికెట్’ను సమర్పిస్తే కొత్త వాహనంపై రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. ఇదే కాకుండా, 2021 అక్టోబరు 5 నాటి జీఎస్ఆర్ 720 (ఇ) ప్రకారం కేంద్ర మోటారు వాహనాల (ఇరవై నాలుగవ సవరణ) నిబంధనలు- 2021ని రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీని ప్రకారం రవాణాయేతర వాహనాల విషయంలో ఇరవై ఐదు శాతం వరకు, రవాణా వాహనాలైతే పదిహేను శాతం వరకు మోటారు వాహన పన్నులో రాయితీ లభిస్తుంది.
వీటితోపాటు.. ఎలక్ట్రిక్ వాహనాలు, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల స్వీకరణను ప్రోత్సహించడానికి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కింది ప్రకటనలు జారీ చేసింది:
a. 2018 అక్టోబరు 18 నాటి ఎస్వో 5333 (ఇ) ద్వారా బ్యాటరీతో, ఇథనాల్ – మిథనాల్ ఇంధనాలతో నడిచే రవాణా వాహనాలకు పర్మిట్ అవసరాల నుంచి మినహాయింపులు కల్పించింది.
b. 2021 ఆగష్టు 2 నాటి జీఎస్ఆర్ 525 (ఇ) ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ లేదా పునరుద్ధరణ, కొత్త రిజిస్ట్రేషన్ మార్కు కేటాయింపులపై రుసుముల చెల్లింపు నుంచి బ్యాటరీతో నడిచే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది.
c. 2023 ఏప్రిల్ 18 నాటి జీఎస్ఆర్ 302 (ఇ) ద్వారా బ్యాటరీతో నడిచే వాహనాలకు ఎలాంటి అనుమతి రుసుమూ లేకుండా ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ జారీ.
d. 2018 ఆగష్టు 7 నాటి జీఎస్ఆర్ 749 (ఇ) ద్వారా బ్యాటరీతో నడిచే రవాణా వాహనాలకు వెనుక ఆకుపచ్చ రంగుపై పసుపు రంగులోను, బ్యాటరీతో నడిచే అన్ని ఇతర వాహనాలకు వెనుక ఆకుపచ్చ రంగుపై తెలుపు రంగులోను రిజిస్ట్రేషన్ మార్కు జారీ.
వీటితోపాటు.. దేశంలో ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సహించడం కోసం రూ. 10,900 కోట్ల వ్యయంతో రెండేళ్ల కాలానికి ‘ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నొవేటివ్ వెహికిల్ ఎన్హాన్స్ మెంట్ (పీఎం ఇ-డ్రైవ్)’ పథకాన్ని గతేడాది సెప్టెంబరు 29న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ పథకం ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ త్రిచక్ర వాహనాలు, ఇ-అంబులెన్సులు, ఇ-ట్రక్కులు, కొత్తగా రూపొందుతున్న ఇతర తరహా ఎలక్ట్రానిక్ వాహనాలకు రాయితీలను, డిమాండ్ ఆధారిత ప్రోత్సాహకాలను అందిస్తుంది. 24.79 లక్షల ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఎలక్ట్రానిక్ త్రిచక్ర వాహనాలు, 14,028 ఇ-బస్సులకు ఇది ప్రయోజనాలను అందిస్తుంది.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖా మంత్రి శ్రీ కృతివర్ధన్ సింగ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2099375)
Visitor Counter : 57