నీతి ఆయోగ్
మహిళా సెలూన్లు, బ్యూటీ పార్లర్ యజమానుల సాధికారత: అర్బన్ కంపెనీతో మహిళా పారిశ్రామికవేత్తల వేదిక ఒప్పందం
స్థానిక సెలూన్లు, పార్లర్ల యజమానులుగా ఉన్న మహిళా వ్యవస్థాపకులకు
చేయూతనివ్వడం ఈ కార్యక్రమ లక్ష్యం
మార్గదర్శకత్వం, అనుసంధానతతోపాటు నైపుణ్య పరమైన, న్యాయ, ప్రభుత్వ నిబంధనలు, ఆర్థిక వనరుల లభ్యత, మార్కెట్, వాణిజ్యాభివృద్ధి రంగాల్లో మహిళా వ్యవస్థాపకులకు శిక్షణ
Posted On:
15 NOV 2024 3:43PM by PIB Hyderabad
మహిళా పారిశ్రామికవేత్తల వేదిక (డబ్ల్యూఈపీ) తన అవార్డ్ టు రివార్డ్ కార్యక్రమం ద్వారా బ్యూటీ-వెల్నెస్ రంగంలో వాణిజ్యాన్ని విస్తరించుకునేలా మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలకు చేయూతనివ్వడానికి ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. మైక్రోసేవ్ కన్సల్టింగ్ తన ప్రాథమిక అధ్యయనంలో నాలుగు రంగాలను కీలకమైనవిగా గుర్తించింది. బ్యూటీ- వెల్ నెస్, వస్త్ర తయారీ, చిల్లర వర్తకం, ఆహార పానీయ రంగాల్లోనే మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలు లక్షకు పైగా ఉన్నాయి. బ్యూటీ-వెల్ నెస్ రంగంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా.. వారికి నైపుణ్యాల మెరుగుదల- అభ్యసన సదుపాయాలను ఒకేచోట అందించడంతోపాటు మౌలిక అంశాల అభివృద్ధి, దేశవ్యాప్తంగా మహిళా ఎంఎస్ఎంఈలను ఉన్నతీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇతర కీలక భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ అర్బన్ కంపెనీ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తుంది. సూక్ష్మ సంస్థల్లో పని చేస్తున్న మహిళలను గుర్తించడంతోపాటు వారి వ్యాపారాల వృద్ధికి దోహదపడుతుంది. సార్వత్రిక దరఖాస్తుల ఆధారంగా ఓ బృందాన్ని ఎంపిక చేసి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఢిల్లీ నుంచి 25 మంది మహిళలను ఎంపిక చేస్తారు. సమగ్ర శిక్షణ, వారి సెలూన్ వ్యాపారాన్ని పెంచుకునేలా అవకాశాలు కల్పించడం, సౌందర్య రంగంలో అత్యున్నత విజయాలు సాధించేలా ప్రోత్సహిస్తూ.. ఈ కార్యక్రమం ఆ మహిళలను సాధికారులను చేస్తుంది.
2018లో నీతిఆయోగ్ లో సమష్టి వేదికగా మహిళా పారిశ్రామికవేత్తల వేదిక (డబ్ల్యూఈపీ) ఏర్పడింది. అది 2022లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంగా మారింది. మహిళల నేతృత్వంలో అభివృద్ధిని సాకారం చేస్తూ.. దేశంలో మహిళా పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేయడం దీని లక్ష్యం. ప్రభుత్వ, వ్యాపార, మానవీయ, పౌరసమాజ వ్యవస్థలకు ఇది ఓ వేదికగా నిలుస్తుంది. తద్వారా ఉన్నతీకరణ చెందిన, సుస్థిరమైన, ప్రభావవంతమైన కార్యక్రమాల లక్ష్యానికి అనుగుణంగా వాటిని మేళవించి సమన్వయం సాధిస్తుంది. ఇది మహిళా పారిశ్రామికవేత్తలపై విస్తృతమైన ప్రభావం చూపుతుంది. దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయడానికి 20కి పైగా ప్రభుత్వ-ప్రైవేటు రంగ భాగస్వాములు డబ్ల్యూఈపీలో ఉన్నారు. సమష్టి వేదికగా ప్రస్తుత భాగస్వాములకు అవకాశాన్ని అందించి.. వ్యవస్థాపక వృద్ధి కోసం అత్యావశ్యకమైన ఆరు సంస్థాగత లక్ష్యాలను సాధించడంలో సమన్వయ సహకారాన్ని అందిస్తుంది. ఆ ఆరు అంశాలు- ఆర్థిక వనరుల లభ్యత, మార్కెట్ అనుసంధానత, శిక్షణ- నైపుణ్యాభివృద్ధి, మార్గనిర్దేశం, వ్యవస్థాగత చర్యలు, వాణిజ్యాభివృద్ధి సేవలు.
అవార్డ్ టు రివార్డ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా.. భాగస్వామ్యాన్ని సంస్థాగతీకరించే దిశగా 2023లో డబ్ల్యూఈపీ నిర్ణయాత్మకమైన ముందడుగు వేసింది. దీనికింద, భాగస్వాములందరూ ఒకచోటికి రావడం ద్వారా మహిళా వ్యవస్థాపకుల నిర్దిష్ట అవసరాలను తీర్చడంతోపాటు వారి విజయానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఇది కార్యాచరణకు సిద్ధంగా ఉన్న వ్యవస్థ. అర్థవంతమైన ప్రభావాన్ని చూపేలా నిర్దిష్ట కార్యక్రమాల రూపకల్పనకు సహకరించేలా భాగస్వామ్య పక్షాలకు వీలు కల్పిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా బ్యూటీ-సెలూన్ పరిశ్రమలో మహిళా వ్యవస్థాపకుల సాధికారత కోసం డబ్ల్యూఈపీ, అర్బన్ కంపెనీ కట్టుబడి ఉన్నాయి.
డబ్ల్యూఈపీలో ఇప్పటికే 30,000 మంది మహిళా వ్యవస్థాపకులున్న నేపథ్యంలో.. అర్బన్ కంపెనీతో ఈ భాగస్వామ్యం ఓ వినూత్న ప్రభుత్వ-ప్రైవేటు సమన్వయంగా నిలుస్తుంది. బ్యూటీ - వెల్ నెస్ రంగంలో మహిళలను ప్రోత్సహించి, వారికి చేయూతనివ్వడం దీని లక్ష్యం. ఈ ప్రభుత్వ-ప్రైవేటు సహకారం మహిళలకు తమ వ్యాపారాలను స్వతంత్రంగా నిర్వహించుకునే నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందించడం మాత్రమే కాకుండా.. కొత్త అవకాశాలు కల్పించి, ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా మార్గం సుగమం చేస్తుంది.
‘‘మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని సాధించాలంటే మహిళా వ్యవస్థాపకులకు ప్రోత్సాహం అందించడం కీలకమైనది. శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, వనరుల లభ్యత, మార్గనిర్దేశం, వ్యవస్థాగతమైన సహకార లభ్యతలతో మహిళా వ్యవస్థాపకులకు డబ్ల్యూఈపీ సమగ్రమైన చేయూత అందిస్తుంది. ఈ నిరంతర సహకారం వారి వ్యవస్థాపక ప్రస్థానాన్ని వేగవంతం చేయడానికి అవకాశం కల్పిస్తుంది. బ్యూటీ-వెల్ నెస్ రంగంలో మహిళల సంఖ్య ఎక్కువ. వారు ఈ రంగంలో మరింత లాభదాయకమైన సంస్థలను నిర్మించడం అత్యంత కీలకమైన అంశం. అర్బన్ కంపెనీతో మా భాగస్వామ్యం.. ఆ రంగంలో మహిళల కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందించే దిశగా కీలకమైన ముందడుగు. సుస్థిరమైన వ్యాపారాల ఏర్పాటు కోసం వారికి అవకాశం కల్పిస్తుంది’’ అని నీతి ఆయోగ్ ప్రధాన ఆర్థిక సలహాదారు, డబ్ల్యూఈపీ మిషన్ డైరెక్టర్ శ్రీమతి అన్నా రాయ్ అన్నారు.
***
(Release ID: 2073780)