బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎండిఒలపై భాగస్వాములతో సంప్రదింపులు, స్టార్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
గనుల మూసివేత కార్యకలాపాల్లో సమష్టి సహకారం అందించాలని బొగ్గుశాఖ మంత్రి పిలుపు
దేశ ప్రగతిలో బొగ్గు పరిశ్రమ పాత్ర కీలకం: శ్రీ జి.కిషన్ రెడ్డి
Posted On:
21 OCT 2024 10:33PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు, లిగ్నైట్ గనులకు సంబంధించిన స్టార్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవాన్నీ, మైన్ డెవలపర్స్ లేదా ఆపరేటర్ల (ఎండిఒ) అంశంపై వాటాదారుల సంప్రదింపులను బొగ్గు మంత్రిత్వ శాఖ సోమవారం ఢిల్లీలో విజయవంతంగా నిర్వహించింది. ఇదే సందర్భంలో జాతీయ స్థాయి కోల్ డైరెక్టరీని కూడా విడుదల చేసింది. బొగ్గు, లిగ్నైట్ గనుల అసాధారణ పనితీరును గుర్తించడం, కీలక భాగస్వాములతో సంప్రదింపులు జరపడం, బొగ్గు రంగంపై విలువైన అభిప్రాయాలను అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, గౌరవ అతిథిగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన విద్యుత్ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఎంఒఇఎఫ్ అండ్ సిసి, డిజిఎంఎస్ లకు సంబంధించిన ముఖ్య సమస్యలను పరిష్కరించడానికి ఎండిఒ భాగస్వాములతో ఆంతరంగిక సదస్సును నిర్వహించారు. ఎండిఒలు ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్ర అవగాహనను పెంపొందించడం, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఈ సదస్సు దృష్టి సారించింది.
ఈ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు చర్చలో చురుగ్గా పాల్గొని, ఎండిఒలు లేవనెత్తిన సమస్యలపై తమ ఆలోచనలను, అభిప్రాయాలను అందించారు. ఎండీవోలకు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అడ్డంకులను తొలగించడానికి కలిసి పనిచేయాలని వారు స్పష్టం చేశారు. బొగ్గు రంగానికి మరింత బాధ్యతాయుతమైన, సంఘటిత సానుకూల వ్యవస్థను నిర్మించే దిశలో ఒక ముఖ్యమైన స్పందనగా ఈ సదస్సు నిలిచింది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి తన ప్రధానోపన్యాసంలో, బొగ్గు ఉత్పత్తిని పెంచడంలో ఎండిఒ వ్యవస్థ ప్రాముఖ్యతను వివరించారు. ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో ఎండీవోల కృషి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియచేస్తూ, రాబోయే సంవత్సరాల్లో ఇంధనానికి డిమాండ్ పెరుగుతుందని, బొగ్గు ప్రధాన ఇంధన వనరుగా ఉంటుందని పేర్కొన్నారు.
మన దేశ పురోగతిని ముందుకు నడిపించడంలో బొగ్గు పరిశ్రమ ఒక కీలక శక్తిగా ఉందని, సమర్థవంతమైన ఎండిఓ భాగస్వామ్యం బొగ్గు రంగంలో ఆత్మనిర్భరతను సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను మరింత ముందుకు తీసుకువెళుతూ దిగుమతులను తగ్గించడానికి , బొగ్గు రంగంలో స్వయం సమృద్ధిని పెంచడానికి గణనీయంగా దోహదం చేస్తోందని మంత్రి చెప్పారు.
గనుల తవ్వకాల కోసం భూములను ఇచ్చిన వారి త్యాగాలను ప్రస్తావిస్తూ, గని కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం, భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యం గురించి మంత్రి వివరించారు. గని కార్మికులందరి పట్ల మానవతా ధోరణితో వ్యవహరించాలని ఆయన అన్నారు.
దిగుమతులను తగ్గిస్తూ దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. పాత గనుల మూసివేత అవసరాన్ని ప్రస్తావిస్తూ.. గనుల మూసివేత కార్యకలాపాలకు సమష్టి సహకారం అవసరమని పిలుపునిచ్చారు. వచ్చే 3-4 ఏళ్లలో మూసివేత పూర్తికాని ఒక్క గని కూడా ఉండకూడదని మంత్రి అన్నారు. ఈ క్లిష్టమైన రంగంలో భారతదేశం ప్రపంచానికి ఒక ప్రమాణంగా నిలవాలని, బాధ్యతాయుతమైన గనుల మూసివేత పద్ధతుల్లో ముందుండాలని సూచించారు. అవార్డు గ్రహీతలందరినీ అభినందించి.. సమన్వయంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.
బాధ్యతాయుతమైన పద్ధతులు, భద్రత, పర్యావరణ ప్రమాణాల పట్ల నిబద్ధత అవసరమని శ్రీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బొగ్గు గనుల రంగంలో సుస్థిరత, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి సమష్టి నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. ఇది దేశానికి మరింత సురక్షితమైన ఇంధన భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తుందని అన్నారు.
గౌరవ అతిథి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ.. భారతదేశ బొగ్గు రంగంలో ఎండిఒల పాత్రపై తన ఆలోచనలను పంచుకున్నారు. భారతదేశ బొగ్గు రంగంలో ఎండిఒలు ఒక కీలకమైన భాగమని పేర్కొన్నారు. నేటి చర్చలు మన దేశంలో బొగ్గు గనుల భవిష్యత్తును రూపొందించడంలో పురోగమిస్తున్న ఉన్న ప్రధాన భాగస్వాములను ఏకతాటిపైకి తెచ్చాయని అన్నారు. బొగ్గు పరిశ్రమ సుస్థిర, సమర్ధవంతమైన వృద్ధికి ప్రభుత్వం, ప్రైవేటు రంగం మధ్య సహకారం కీలకమని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అవార్డు గ్రహీతలను మంత్రి అభినందించారు. . పర్యావరణపరంగా సుస్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులను ప్రోత్సహించడంలో స్టార్ రేటింగ్ సిస్టమ్ ప్రాముఖ్యతను వివరించారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ... పెరుగుతున్న బొగ్గు గనుల విస్తీర్ణం, ఎండిఒల కీలక పాత్రను వివరించారు. ఈ పరిశ్రమలో సమర్థత, సుస్థిరత, దీర్ఘకాలిక వృద్ధి కోసం ఎండిఒ వ్యవస్థ కీలకమైన శక్తిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ నమూనా ప్రైవేట్ రంగం నైపుణ్యం, కార్యాచరణ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి వీలు కల్పించిందని, తద్వారా బొగ్గు-మైనింగ్ రంగాల మొత్తం పనితీరును మెరుగు పరచి ఉత్పత్తిన పెంపునకు దోహదపడిందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మధ్య ఈ సమన్వయంపైనే మన బొగ్గు పరిశ్రమ సమర్థవంతమైన, స్థిరమైన విస్తరణ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బొగ్గు మంత్రిత్వ శాఖ 2022-23 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించిన 43 గనులను గుర్తించి స్టార్ రేటింగ్ అవార్డులను ప్రదానం చేసింది. ఇందులో 4 గనులు మొదటి స్థానంలో, 2 రెండో స్థానంలో, 6 మూడో స్థానంలో నిలిచాయి. మైనింగ్ కార్యకలాపాలు, పర్యావరణ పద్ధతులు, కార్మికుల భద్రత వంటి కీలక రంగాలలో అసాధారణ పనితీరును గుర్తించడానికి ఈ అవార్డులు ఉపయోగపడతాయి. ఈ రంగంలో ప్రతిభను ప్రోత్సహిస్తాయి. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తిస్తూ , గనుల మంత్రిత్వ శాఖ ఐజీఓటీ-కర్మయోగి అవార్డులను ప్రదానం చేసింది.
వాటాదారుల సంప్రదింపులు మంత్రిత్వ శాఖ, ఎండిఓల మధ్య బహిరంగ చర్చలకు కీలకమైన వేదికను అందించాయి. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, ఉత్పాదకతను పెంచడం, కార్యాచరణ సవాళ్లను పరిష్కరించడంపై ఇవి దృష్టి సారించాయి. ఈ ప్రయత్నం బొగ్గు ఉత్పత్తిని పెంచుతుందని, దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, మైనింగ్ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన కోల్ డైరెక్టరీ - బొగ్గు, లిగ్నైట్ ఉత్పత్తి, రంగాల వారీగా తరలింపు (సెక్టోరల్ డిస్పాచ్), బొగ్గు పరిశ్రమకు సంబంధించిన ఇతర కీలక అంశాలపై సమగ్ర సమాచార భాండాగారంగా పనిచేస్తుంది. ఈ రంగంలో పరిశుభ్రత, సుస్థిరతకు సంబంధించి అత్యున్నత ప్రమాణాలను పాటించే కార్యక్రమాలను గౌరవిస్తూ స్వచ్ఛతా అవార్డులను కూడా ప్రదానం చేశారు.
ఈ అన్ని కార్యక్రమాల ద్వారా బొగ్గు, లిగ్నైట్ గనుల్లో పనితీరును పెంచడానికి, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి , భారతీయ బొగ్గు రంగం వృద్ధి, అభివృద్ధినీ నడిపించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి స్థిరమైన పద్ధతులతోపాటు ఆశావహ దృష్టితో కార్యక్రమం ముగిసింది.
(Release ID: 2066965)