సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“ప్రపంచంలోని అందరికీ అర్ధమయ్యే ఎల్లలెరుగని భాష సంగీత నాట్యాల సొంతం”, అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


“సాంస్కృతిక వేడుకల్లో భాగస్వామ్యం వల్ల, యువత మూలలతో అనుసంధానమై, జాతి నిర్మాణంలో తమ వంతు పాత్రను మరింత సమర్ధంగా పోషించగలరు” అన్న ప్రధాని

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ ద్వారా

‘భారతీయ నాట్యరీతుల అంతర్జాతీయ ఉత్సవాలు’ ప్రారంభం

Posted On: 16 OCT 2024 6:33PM by PIB Hyderabad

అనేకదేశాల కళాకారులు పాల్గొంటున్న ‘భారతీయ నాట్య రీతుల తొలి అంతర్జాతీయ ఉత్సవాన్ని’  కేంద్ర సంగీత నాటక అకాడమీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రత్యేక సందేశమిస్తూ, భారతీయ సంస్కృతిలో నాట్యం ప్రాధాన్యాన్ని తెలియజేశారు, దేశ సంప్రదాయాల్లో పాలుపంచుకునేందుకు యువతకు నాట్యం చక్కని అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ పూసా ‘ఎన్ఏసీఏ’ కాంప్లెక్స్ లోని  ‘ఏపీ షిండే సింపోజియం హాల్’ లో ఏర్పాటైన ఆరు రోజుల పండుగను కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ ప్రారంభించారు. ఉత్సవం ద్వారా భారతీయ నాట్యరీతుల వైవిధ్యాన్నీ, వైభవాన్నీ కళాకారులూ, ఆ రంగానికి చెందిన నిష్ణాతులూ, విద్యార్థులూ కలిసి జరుపుకుంటున్నారు.

ఇటువంటి విశిష్ఠమైన పండుగను ఏర్పాటు చేసినందుకు సంగీత నాటక అకాడమీకీ, సాంస్కృతిక మంత్రిత్వశాఖకూ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి, “చిరకాలం జ్ఞాపకముండే చారిత్రిక సందర్భమిది. వేడుకలకు వివిధాదేశాల కళాకారుల హాజరవుతుండడం వల్ల , సాంస్కృతిక అంశాల పరస్పర మార్పిడికి ఇది  అనువవైన సందర్భం. ప్రపంచంలోని అందరికీ అర్ధమయ్యే ఎల్లలెరుగని భాష సంగీత నాట్యాల సొంతం”, అన్నారు. యువతనుద్దేశించి, “దేశ సంస్కృతిలో నాట్యం విడదీయలేని అంశం.  భారతీయ కళలకు సంబంధించి తొలి గ్రంధాలను భరతముని రచించారు, ఆ ఘన వారసత్వాన్ని కొనసాగించడం మనకు దక్కిన బాధ్యత,  గౌరవం” అని  శ్రీ మోదీ చెప్పారు. సాంస్కృతిక వేడుకల్లో యువత భాగస్వామ్యం వల్ల వారు తమ మూలలతో అనుసంధానమై, జాతి నిర్మాణంలో బలమైన పాత్రను పోషించగలరన్నారు. 

నాట్యోత్సవంలో ప్రసంగించిన సాంస్కృతిక, పర్యాటక శాఖల కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్, “ఘనమైన భారతీయ నృత్య సంప్రదాయాన్ని వేడుక చేసుకునే ఈ పండుగ, ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చిన కళాకారులూ, నిపుణులను ఒక వేదిక పైకి చేరుస్తోంది. నిరంతరం ప్రవహించే గంగానది లాగా, అనేక తరాల అంకితభావం వల్ల ఈ సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. అవే మనని భిన్నత్వంలో కూడా పట్టి ఉంచే బలమైన సూత్రాలు” అన్నారు.  “రాజస్థాన్ ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన నేను, కొరత పరిస్థితుల్లో కూడా కళ ఉద్భవించడాన్ని చూశాను. సంగీత నాట్యాలు జీవితానికి గొప్ప అర్ధాన్నిస్తాయి, మీరాబాయి కీర్తనల్లాగే అమితమైన సంతోషాన్ని కలిగిస్తాయి. అస్థిరత, రాజకీయ అనిశ్చితి, నైతిక పతనాలు రాజ్యామేలుతున్న నేటి ప్రపంచ సమాజానికి తన ప్రాచీన విజ్ఞానం, కళలు, విలువల ద్వారా సాంస్కృతిక దిక్సూచిగా నిలిచే అవకాశాన్ని భారత దేశం కలిగి ఉంది. మన  ప్రాచీన సంపదలైన యోగా, ఆయుర్వేదాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతూ ఉన్న నేటి పరిస్థితిలో, ఆ వారసత్వాలని కొనసాగించవలసిన బాధ్యత మన మీద ఉంది.  సముద్రాన్ని మధిస్తే అమృతం ఉద్భవించినట్లుగానే, ఈ ఉత్సవ వేదికపై జరిగే మేధామధనం వల్ల అందిన స్ఫూర్తి, భారత దేశాన్నీ, ప్రపంచాన్నీ సుసంపన్నం చేసి,  భవిష్యతరాలకి మార్గదర్శిగా నిలుస్తుంది” అన్నారు.

అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి, పెద్దసంఖ్యలో యువత ఒకచోటికి చేరే  ఏర్పాటు చేసిన సంగీత నాటక అకాడమీకి సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి కృతజ్ఞతలు తెలియజేశారు. “సాంస్కృతిక వర్గాలు, కళాకారులూ, నాట్యకారుల సమాజ సంక్షేమం, సమానత్వాల కోసం మేము కృషి చేస్తున్నాం. మా శాఖ మంత్రిగారి నేతృత్వంలో రానున్న సంవత్సరాల్లో మరింత ప్రగతిని సాధిస్తాం” అంటూ ముగించారు.

“కాఠిన్యాన్ని నాట్యం పదేపదే కరిగించింది. నటరాజు అన్న ఊహ ప్రస్తుత సమయంలో మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. శాస్త్ర సాంకేతిక ప్రగతి, కృత్రిమ మేధ వంటి అంశాల గురించి మాట్లాడినప్పుడు, సోనాల్ మాన్ సింగ్ కృత్రిమ మేధ సహాయంతో నర్తించే పరిస్థితి రాదు కదా, అన్న భయం నన్ను వెంటాడుతుంది. కొత్త పోకడలను స్వీకరించేటప్పుడు తూకం, లోతైన ఆలోచన, జాగురూకత అనివార్యం, అప్పుడే సృజనకు సరైన అర్ధం నిలుస్తుంది” అని ప్రముఖ నర్తకి డాక్టర్ సోనాల్ మాన్ సింగ్ పేర్కొన్నారు.  

సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యా పురేచా మాట్లాడుతూ, దేశానికి చెందిన అనేక నాట్యరీతులని ఆస్వాదించే అదృష్టం తనకి కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. “సుసంపన్నమైన మన వైవిధ్యభరిత నాట్యరీతులని ఒక గొడుగు కిందికి చేర్చి, భారతీయ నృత్యంలోని భిన్న పార్శ్వాలను ఏకం చేయాలన్న ఆలోచన నాకు దైవికంగా కలిగిందే. గౌరవనీయ ప్రధాని పేర్కొన్నట్లు, దేదీప్యమైన మన సాంస్కృతిక ప్రభను కొనసాగించడం మనకి గౌరవం, మన బాధ్యత...” అన్నారు.

నాట్యోత్సవం నేపథ్యం:

సంగీత నాటక అకాడమీ నిర్వహణలో జరుగుతున్న భారతీయ నాట్యరీతుల అంతర్జాతీయ ఉత్సవం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, కళారంగ పండితులూ, విమర్శకులు, ప్రదర్శకులను ఒకచోటికి చేరుస్తోంది. ఈరోజు ప్రారంభమయిన ఈ పండుగ, నాట్య శిక్షణ, భారతీయ నృత్యం  చారిత్రిక మూలాలూ, ఆధునిక పోకడలూ, పరిశోధన పద్ధతులూ, కళలపై కృత్రిమ మేధ ప్రభావం వంటి వివిధ అంశాలని ముప్పై సదస్సుల్లో చర్చిస్తుంది. కళారంగానికి వాణిజ్యసంస్థలు తమ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా అందించే చేయూత, కళాకారులకు స్థిరమైన జీవనోపాధి వంటి అంశాలు సైతం చర్చల్లో భాగమవుతాయి.

ప్రాంగణంలోని ‘కామాని’ సభాగారంలో ప్రతి సాయంత్రం  డాక్టర్ సోనాల్ మాన్ సింగ్, రమ్లీ ఇబ్రహీం వంటి ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు సహా దేశ విదేశ కళాకారుల, సోలో, బృంద ప్రదర్శనలూ ఉంటాయి. లలిత కళ అకాడమీ, ఏపీ షిండే సింపోజియం హాల్లో ఈరోజు ప్రారంభమయ్యే రెండు ఎక్జిబిషన్లు – పాల్గొంటున్న కళాకారుల విజయాలను ప్రదర్శిస్తాయి. కళారంగంలో స్థిరమైన జీవనోపాధి అవకాశాల గురించి చర్చలు సహా, భారతీయ నృత్య రంగానికి వ్యవస్థాగత మద్దతును సమకూర్చే వేదికగా నిలవాలన్నది ఉత్సవాల లక్ష్యాల్లో ఒకటి కాగా, సహకారం, సాంస్కృతిక మార్పిళ్ళకు వేదికగా నిలవాలని కూడా పండుగ ఆశిస్తోంది.

సంగీత నాటక అకాడమీ నేపథ్యం:

సంగీతం, నాట్యాలకు సంబంధించిన జాతీయ సంస్థ. దేశం సార్వభౌమత్వాన్ని పొందిన తరువాత ప్రారంభించిన తొలి జాతీయస్థాయి కళారంగ అకాడమీ. 1952 మే 31న భారత ప్రభుత్వ విద్యాశాఖ చేసిన తీర్మానం ద్వారా మనుగడలోకి వచ్చింది.

మరుసటి ఏడాది అధ్యక్షుడిగా డాక్టర్ పీవీ రాజమన్నార్ నియామకం, దేశవ్యాప్త ప్రతినిధులతో కూడిన  సర్వసభ్య పరిషత్తు ఏర్పాటుతో సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు భవనంలో, 1953 జనవరి 28న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అకాడమీ ప్రారంభమయ్యింది. కళల రంగంలో అత్యున్నత సంస్థగా, సంగీతం, నాట్యం, నాటక రంగాల ద్వారా వెల్లడయ్యే దేశ అమూల్య వారసత్వ సంపదను కాపాడే గురుతర బాధ్యతను సంస్థ తొలినాళ్ళ నుంచీ చేపడుతూ వస్తోంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అకాడమీ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల ఆర్ట్ అకాడమీలతోనూ, దేశంలోని ఇతర ప్రముఖ సాంస్కృతిక సంస్థల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది.

సంగీత నాటక అకాడమీ కళా రంగంలో ప్రాముఖ్యం కలిగిన ఘట్టాలనూ, సంస్థలను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షిస్తుంది. కళారంగ అత్యున్నత సంస్థ అయిన అకాడమీ, ఈ రంగానికి అవసరమైన విధానాల రూపకల్పన, కార్యక్రమాల ఏర్పాటు విషయంలో  ప్రభుత్వానికి  సేవలు, సలహాలూ, సూచనలను అందిస్తుంది. అంతేకాక, వివిధ రాష్ట్రాల మధ్య, దేశాలతో సాంస్కృతిక సమన్వయ సాధన బాధ్యతను ప్రభుత్వంతో  కలిసి నెరవేరుస్తుంది.

***



(Release ID: 2065655) Visitor Counter : 4


Read this release in: Hindi , English , Urdu