మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సుప్రీంకోర్టు- జువెనైల్ జస్టిస్ కమిటీ ఆధ్వర్యంలో 9వ దఫా సలహా సమావేశం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి కీలక ఉపన్యాసం
ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొనే దివ్యాంగ చిన్నారులపట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం: శ్రీమతి అన్నపూర్ణా దేవి
పరిస్థితుల ప్రమేయం లేకుండా, పిల్లల అభ్యున్నతికీ, పూర్తి ఎదుగుదలకూ కలిసి పనిచేయాలి: శ్రీమతి అన్నపూర్ణాదేవి
Posted On:
28 SEP 2024 6:28PM by PIB Hyderabad
యూనిసెఫ్ తో కలిసి సుప్రీంకోర్టు- జువెనైల్ జస్టిస్ కమిటీ నిర్వహించిన 9వ దఫా సలహా సమావేశంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి కీలకోపన్యాసం చేశారు. న్యూఢిల్లీలోని మధురా రోడ్డులోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది.
ఈసారి విభిన్న అంశాలకు చెందిన మిశ్రమ సమస్యలపై దృష్టిసారించారు. చట్ట సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలు, సంరక్షణ అవసరమైన పిల్లలు- అన్న కోణంలో చర్చలు సాగాయి. ఆసక్తిగలిగిన వారి మధ్య సంప్రదింపులు ప్రారంభం కావాలన్నది ఈ సలహా సమావేశపు లక్ష్యం. పిల్లల సంరక్షణ కోసం ముఖ్యంగా, వైకల్యంతో ఉన్న పిల్లల భద్రత, సంరక్షణల కోసం ఆచరణాత్మక అవగాహనను కలిగించడం కూడా ఈ సలహా సమావేశపు లక్ష్యాల్లో ఒకటి.
సుప్రీంకోర్టు- జువైనల్ జస్టిస్ కమిటీ ఛైర్పర్సన్ జస్టిస్ బీవీ నాగరత్న తొలి పలుకులతో కార్యక్రమం ప్రారంభమైంది. దివ్యాంగులైన పిల్లల హక్కుల సంరక్షణ ప్రాముఖ్యతను జస్టిస్ నాగరత్న ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కీలకమైన పనిని నిర్వహించాల్సిన సమష్టి బాధ్యత ఈ రంగానికి చెందిన భాగస్వాములందరిమీదా ఉందని అన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ధనంజయ వై.చంద్రచూడ్ ప్రారంభోపన్యాసం చేశారు. వ్యక్తిగత సామర్ధ్యంతో సంబంధం లేకుండా పిల్లలందరూ పూర్తిస్థాయిలో ఎదగడానికి అవకాశం ఉన్న సమ్మిళిత సమాజాన్ని సృష్టించాల్సి ఉందని అన్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలు ఎదుర్కొంటున్న బహుముఖ సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర విధానం అవసరమని స్పష్టం చేశారు.
‘‘పిల్లల రక్షణ అనేది కేవలం ఒక భావన కాదు. ప్రత్యేకించి వైకల్యాలున్న పిల్లల విషయాన్ని తీసుకుంటే ఈ రక్షణ అనేది మన ఉమ్మడి కర్తవ్యం. మన జనాభాలో దాదాపు మూడింట ఒకవంతు మంది పిల్లలే ఉన్నార’’ని కేంద్ర మంత్రి అన్నారు. వారి సంక్షేమం, భద్రత పట్ల భారత్ కుగల దృఢమైన నిబద్ధతను నేటి సమావేశం మరోసారి స్పష్టం చేసిందని ఆమె అన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, ప్రతి బిడ్డ సురక్షితంగా ఎదగగలిగే వాతావరణాన్ని కల్పించడానికి కేంద్రప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని అన్నారు.
పిల్లల రక్షణ కోసం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు పెరిగిన నిదుల కేటాయింపులనేవి కేంద్రప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొనే దివ్యాంగ పిల్లలపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అన్నారు. అందరూకలిసి పని చేయడం ద్వారా, వారి పరిస్థితులతో సంబంధం లేకుండా, చిన్నారులు అభివృద్ధి చెందేలా , వారి పూర్తి శక్తియుక్తులను పొందగలిగేలా చూడవచ్చని అన్నారు.
భారత్లో పని చేస్తున్న యునిసెఫ్ ప్రతినిధి శ్రీమతి సింథియా మెక్కాఫ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలల హక్కులు, సంక్షేమాన్ని బలోపేతం చేయడంలో, ముఖ్యంగా ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న చిన్నారుల సంక్షేమం కోసం యునిసెఫ్ చూపుతున్న నిబద్ధతను ఆమె తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లు, విజయాలను తెలిపే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం సమగ్రమైన చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల కరదీపికను విడుదల చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. దివ్యాంగుల రక్షణ , సాధికారత కోసం సమర్థవంతమైన చర్యలను అమలు చేయడంలో సంబందిత వ్యక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ కరదీపిక దోహదం చేస్తుంది.
***
(Release ID: 2060070)
Visitor Counter : 16