కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ప్రతిష్ఠాత్మక పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వార్షిక అవార్డ్ 2024 కోసం దరఖాస్తుల ఆహ్వానం : టెలికాం విభాగం


టెలికాం రంగం అన్ని విభాగాల్లో సృజనాత్మకత, నైపుణ్యాల ప్రోత్సాహం లక్ష్యంగా పురస్కారాల ప్రదానం

దేశ పౌరులు/సంస్థలు, భారత్ లో నమోదు చేసుకున్న సంస్థలు దరఖాస్తుకు అర్హులు

జాతీయ అవార్డు పోర్టల్ https://www.awards.gov.in లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పంపొచ్చు

సెప్టెంబర్ 30 చివరి తేదీ

Posted On: 18 SEP 2024 11:52PM by PIB Hyderabad
టెలికాం రంగంలో అత్యున్నత సేవలను గుర్తించే వార్షిక పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అవార్డ్-2024 కు ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT), దరఖాస్తులను  ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. భారత పౌరులు, దేశంలో నమోదైన సంస్థలు/సంఘాలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన సంస్థలు అవార్డ్ నిమిత్తం దరఖాస్తు చేసుకొనవచ్చు/పేర్లను ప్రతిపాదించవచ్చు.

పురస్కారం పరిశీలన కోసం తమ/సంస్థల పేర్లను పంపవలసిందిగా ఈ కింది వారిని కూడా ఆహ్వానిస్తున్నారు :

·         విశ్వవిద్యాలయాలు; సాంకేతిక/సాంప్రదాయక/ఉన్నత విద్యాసంస్థలు

·         కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని అంతర్గత వాణిజ్య, పరిశ్రమల ప్రోత్సాహక  విభాగానికి చెందిన  ‘ఇన్వెస్ట్ ఇండియా’  

·         టెలికాం రంగ సంస్థలు/సంఘాల అధినేతలు  

పురస్కారం పొందేందుకు అర్హమైన వ్యక్తులు/సంస్థలను, తగిన కారణం చూపి, అవార్డ్ కమిటీ తనంతట తానే సిఫార్సు చేయవచ్చు

జాతీయ అవార్డు పోర్టల్ (నేషనల్ అవార్డ్ పోర్టల్) లో  ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపవచ్చు. అప్లికేషన్ల అందజేతకు సెప్టెంబర్ ౩౦ తుది గడువు. (నియమ నిబంధనల వివరాలు   https://www.awards.gov.in వెబ్సైట్ లోని  Regulations విభాగంలో ఉన్నాయి.

 పురస్కారం కింద రెండు లక్షల రూపాయల నగదు బహుమతి సహా,  శాలువ/ప్రశంసాపత్రం/జ్ఞాపికలను అందజేస్తారు. అవార్డు కమిటీ ఎంపిక నిర్ణయం మేరకు, ఏడాదిలో అత్యధికంగా ఐదు అవార్డులను అందిస్తారు.

అర్హత: భారత పౌరులు, దేశంలో నమోదైన సంస్థలు/సంఘాలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంస్థలు అవార్డ్ పొందేందుకు అర్హులు. గత మూడేళ్ళ కాలంలో అందించిన సేవలు, దేశంలో చేపట్టిన కార్యక్రమాలు, అవార్డు కోసం పరిగణనలోకి తీసుకునే అంశాలు. అవార్డు పొందేందుకు వయో పరిమితి లేదు, అత్యుత్తమ ప్రతిభ/విజయాలకు వయసు అడ్డు కాబోదు.  

పురస్కారం లక్ష్యాలు :

టెలికాం రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ఈ రంగంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలతో కూడిన  సృజనాత్మక  వాతావరణం కల్పించేందుకు,  ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అవార్డ్ ను నెలకొల్పింది. టెలికాం రంగంలో చూపిన  అత్యుత్తమ ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మక పరిష్కారాలు/ఆవిష్కరణలు, అందించిన సేవలు; వ్యవసాయ/ఆరోగ్య/విద్యా రంగాలకు అనువైన టెలికాం పరిష్కారాలను అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం అవార్డు లక్ష్యాలు.  

వ్యక్తులు/సంస్థలు/సంఘాలు చూపిన ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో పురస్కారాన్ని నెలకొల్పారు. పౌరులకు మెరుగైన ప్రమాణాలను అందించడం లక్ష్యంగా టెలికాం రంగంలో నూతన ఆలోచనలు, నవీకరణ, ఉత్తమ ప్రతిభను పెంపొందించడమే టెలికమ్యూనికేషన్స్ శాఖ లక్ష్యం.  

దేశాభివృద్ధికి, పౌరుల మెరుగైన జీవనానికి టెలికాం వ్యవస్థ/సేవలు అత్యంత ముఖ్యమైనవి. దేశాభివృద్ధికి, పరిశ్రమల అభివృద్ధికి తమ పూర్తి శక్తియుక్తులను అందించే విధంగా  వ్యక్తులు/సంస్థలను అవార్డు ప్రోత్సాహిస్తుంది.  తగిన గుర్తింపు అందించడం ద్వారా వ్యక్తులు/సంస్థల్లో సృజనాత్మకత/ఉత్తమ ప్రతిభను ప్రోత్సహించి/వెలికితీసి, నైపుణ్యం కలిగిన వ్యవస్థలను రూపొందించడం, టెలికాం రంగంలో నూతన సాంకేతికలను పాదుకొల్పడం,  తద్వారా విద్య/ఆరోగ్య/వ్యవసాయం వంటి రంగాలకు లబ్ధి చేకూర్చడం పురస్కారాల వల్ల సాధ్యపడగలదని ఆశిస్తున్నారు.


మరింత సమాచారం కోసం....

X - https://x.com/DoT_India

Insta-https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

Fb - https://www.facebook.com/DoTIndia

 

YouTube- https://www.youtube.com/@departmentoftelecom]



(Release ID: 2056572) Visitor Counter : 21


Read this release in: Urdu , English , Hindi