రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఈ ఏడాది రబీ సీజన్ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు) కోసం ఫాస్ఫేట్, పొటాష్ (పి అండ్ కె) ఎరువులపై పోషకాధారిత రాయితీ (ఎన్‌బిఎస్) రేట్లను ఆమోదించిన మంత్రివర్గం

Posted On: 18 SEP 2024 3:15PM by PIB Hyderabad

ఈ ఏడాది రబీ సీజన్ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు) కోసం ఫాస్ఫాట్, పొటాష్ (పి అండ్ కె) ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) రేట్లను ఖరారు చేయాలన్న రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

ఈ  ఏడాది రబీ సీజన్ కోసం అవసరమైన తాత్కాలిక బడ్జెట్ సుమారు రూ.24,475.53 కోట్లు.

ప్రయోజనాలు:

  •   రైతులకు రాయితీపై, సరసమైన, సహేతుకమైన ధరలకు ఎరువులు అందుబాటులోకి వస్తాయి.

  • అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల ఎరువులు, పెట్టుబడి ధరల ధోరణుల దృష్ట్యా పి అండ్ కె ఎరువులపై రాయితీని సవరిస్తున్నారు.

అమలు వ్యూహంలక్ష్యాలు:

రైతులకు సరసమైన ధరలకు ఈ ఎరువులు అందుబాటులో ఉంచడానికి ఈ ఏడాది రబీ (01.10.2024 నుంచి 31.03.2025 వరకు వర్తించే) కోసం ఆమోదించిన రేట్ల ఆధారంగా పి&కె ఎరువులపై రాయితీ అందిస్తారు.

నేపథ్యం:

ఎరువుల తయారీదారులు/దిగుమతిదారుల ద్వారా ప్రభుత్వం 28 గ్రేడ్‌ల పి అండ్ కె ఎరువులను రైతులకు రాయితీ ధరలకు అందుబాటులో ఉంచుతోంది. పి అండ్ కె ఎరువులపై ఎన్‌బీఎస్ పథకం ద్వారా 01.04.2010 నుంచి రాయితీ అందిస్తున్నారు. రైతు హితమైన విధానానికి అనుగుణంగా, రైతులకు సరసమైన ధరలకు పి అండ్ కె ఎరువులు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా ఎరువులు, ఉత్పాదక పెట్టుబడి అంటే యూరియా, డిఏపీ, ఎంవోపీ, సల్ఫర్ ధరల్లో ఇటీవలి ధోరణులకు అనుగుణంగా, ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై రాబోయే రబీ సీజన్ 01.10.24 నుంచి 31.03.25 వరకు కాలానికి ఎన్‌బీఎస్ రేట్లను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమోదించి, నోటిఫై చేసిన ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు రాయితీ అందిస్తారు. దీనివల్ల రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి వస్తాయి.

 

 

***



(Release ID: 2056411) Visitor Counter : 27