పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాలు

Posted On: 08 AUG 2024 1:23PM by PIB Hyderabad

గ‌నులు, ఖ‌నిజాల‌(అభివృద్ధి, నియంత్ర‌ణ‌) చ‌ట్టం - 1957(ఎంఎండీఆర్ చ‌ట్టం 1957)లోని సెక్ష‌న్‌3(ఇ) ఇసుక‌ను ఉప ఖ‌నిజం(మైన‌ర్ మిన‌ర‌ల్‌)గా పేర్కొంది. గ‌నులు, ఖ‌నిజాల‌(అభివృద్ధి, నియంత్ర‌ణ‌) చ‌ట్టం - 1957(ఎంఎండీఆర్ చ‌ట్టం)లోని నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇసుక త‌వ్వ‌కాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ చ‌ట్టంలోని సెక్ష‌న్ 15 ప్ర‌కారం సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాల‌(యూటీ) అధికార యంత్రాంగాలు ఖ‌నిజ రాయితీ నియ‌మాల‌ను రూపొందిస్తాయి. దీంతో పాటు ఖ‌నిజాల‌ అక్ర‌మ త‌వ్వ‌కాలు, ర‌వాణా, నిల్వ‌, ఇందుకు సంబంధించిన ఇత‌ర చ‌ర్య‌ల‌ను నియంత్రించ‌డానికి, సుస్థిర‌మైన ఇసుక త‌వ్వ‌కాల మార్గ‌ద‌ర్శ‌కాల‌కు సంబంధించిన వివిధ నిబంధ‌న‌లు అమ‌ల‌య్యేలా చూడ‌టానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు  / కేంద్రపాలిత ప్రాంతాల‌(యూటీ) అధికార యంత్రాంగాలకు ఎంఎండీఆర్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 23సీ అధికారాలు క‌ల్పించింది.

అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాల వ‌ల్ల న‌దీగ‌ర్భం క్షీణించ‌డం, నీటిలోని జీవాల‌కు న‌ష్టం, ట‌ర్బిడిటీ పెర‌గ‌డం, నీటిమ‌ట్టం త‌గ్గ‌డం, నేల కోత‌కు గుర‌వ‌డం, వ‌ర‌ద‌లు సంభ‌వించ‌డం, మౌలిక స‌దుపాయాల‌కు న‌ష్టం వాటిల్ల‌డం, సార‌వంత‌మైన భూమికి న‌ష్టం జ‌ర‌గ‌డం వంటి ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టాలు క‌లుగుతాయి. స్థానిక ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థపై నీటి నాణ్య‌త తగ్గ‌డం లాంటి ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డ‌టంతో పాటు న‌దీతీర ప్రాంతంలో ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌పై ప్ర‌మాద‌క‌ర రీతిలో ప్ర‌భావం ప‌డుతుంది.

న్యాయ‌బ‌ద్ధ‌మైన ఇసుక త‌వ్వ‌కాలు నిర్దేశిత ప‌రిమితుల‌కు లోబడి ఉండాలి. న్యాయ‌బ‌ద్ధ‌మైన ఇసుక త‌వ్వ‌కాల‌కు ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌భావ మ‌దింపు(ఈఐఏ) నోటిఫికేష‌న్ ఎస్‌.ఓ.1533(ఈ) తేదీ 14.09.2006, ఆ త‌ర్వాత వ‌చ్చిన స‌వ‌ర‌ణ‌ల ప్ర‌కారం, ఆమోదిత త‌వ్వ‌కాల ప్ర‌ణాళిక మేర‌కు రాష్ట్ర ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌భావ మ‌దింపు సంస్థ‌(ఎస్ఈఐఏఏ) ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. సుస్థిర‌మైన ఇసుక త‌వ్వ‌కాలు, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల నిర్వ‌హ‌ణ ప‌ద్ధ‌తుల‌ను చేప‌ట్ట‌డానికి గానూ స‌ముచిత నియంత్ర‌ణ విధానాన్ని అమ‌లు చేయ‌డానికి మంత్రిత్వ శాఖ కూడా సుస్థిర ఇసుక తవ్వ‌కాల మార్గ‌ద‌ర్శ‌కాలు - 2016, ఇసుక త‌వ్వ‌కాల అదుపు, ప‌ర్య‌వేక్ష‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు - 2020ను జారీ చేసింది. ఏ ప‌రిణామంలో, ఎంత లోతులో ఇసుక త‌వ్వాలి వంటి నిర్దిష్ట ష‌ర‌తుల మేర‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు జారీ చేయ‌డం జ‌రుగుతుంది. త‌వ్వ‌కాల ప‌రిమితిని రాష్ట్ర స్థాయి నిపుణుల అంచ‌నా క‌మిటీ(ఎస్ఈఏసీ) సిఫార్సు చేస్తుంది. నీటి ప్ర‌వాహం తీరు, ప్ర‌వాహ పరిమాణం, న‌ది వెడ‌ల్పు, సామ‌ర్థ్యాన్ని తిరిగి భ‌ర్తీ చేయ‌డం, వృద్ధితో పాటు క్షీణ‌త స్థాయి, ప్ర‌జా మౌలిక స‌దుపాయాల స్థితి వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని ఇసుక త‌వ్వ‌కాల ప్ర‌తిపాద‌న‌ల‌ను విడివిడిగా ప‌రిశీలించిన త‌ర్వాత ఎస్ఈఐఏఏ అనుమ‌తి ఇస్తుంది. “సుస్థిర‌మైన ఇసుక త‌వ్వ‌కాల నిబంధ‌న‌లు - 2016”తో పాటు మంత్రిత్వ శాఖ జారీ చేసిన‌ “ఇసుక త‌వ్వ‌కాల అదుపు, ప‌ర్య‌వేక్ష‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు(ఈఎంజీఎస్ఎం) - 2020” మేర‌కు అనుమ‌తి ఇస్తుంది. ఇసుక త‌వ్వ‌కాల‌పై జిల్లా స‌ర్వే నివేదిక త‌యారీ ప్ర‌క్రియ‌ను ఎస్‌.ఓ. 3611(ఈ) ద్వారా తేదీ 25, జూలై 2018 మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తి, నివేదిక‌ల త‌యారీ, ప్రాజెక్టు మ‌దింపు జిల్లా స‌ర్వే నివేదిక ఆధారంగా ఉంటుంది. ఈ నివేదిక‌ను ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి న‌వీక‌రించాల్సి ఉంటుంది. అనేక చ‌ర్చ‌లు, లోతైన విశ్లేష‌ణ త‌ర్వాత మంత్రిత్వ శాఖ ఈ నిబంధ‌న‌ల‌ను నిర్దేశించింది. ఈ విధానాలు ఉప ఖ‌నిజాల(మైన‌ర్ మినెర‌ల్స్‌) త‌వ్వ‌కాల‌కు సంబంధించి శాస్త్రీయ‌, క్ర‌మ‌బ‌ద్ధ‌మైన‌, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ప‌ద్ధ‌తుల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి.

ఏరియ‌ల్ స‌ర్వే చేయ‌డం, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ అప్లికేష‌న్ల వినియోగం వంటి వాటిని “సుస్థిర ఇసుక తవ్వ‌కాల మార్గ‌ద‌ర్శ‌కాలు - 2016”, “ఇసుక త‌వ్వ‌కాల అదుపు, ప‌ర్య‌వేక్ష‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు - 2020”లో పొందుప‌ర్చ‌డం జ‌రిగింది. దేశంలో అక్ర‌మ మైనింగ్ చ‌ర్య‌ల‌ను నిర్మూలించ‌డానికి గానూ అంత‌రిక్ష సాంకేతిక‌త‌ను వినియోగించేందుకు గాంధీన‌గ‌ర్‌లోని భాస్క‌రాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ స్పేస్ అప్లికేష‌న్స్ ఆండ్ జియో-ఇన్‌ఫార్మెటిక్స్‌(బీఐఎస్ఏజీ), ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌(ఎంఈఐటీవై) భాగ‌స్వామ్యంతో ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్ ద్వారా గ‌నుల నిఘా వ్య‌వ‌స్థ‌(ఎంఎస్ఎస్‌)ను గ‌నుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది.

ఈ స‌మాచారాన్ని ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ, వాతావ‌ర‌ణ మార్పు మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి శ్రీ కీర్తి వ‌ర్ధ‌న్ సింగ్ రాజ్య‌స‌భ‌లో గురువారం(08.08.2024)  లిఖిత‌పూర్వ‌కంగా తెలియ‌జేశారు.

***


(Release ID: 2043552)