నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ముంబాయి జవహర్‌లాల్ నెహ్రూ ఓడరేవులో ఏర్పాటు కానున్న భారతదేశపు మొదటి సమీకృత వ్యవసాయ-ఎగుమతుల కేంద్రం


అగ్రి లాజిస్టిక్స్‌లో విప్లవాత్మక మార్పులు, వ్యర్థాల తగ్గింపు కోసం రూ.284.19 కోట్ల పి.పి.పి. ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన శ్రీ సర్బానంద సోనోవాల్

లాజిస్టిక్స్‌లో లోటుపాట్లను సరిదిద్ది, బహుళ నిర్వహణలను తగ్గించి, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కాలాన్ని పెంచనున్న కేంద్రం

రైతుల కోసం సాధికారత కల్పించి, ఉద్యోగ అవకాశాలను పెంచి, ఎగుమతి సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకే ఈ కొత్త కేంద్రం

ఇది మన రైతులకు సాధికారత కల్పించడం, భారతదేశ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఒక గొప్ప ముందడుగు: శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 26 JUL 2024 10:57AM by PIB Hyderabad

భారతదేశ వ్యవసాయ ఎగుమతి, దిగుమతుల సామర్థ్యాలను పెంపొందించే ఒక ముఖ్యమైన చర్యలోకేంద్ర ఓడరేవులునౌకాయాన మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ జె.ఎన్.పి.ఎ వద్ద ఎగుమతి-దిగుమతుల అభివృద్ధి, దేశీయ వ్యవసాయ సంబంధ సరుకుల-ఆధారిత ప్రాసెసింగ్ నిల్వ కేంద్రాన్ని పి.పి.పి. విధానంలో ఏర్పాటు కానున్న రూ. 284.19 కోట్ల జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జె.ఎన్.పి.ఎప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు.

జె.ఎన్.పి.ఎ. ఓడరేవు ఆవరణలో 67,422 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అన్ని వసతులతో కూడిన అత్యాధునిక వ్యవసాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ అత్యాధునిక వసతులు గల కేంద్రం లాజిస్టిక్స్‌లో లోటుపాట్లను సరిదిద్దుతుంది, బహుళ నిర్వహణలను తగ్గిస్తుంది, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కాలాన్ని పెంచుతుంది. వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధర, ఉద్యోగాల కల్పన, దీనివల్ల మొత్తంగా వ్యవసాయ రంగ అభివృద్ధి వంటి ప్రయోజనాలు కలుగుతాయని అంచనా. ఇది రైతులు, ఎగుమతిదారులకు సాధికారత కల్పిస్తూ, డిమాండ్‌ను పెంచుతుంది అలాగే గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో, వ్యవసాయ ఎగుమతి సామర్థ్యాలను పెంచడమే కాకుండా రైతులు, గ్రామీణులకు అండగా ఉండే సరైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఓడరేవులు, నౌకాయాన మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎమ్.వో.పి.ఎస్.డబ్ల్యూ) కట్టుబడి ఉంది. జె.ఎన్.పి.ఎ.లో ఏర్పాటు చేయనున్న ఈ ఆల్-ఇన్-వన్ వ్యవసాయ కేంద్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా లాజిస్టిక్స్‌ను క్రమబద్ధీకరించడం, వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలను అందించడం సులభం అవుతుంది. ఇది మన రైతులకు సాధికారత కల్పించడం, భారతదేశ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఒక గొప్ప ముందడుగు" అని ఓడరేవులు, నౌకాయాన మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సోనోవాల్ అన్నారు.

 

బాస్మతియేతర బియ్యం, మొక్కజొన్న, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, గోధుమలు వంటి ప్రధాన సరుకుల ఎగుమతుల కోసం ఈ కేంద్రం సేవలను అందిస్తుంది. జె.ఎన్.పి.ఎ. ఫ్రోజెన్ మాంస ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులకు ప్రధాన ముఖద్వారంగా ఉన్నందున ముంబాయికి దూరంగా ఉన్న ప్రాంతాల మాంసం, సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులకు కూడా ఈ కేంద్రం సౌకర్యంగా ఉంటుంది. చిన్న ఎగుమతిదారులు రేవులోనే ఉన్న ఈ కేంద్రం నుండి ప్రయోజనం పొందడం ద్వారా వారి లాజిస్టిక్స్, కంటైనర్ బుకింగ్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్, ఎగుమతి కార్యకలాపాల సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటారు. అంచనా ఎగుమతి సామర్థ్యం ఫ్రోజెన్ స్టోర్ కోసం 1800 మెట్రిక్ టన్నులు, కోల్డ్ స్టోర్ కోసం 5800 మెట్రిక్ టన్నులు, ధాన్యాలు, తృణధాన్యాలు మరియు పొడి సరుకుల కోసం గల పొడి వస్తువుల గిడ్డంగుల ఎగుమతులు 12,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరగనున్నాయి.

ఈ కార్యక్రమం రైతులకు సాధికారత కల్పించడం, గ్రామీణాభివృద్ధిని పెంపొందించాలనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా భారతదేశ వ్యవసాయ సామర్థ్యాలకు ఊతమిస్తూ వాటిని పెంపొందించే లక్ష్యంతో భవిష్యత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, మహారాష్ట్రలోని జె.ఎన్.పి.ఎ. 100 శాతం ల్యాండ్‌లార్డ్ పోర్ట్ కలిగి, అన్ని బెర్త్‌ల కోసం పి.పి.పి మోడల్‌ నిర్వహణ కలిగిన దేశంలోని మొదటి ప్రధాన ఓడరేవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 ప్రధాన కంటేనర్ ఓడరేవుల్లో జె.ఎన్.పి.ఎ. ఒకటి (లాయిడ్స్ జాబితాలోని 100 ప్రధాన ఓడరేవుల నివేదిక ప్రకారం).

మహారాష్ట్రలో, ఎమ్.వో.పి.ఎస్.డబ్ల్యూ రూ.76,220 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఓడరేవులలో ఒకటైన వధావన్ పోర్ట్‌ను అభివృద్ధి చేస్తున్నది. పాల్ఘర్ జిల్లా వధావన్‌లో ఆల్-వెదర్ గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్‌గా అభివృద్ధి చేయబడుతుంది. ఇందులో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పి.పి.పి) విధానంలో కీలక మౌలిక సదుపాయాలు, టెర్మినల్స్, ఇతర వాణిజ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగనుంది. ప్రతిపాదిత వధావన్ నౌకాశ్రయం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం, ఇది 23 మిలియన్ టి.ఇ.యు.లు లేదా 254 మిలియన్ టన్నుల వార్షిక కార్గోను నిర్వహించడానికి రూపొందించబడింది, 20,000 టి.ఇ.యు.ల వరకు పెద్ద కంటేనర్ వెజెల్స్ నిలిపేందుకు 20 మీటర్ల సహజ డ్రాఫ్ట్‌ను ఇది కలిగి ఉంది. దీని నిర్మాణం పూర్తవగానే, ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే 10 అతిపెద్ద ఓడరేవులలో ఒకటిగా నిలుస్తుంది, ప్రధాన హరిత ఇంధన కేంద్రంగా పనిచేస్తుంది.

మహారాష్ట్రలో ఈరోజు వరకు సాగర్‌మాల ద్వారా రూ.230 కోట్ల ఆర్థిక సాయంతో ఇప్పటికే రూ. 790 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులను పూర్తయ్యాయి. ప్రస్తుతం అదే పథకం ద్వారా పొందిన రూ.561 కోట్ల సాయంతో రూ. 1,115 కోట్ల విలువ గల 14 అదనపు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి.

 

***



(Release ID: 2037500) Visitor Counter : 17