బొగ్గు మంత్రిత్వ శాఖ

తెలంగాణ ఇంధన భద్రత అవసరాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


ఎస్సీసీఎల్ కు 643 హెక్టార్ల అటవీ భూమి కేటాయింపు 

త్వరలో నైని బొగ్గు గని నుంచి ఉత్పత్తి ప్రారంభం

Posted On: 05 JUL 2024 8:27PM by PIB Hyderabad

 


ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఒడిశాలోని నైని బొగ్గు గనిని ఎస్సీసీఎల్ థర్మల్ పవర్ ప్లాంట్ లో క్యాప్టివ్ వినియోగం కోసం 13.08.2015న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు కేటాయించారు.  అక్టోబర్ 2022 లో  స్టేజ్-2 అటవీ అనుమతులు పొందిన తర్వాత అటవీ భూమిని అప్పగించడంలో జరిగిన అసాధారణ జాప్యం వల్ల ఈ గనిలో పనులు ప్రారంభం కాలేదు. . 


కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీ జి.కిషన్ రెడ్డి నైని బ్లాక్‌కు సంబంధించి ఒడిశా ప్రభుత్వంతో  నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు . ఈ నేపథ్యంలో నైని బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన అవసరం, సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఫలితంగా 643 హెక్టార్ల అటవీ భూమిని ఎస్సీసీఎల్ కు అప్పగించేందుకు 04.07.2024న ఆమోదం లభించింది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాంఝీకి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


త్వరలోనే ఈ గని నుంచి ఎస్సీసీఎల్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ చర్య తెలంగాణ ఇంధన భద్రత అవసరాలను మరింత బలోపేతం చేస్తుంది మరియు భద్రపరుస్తుంది.



(Release ID: 2031163) Visitor Counter : 23


Read this release in: English