ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

తిరువనంతపురం సి-డాక్ లో భారతదేశంలోనే తొలి ఫ్యూచర్ లాబ్స్ సెంటర్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్



‘‘ఫ్యూచర్ లాబ్స్ తదుపరి తరం చిప్ డిజైన్, తయారీ, పరిశోధనకు అనువైన వాతావరణం రూపొందడానికి దోహదపడుతుంది గనుక తిరువనంతపురం భారతదేశానికి రెండో ఇన్నోవేషన్ హబ్ అవుతుంది’’ : కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

‘‘తిరువనంతపురంలో ఫ్యూచర్ లాబ్స్ కొత్త తరం స్టార్టప్ లు, ఎలక్ర్టానిక్ వ్యవస్థలు, ఇన్నోవేషన్ కు బాటలు వేస్తుంది’’ : కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 12 MAR 2024 8:02PM by PIB Hyderabad

కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటి, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, జలశక్తి శాఖల సహాయమంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ నేడు తిరువనంతపురం సి-డాక్  కేంద్రంలో భారతదేశంలోనే తొలి ఫ్యూచర్ లాబ్స్  కేంద్రాన్ని ప్రారంభించారు. ‘‘సెంటర్ ఫర్ సెమీ కండక్టర్ చిప్స్ అండ్ సిస్టమ్స్ ఫర్ స్ర్టాటజిక్ ఎలక్ర్టానిక్స్’’గా నామకరణం చేసిన ఈ కేంద్రం కొత్త తరం చిప్  డిజైన్, తయారీ, పరిశోధనకు అనువైన వాతావరణ కల్పనకు సహాయపడుతుంది.

ఈ సందర్భంగా విద్యుత్  లోకోమోటివ్ టెక్నాలజీల అభివృద్ధికి రైల్వే మంత్రిత్వ శాఖ, సి-డాక్ (టి) మధ్య సహకారంతో పాటు పలు ప్రకటనలు వెలువడ్డాయి. మైక్రోగ్రిడ్ టెక్నాలజీల అభివృద్ధి, అమలు కోసం సి-డాక్ (టి), టాటా పవర్ మధ్య ఒక ఎంఓయుపై సంతకాలు జరిగాయి.  సి-డాక్ (టి), నాగపూర్ కి చెందిన విఎన్ఐటి విద్యుత్ వాహనాల కోసం ఉమ్మడిగా  రూపొందించిన వైర్ లెస్ చార్జర్ టెక్నాలజీని బెల్ రైజ్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ కు బదిలీ చేయనున్నట్టు కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక పరిశ్రమ భాగస్వాములతో కలిసి మంత్రి 100 మంది పైగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఈ కేంద్రం వారికి ఎన్నో అవకాశాలు అందుబాటులోకి తెస్తుందన్నారు.

‘‘చంద్రయాన్-3లో ఎంత సిలికాన్ ఉపయోగించింది, ఐఎన్ఎస్ విక్రాంత్ లో ఎంత భారీగా ఎలక్ర్టానిక్స్ ఉపయోగించింది మీరు చూశారు. ఈ రెండింటికీ కేరళలోనే లోతైన మూలాలున్నాయి. పరిశ్రమలు, విద్యార్థులు, స్టార్టప్ లు, విద్యారంగంతో ఒక ప్రభుత్వ వ్యవస్థగా సి-డాక్ భాగస్వామ్య ధోరణిలో పని చేసింది. ప్రభుత్వం, పరిశ్రమల రెండింటి విజన్ ఒక్కటే. నేడు ప్రపంచంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోంది, ప్రపంచంలో డిజిటల్ ఎకానమీలు అసాధారణ వేగంతో విస్తరిస్తున్నాయి. మూడు రంగాల్లో-ఎఐ, సెమీ కండక్టర్లు, ఫ్యూచర్ ఆఫ్ ఎలక్ర్టానిక్స్ లో స్టార్టప్ లు, విద్యార్థులకు అపార అవకాశాలున్నాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈ తరహా లాబ్ లు ఏర్పాటు చేయడంలో భాగస్వామిగా వ్యవహరించడానికి సి-డాక్ సిద్ధంగా ఉంది. ఈ చొరవ తిరువనంతపురంను భారతదేశానికి తదుపరి ఇన్నోవేషన్ హబ్ గా మార్చుతుంది’’ అని శ్రీ రాజీవ్  చంద్రశేఖర్ అన్నారు. 

ఇలాంటి సహకార భాగస్వామ్యాలు, చొరవల అవసరం మరింతగా ఉందని మంత్రి వివరిస్తూ ‘‘సెమీ కండక్టర్ల విభాగంలో భారతదేశం ఎన్నో అడుగులు ముందుకేసింది. సుమారు 75 సంవత్సరాలుగా మన దేశంలో సెమీ కండక్టర్ల వ్యవస్థ అనేదే లేకుండా పోయింది. కాని గత కొద్ది సంవత్సరాల కాలంలో ఈ విభాగంలో మనం 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అందుకున్నాం. నేడు మనం ఫ్యాబ్ ల తయారీ, ఇన్నోవేషన్, ప్యాకేజింగ్, నైపుణ్యాలు, పరిశోధనకు అనువైన వాతావరణం తయారుచేసుకున్నాం. స్వభావసిద్ధంగా డిజిటల్ కాని విభాగాలతో సహా విభిన్న రంగాల్లో డిజిటలైజేషన్, డిజిటల్ టెక్నాలజీలు కనివిని ఎరుగని వేగంతో విస్తరిస్తున్నాయి. టెక్నాలజీ తన అస్తిత్వం ప్రకటించుకుంటోంది. ఆ రకంగా ఒక ట్రెండ్  గా డిజిటైజేషన్ పెరుగుతోంది. రెండో ట్రెండ్ సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ. రాబోయే సంవత్సరాల్లో టెక్నాలజీ విభాగాన్ని తీర్చిదిద్దేవి ఈ రెండే. మూడో ముఖ్యమైన విభాగం మరొకటి ఉంది. నేడు మీరు ఉపయోగిస్తున్న లాప్ టాప్ కావచ్చు లేదా డెస్క్ టాప్, సర్వర్, కంప్యూట్ ఆటోమోటివ్, రైల్వే అన్నీ తుక్కు స్థాయి నుంచి రీ డిజైన్, రీ ఆర్కిటెక్ట్  కాబోతున్నాయి. ఈ రీ డిజైన్, రీ ఆర్కిటెక్ట్  విభాగాల్లో ఎన్నో అవకాశాలున్నాయి. నేను దీన్ని స్టార్టప్  లు, సిస్టమ్ లు, ఇన్నోవేషన్ ల  తదుపరి అలగా అభివర్ణిస్తాను. ఫ్యూచర్ లాబ్స్ అంటే వీటన్నింటి కలయికే’’ అన్నారు.  

సి-డాక్ తో తమ భాగస్వామ్యం సత్ఫలితాలనిచ్చిందని, కేరళ టెక్  ఇన్నోవేషన్ వ్యవస్థను విస్తరించడానికి తమ మద్దతు కొనసాగిస్తామని ఈ సమావేశానికి హాజరైన పారిశ్రామిక భాగస్వాములు నొక్కి చెప్పారు. 

‘‘మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ బలమైన నాయకత్వం, నిరంతర మద్దతు కారణంగానే మేము పరిధిని విస్తరించి, అద్భుతంగా పని చేయగలిగాం. ఈ కార్యక్రమాల ద్వారా ఇలాంటివి మరిన్ని భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు మేం ఎదురు చూస్తున్నాం’’ అని కల్యాణి పవర్ ట్రెయిన్ లిమిటెడ్ విపి ఇ మొబిలిటీ శ్రీ అతుల్ దేశ్  ముఖ్ అన్నారు. 

‘‘టాటా పవర్, సి-డాక్ సహకార భాగస్వామ్యం చారిత్రక క్షణం. ఒక సంస్థగా మేం ఇటీవల ఉత్తరప్రదేశ్, బిహార్ లలో 200 గ్రామాలను సాధికారం చేస్తున్న బ్యాటరీ టెక్నాలజీతో సౌరశక్తి ఆధారంగా పని చేసే మైక్రో గ్రిడ్ లు ఏర్పాటు చేశాం. కేరళలో కూడా మేం అదే కృషి కొనసాగిస్తాం. ఈ సహకార భాగస్వామ్యం ద్వారా మైక్రో గ్రిడ్ ల శక్తిని మేం పూర్తిగా వినియోగంలోకి తీసుకురాగలుగుతాం’’ అని టిపి రెన్యువబుల్ మైక్రోగ్రిడ్ లిమిటెడ్ సిఇఓ శ్రీ మనోజ్ గుప్తా అన్నారు. 

‘‘డిజిటల్ ఇండియా, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లకు మంత్రి  అందించిన అద్భుతమైన మద్దతు, కృషి ఎన్నో కంపెనీల నైతికతను ఉత్తేజితం చేసి స్వయం-సమృద్ధి, టెక్నాలజీ దిశగా అడుగులు వేయించింది. సి-డాక్, భారతీయ రైల్వేలతో కలిసి జెఎంవి అద్భుతమైన మైలురాళ్లు సాధించింది. మూడు విభాగాలు గల దేశీయ లోకోమోటివ్ ప్రొపల్షన్ సిస్టమ్ ను  తయారుచేసింది. దేశీయంగా తయారైన లోకోమోటివ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇన్నోవేషన్ పట్ల మా కట్టుబాటును ప్రదర్శించడమే కాదు, రైల్వే ప్రొపల్షన్  సిస్టమ్స్  విభాగంలో భారతదేశాన్ని అంతర్జాతీయ శక్తిగా నిలుపుతుంది.  దీనికి తోడు దేశీయంగానే డిజైన్ చేసి, అభివృద్ధి చేసి, తయారుచేసిన ఎఐ ఆధారిత ప్రెడిక్టివ్  మెయింటెనెన్స్ వ్యవస్థతో రైల్వే మెయింటెనెన్స్, ఆపరేషన్స్ కార్యకలాపాల ఆధునికీకరణకు కూడా మేం దోహదపడనున్నాం’’ అని జెఎంవి ఎల్ పిఎస్ లిమిటెడ్  డైరెక్టర్  శ్రీమతి మీనాక్షి సింగ్ అన్నారు. 

***
 



(Release ID: 2014322) Visitor Counter : 107


Read this release in: English , Urdu , Hindi