పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

ఓఖ్లా పక్షుల అభయారణ్యంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నిర్వహణ

Posted On: 03 MAR 2024 8:22PM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌ ఈఐఏసీపీ పీసీ-ఆర్‌పీ, ఈ రోజు, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2024ను, వివిధ కార్యక్రమాలను ఓఖ్లా పక్షుల అభయారణ్యంలో నిర్వహించింది. 'మిషన్ లైఫ్‌'ను ప్రోత్సహించే గొప్ప జీవవైవిధ్యం కల ప్రదేశాల్లో ఓఖ్లా పక్షుల అభయారణ్యం ఒకటి. మన సాటి ప్రాణులైన వన్యప్రాణులు, మొక్కలను, మానవాళికి వాటి సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 

ఈ సంవత్సరం నేపథ్యాంశం 'కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్: ఎక్స్‌ప్లోరింగ్‌ డిజిటల్ ఇన్నోవేషన్‌ ఇన్‌ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్‌'. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2024 అనేది డిజిటల్ వన్యప్రాణి సంరక్షణలో అనుభవాల మార్పిడి, యువత సాధికారత కోసం సృష్టించిన ఒక వేదిక. డిజిటల్ వన్యప్రాణి సంరక్షణలో మానవ భాగస్వామ్యంపై రాబోయే అవకాశాలపై కళ, ప్రదర్శనలు, సంభాషణల ద్వారా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఏ డిజిటల్ ఆవిష్కరణలు అందుబాటులో ఉన్నాయి, మనం ఎలాంటి అవరోధాలను ఎదుర్కొంటున్నాం, ప్రజల మధ్య & భూగ్రహం మొత్తంలో డిజిటల్ అనుసంధానత ఎలా అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటున్నాం అనే విషయాలపై ఈ రోజు జరిగిన కార్యక్రమాలు ఒక అవగాహన కల్పించాయి. న్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన సమాచారం, ట్రాకింగ్, డీఎన్‌ఏ విశ్లేషణ, ఇంకా అనేక అంశాలను సాంకేతిక ఆవిష్కరణల పరిశోధనలు సరళంగా, మరింత సమర్థవంతంగా మార్చాయి, ఖచ్చితత్వం తెచ్చాయి. మెరుగైన అనుసంధానత, ఇంటర్నెట్ సదుపాయం మన ప్రపంచ జనాభాలో 66 శాతానికి చేరుకోవడంతో ‘డిజిటల్ అంతరం’ నెమ్మదిగా తగ్గుతోంది.

ఓఖ్లా పక్షుల అభయారణ్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులతో కూడిన యువశక్తి, ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ ప్రాంతీయ అటవీ అధికారి  శ్రీ ప్రమోద్ కుమార్, గౌరవ అతిథిగా ఓఖ్లా పక్షుల అభయారణ్యం రేంజ్ అటవీ అధికారి శ్రీ అమిత్ గుప్తా పాల్గొన్నారు. వన్యప్రాణులకు సంబంధించిన పలు అంశాలపై ఈ అధికార్లు ఉపన్యాసాలు ఇచ్చి, యువతలో ఉత్సాహం నింపారు. డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌ ఈఐఏసీపీ పీసీ-ఆర్‌పీ ఇండియా సమన్వయకర్త డా. జి ఆరీంద్రన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, వివిధ అంశాలపై తన అనుభవాలను పంచుకున్నారు. డబ్ల్యుడబ్ల్యుడీ2024 నేపథ్యాంశంపై ఎకో ట్రైల్, పోస్టర్ తయారీ, చేతులపై, ముఖంపై చిత్రలేఖనం వంటివి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది పాల్గొన్నారు.

***



(Release ID: 2011448) Visitor Counter : 269


Read this release in: English , Urdu , Hindi