వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం కాన్ఫో నెట్ సాఫ్ట్ వేర్ స్థానంలో అభివృద్ధి చేసిన ఆధునిక ఈ-జాగృతి పోర్టల్ పై ఒక రోజు సామర్థ్య నిర్మాణ వర్క్ షాప్


ఈ-జాగృతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం వల్ల వినియోగదారుల కమిషన్ లో పెండింగ్ లో ఉన్న వినియోగదారుల కేసుల సంఖ్య తగ్గుతుంది... కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి

Posted On: 13 FEB 2024 5:13PM by PIB Hyderabad

తక్కువ ఖర్చుతో వేగంగా వినియోగదారుల ఫిర్యాదులను  సులభంగా పరిష్కరించేందుకు కేంద్ర  వినియోగదారుల వ్యవహారాల శాఖ కాన్ ఫోనెట్ సాఫ్ట్ వేర్ ను 'ఈ-జాగృతి' పోర్టల్ గా ఆధునీకరించింది. కీ 'ఈ-జాగృతి' విశేషాలను తెలియజేసేందుకు ఈ రోజు సామర్థ్య నిర్మాణ  వర్క్ షాప్ ను  కేంద్ర  వినియోగదారుల వ్యవహారాల శాఖ   నిర్వహించింది.

కాన్ఫో నెట్ సాఫ్ట్ వేర్ ను ఆధునీకరించి అభివృద్ధి చేసిన "ఈ-జాగృతి" పోర్టల్ ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ 2023 డిసెంబర్ 24న  ప్రారంభించారు. మూడు అంచెల విధానం లో పనిచేస్తున్న  వినియోగదారుల కమిషన్ల  ఆన్ లైన్ వినియోగదారుల కోర్టు కేసుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం గత 15 సంవత్సరాలుగా కాన్ఫో నెట్ సాఫ్ట్ వేర్  వినియోగిస్తున్నారు. అయితే,, సాంకేతిక పరిజ్ఞాన రంగం సాధించిన  పురోగతి, మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు  మెరుగైన సేవలందించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవస్థను  నవీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించి  ఈ-జాగృతి పోర్టల్ ను అభివృద్ధి చేసింది. 

 ఈ-జాగృతి పోర్టల్ పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్  ఈ-జాగృతిలో కృత్రిమ మేధస్సు ను ఉపయోగిస్తామని వెల్లడించారు. కృత్రిమ మేధస్సు వినియోగం వల్ల   వినియోగదారుల కమిషన్లలో పెండింగ్ లో ఉన్న వినియోగదారుల కేసుల సంఖ్య తగ్గుతుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఈ-జాగృతి ని ఉపయోగించి  పెండింగ్ సమస్యను తగ్గించడానికి సంబంధిత వర్గాలు కృషి చేయాలని కోరారు. దేశంలోని అనేక వినియోగదారుల కమిషన్లలో  నెలవారీ కేసులు 100% పరిష్కార రేటును కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు. కేసులను  పూర్తిగా పరిష్కరించిన  కమిషన్ల అధ్యక్షులు, రిజిస్ట్రార్లను అభినందించారు.

ఈ-జాగృతి పోర్టల్ వల్ల అన్ని స్థాయిలలో వినియోగదారుల వివాదాలను తక్కువ ఖర్చుతో వేగంగా, సమర్ధంగా పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. . ఆన్లైన్ కేస్ మానిటరింగ్ సిస్టమ్ (ఓసీఎంఎస్), ఈ-డాఖిల్, ఎన్సీడీ ఆర్సీ కేస్ మానిటరింగ్ సిస్టమ్, కాన్ఫో నెట్ వెబ్ సైట్ , మీడియేషన్ అప్లికేషన్ వంటి అన్ని సౌకర్యాలు ఏకగవాక్ష విధానంలో  ఈ-జాగృతి పోర్టల్ అందిస్తుంది. 
కేసుల నమోదు, ఆన్ లైన్ లో  ఫీజు చెల్లింపు, అన్ని కమిషన్లలో విచారణలో ఉన్న   కేసులను సమీక్షించడానికి ఈ-జాగృతి పోర్టల్ లో   కేస్ మానిటరింగ్ మాడ్యూల్ సౌకర్యాన్ని కల్పించారు.  మెటాడేటా, కీ వర్డ్ రూపొందించడానికి  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తారు.పెండింగ్ లో ఉన్న  వినియోగదారుల ఫిర్యాదులు / కేసులు / తీర్పులపై స్మార్ట్ సెర్చ్ సదుపాయం కల్పించారు. తీర్పులు, కేసు చరిత్ర , ఇతర వివరాలను   ఏఐ / ఎంఎల్ టెక్నాలజీ  వాయిస్-టు-టెక్స్ట్ గా మార్పిడి చేస్తుంది. వినియోగదారుల ఫిర్యాదులను సులభంగా, తక్కువ సమయంలో తగ్గించడానికి ఈ-జాగృతి పోర్టల్  బహుళ విచారణలు , భౌతిక కోర్టు హాజరుల కోసం  వర్చువల్ కోర్టు సౌకర్యాన్ని ఏకీకృతం చేస్తుంది. దీనివల్ల కేసుల విషయంలో అన్ని  వినియోగదారుల కమిషన్లు  సమర్థవంతమైన, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. 

ఈ వర్క్ షాప్ లో వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి భరత్ ఖేరాతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

ఎన్సీడీ ఆర్సీ, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ల రిజిస్ట్రార్లు, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ జిల్లాల వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ల అధ్యక్షులు, అన్ని రాష్ట్రాల వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ల టెక్నికల్ సపోర్ట్ పర్సన్లకు వర్క్ షాప్ లో  పోర్టల్ లోని వివిధ మాడ్యూల్స్, కీలక సాంకేతిక అంశాల గురించి వివరించారు.

***



(Release ID: 2005744) Visitor Counter : 78


Read this release in: Marathi , English , Urdu , Hindi