పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

మార్చి నుంచి దిల్లీ & ముంబై నుంచి జబల్‌పూర్‌కు విమాన సర్వీసులు


జబల్‌పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనం నిర్మాణానికి సర్వం సిద్ధం

Posted On: 06 FEB 2024 3:45PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లో విమానయాన సేవలు మరింత విస్తరించనున్నాయి. దిల్లీ నుంచి జబల్‌పూర్‌కు, ముంబై నుంచి జబల్‌పూర్‌కు నేరుగా విమాన సర్వీసులు వచ్చే నెల నుంచి పునఃప్రారంభం అవుతాయి. ఈ విమాన సర్వీసులను స్పైస్‌జెట్ ప్రారంభిస్తుంది.

దిల్లీ నుంచి జబల్‌పూర్‌కు నేరుగా విమానం మార్చి 01 నుంచి ప్రారంభమవుతుంది, వారానికి రెండు రోజులు నడుస్తుంది. ముంబై-జబల్‌పూర్ మధ్య విమాన సర్వీసు మార్చి 02 నుంచి ప్రారంభమవుతుంది.

"స్పైస్‌జెట్ ద్వారా, ముంబై & దిల్లీతో జబల్‌పూర్‌కు అదనపు అనుసంధానం పొందడంపై నేను సంతోషిస్తున్నా" అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.

“ఈ సర్వీసుల వల్ల జబల్‌పూర్ ప్రజలకు సౌలభ్యం పెరగడం, సమయం ఆదా కావడం మాత్రమే కాదు; వ్యాపారం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జబల్‌పూర్ విమానాశ్రయంలో రూ. 412 కోట్ల వ్యయంతో కొత్త టెర్మినల్ భవనం నిర్మాణానికి సర్వం సిద్ధంగా ఉంది. విమాన ప్రయాణానికి, ఆర్థిక వృద్ధికి ఇది కొత్త శక్తిని ఇస్తుంది” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

***



(Release ID: 2003362) Visitor Counter : 50


Read this release in: Tamil , English , Urdu , Hindi