మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి సాగర్ పరిక్రమ పదో దశకు సారథ్యం వహించిన కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా


పీఎంఎంఎస్‌వై కింద పడవలు, ఐస్ బాక్స్‌తో కూడిన ద్విచక్ర వాహనాలు లబ్ధిదార్లకు పంపిణీ, కొత్తగా నియమితులైన సాగర్ మిత్రలకు నియామక పత్రాలు అందజేత

మత్స్యకారులు, ఆక్వా రైతులు, పీఎంఎంఎస్‌వై లబ్ధిదార్లతో సంభాషించిన కేంద్ర మంత్రి

Posted On: 01 JAN 2024 7:33PM by PIB Hyderabad

నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి ప్రారంభమైన సాగర్‌ పరిక్రమ పదో దశకు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా సారథ్యం వహించారు. ఇతర కోస్తా జిల్లాలైన బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, యానాం మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది.

సాగర్ పరిక్రమ పదో దశలో కేంద్ర మత్స్య విభాగం, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ, పుదుచ్చేరి ప్రభుత్వం, భారతీయ తీర రక్షణ దళం, మత్స్యకారుల ప్రతినిధులు పాల్గొన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద శ్రీ పర్షోత్తం రూపాలాకు ఘన స్వాగతంతో పరిక్రమ యాత్ర ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యుడు శ్రీ బీద మస్తాన్‌రావు, శాసనసభ సభ్యుడు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ శ్రీ కె కన్నబాబు, ఎస్‌పీఆర్‌ఎస్‌ నెల్లూరు సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్ కూర్మనాథ్, ఫిషర్‌మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్‌కు చెందిన శ్రీ కొండూరు అనిల్ బాబు, భారతీయ తీర రక్షణ దళం కమాండెంట్ శ్రీ మణి కుమార్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారులు, ఆక్వా రైతులు, పీఎంఎంఎస్‌వై లబ్ధిదార్లతో శ్రీ పర్షోత్తం రూపాలా సంభాషించారు. పీఎంఎంఎస్‌వై పథకం కింద పడవలు, ఐస్ బాక్స్‌లతో కూడిన ద్విచక్ర వాహనాలు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను లబ్ధిదార్లకు పంపిణీ చేశారు. పీఎంఎంఎస్‌వై కింద కొత్తగా నియమితులైన సాగర్ మిత్రలకు నియామక పత్రాలు అందించారు. మత్స్యకార్లు తమ క్షేత్రస్థాయి పంచుకున్నారు, సమస్యలను ప్రస్తావించారు. కేసీసీ, పీఎంఎంఎస్‌వై పథకాల వల్ల తమకు కలిగిన ప్రయోజనాలను వివరించారు. నీలి విప్లవం పథకం కింద రూ.288.80 కోట్లతో ఆమోదించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

మత్స్య విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ నీతు కుమారి ప్రసాద్, సాగర్ పరిక్రమ కార్యక్రమం గురించి వివరించారు. మత్స్యకార్ల ఇంటి వద్దకే వెళ్లి మాట్లాడడం, వారి ఇబ్బందులను వినడం, గ్రామస్థాయిలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం, స్థిరమైన చేపల వేటను ప్రోత్సహించడం, ప్రభుత్వ ఉత్తమ పద్ధతులు & కార్యక్రమాలు లబ్ధిదార్లకు చేరేలా చూడటం సాగర్ పరిక్రమ లక్ష్యం అని చెప్పారు.

ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో కొనసాగుతుంది. అక్కడ కూడా లబ్ధిదార్లతో కేంద్ర మంత్రి సంభాషిస్తారు, పథకం లబ్ధిని పంపిణీ చేస్తారు. సాగర్ పరిక్రమ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది, మరిన్ని జీవనోపాధి అవకాశాలు సృష్టిస్తుంది. దీనివల్ల, సాగర్ పరిక్రమ ప్రభావం తదుపరి దశల్లో మత్స్యకార్ల జీవనోపాధిపై చాలా ఉంటుంది. దాదాపు 3,000 మంది మత్స్యకార్లు, వివిధ మత్స్యకార వాటాదార్లు, పరిశోధకులు వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సాగర్ పరిక్రమ కార్యక్రమం మత్స్యకార సమాజం, తీరప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. మత్స్యకార్లు, ఇతర వాటాదార్ల సమస్యలను వారి ఇంటి వద్దే పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన చొరవ ఇది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై), కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) వంటి మత్స్యకార పథకాలు, కార్యక్రమాల ద్వారా మత్స్యకార సమాజం సులభంగా ఆర్థికాభివృద్ధి చెందేలా మార్గం సుగమం చేస్తుంది.

***



(Release ID: 1992265) Visitor Counter : 202


Read this release in: English , Urdu , Hindi