వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

'పార్ట్‌నర్‌షిప్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్' & 'ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ' ఇన్వెస్టర్స్‌ ఫోరమ్‌లో పాల్గొన్న శ్రీ పీయూష్ గోయల్


ఐపీఈఎఫ్‌ ప్రతినిధులు, క్వాల్కమ్‌తో సమావేశాలు

ఏపీఈసీ ప్రతినిధులతోనూ అనధికారిక చర్చలు, విందు సమావేశం

Posted On: 17 NOV 2023 2:33PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్, 'ఇన్వెస్టర్ ఫోరమ్ ఆఫ్ ది పార్టనర్‌షిప్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్' (పీజీఐఐ) & 'ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ'లో (ఐపీఈఎఫ్‌) చర్చల్లో పాల్గొన్నారు. యూఎస్‌ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో, యూఎస్‌ అధ్యక్షుడి సీనియర్ సలహాదారు అమోస్ హోచ్‌స్టెయిన్ ఈ ఫోరమ్‌కు సహ-అధ్యక్షత వహించారు. పరస్పర సహకార చర్యలు ప్రధానాంశంగా ఫోరంలో చర్చలు జరిగాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రైవేట్ పెట్టుబడులు పెంచాల్సిన అవసరంపై అభిప్రాయాలు పంచుకున్నారు.

ఫిజీ ప్రధాన మంత్రి సితివేని రబుకా, కొరియా వాణిజ్య మంత్రి డుక్‌గెన్ అహ్న్‌ సహా ఐపీఈఎఫ్‌ భాగస్వామ్య దేశాల మంత్రులు, సీనియర్ అధికార్లు ఈ ఫోరమ్‌కు హాజరయ్యారు. కేకేఆర్‌ జోసెఫ్ బే సహ-సీఈవో సహా కార్పొరేట్ నాయకులు కూడా పాల్గొన్నారు.

ఫోరమ్‌లో ప్రసంగించిన యూఎస్‌ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో, యూఎస్‌ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్‌సీ), ది నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్‌) కలిసి ఏర్పాటు చేసిన హరిత పరివర్తన నిధి ద్వారా భారత్‌-యూఎస్‌ఏ మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సౌర విద్యుత్‌, శక్తి నిల్వ, ఇ-మొబిలిటీలో పెట్టుబడుల ద్వారా భారతదేశంలో వాతావరణ సంబంధిత ప్రయోజనాలను అందించడం, స్వచ్ఛమైన శక్తి పరివర్తన ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ నిధి లక్ష్యం.

పిల్లర్-III (స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థ), పిల్లర్-IV (న్యాయమైన ఆర్థిక వ్యవస్థ)పై చర్చలను విజయవంతంగా ముగించినందుకు ఐపీఈఎఫ్‌ సభ్యులకు మంత్రి పీయూష్‌ గోయల్‌ కృతజ్ఞతలు తెలిపారు. వ్యాపార నియంత్రణ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం సులభతర వ్యాపారం, స్థిరమైన వృద్ధి, అభివృద్ధి అంశాల్లో భారతదేశ నిబద్ధతను స్పష్టం చేశారు.

ఆ తర్వాత, ఏపీఈసీ ప్రతినిధుల అనధికార చర్చల్లోనూ భారత మంత్రి పాల్గొన్నారు. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యమైన 175 గిగావాట్లను, నిర్ధేశిత కాలం కంటే తొమ్మిదేళ్ల ముందుగానే విజయవంతంగా సాధించడంలో భారతదేశ సామర్థ్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. సుస్థిరత అనేది సుదూర ఆకాంక్షలా కాకుండా జీవన విధానంగా మారే, వాతావరణ చర్యలు భారంలా కాకుండా ఆవిష్కరణ & అభివృద్ధికి అవకాశంగా మారే భవిష్యత్తును నిర్మించేందుకు ప్రపంచ నాయకులు చేతులు కలపాలని శ్రీ పీయూష్‌ గోయల్‌ పిలుపునిచ్చారు.

ఐపీఈఎఫ్‌ ప్రతినిధులతోనూ మంత్రి చర్చా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సహా పలువురు ప్రపంచ నాయకులు ఈ సమావేశానికి హాజర్యయారు. కీలక ఖనిజ చర్చలు, పెట్టుబడులకు ప్రోత్సాహం, ఉత్ప్రేరక నిధి, పెట్టుబడిదార్ల ఫోరం, ఐపీఈఎఫ్‌ నెట్‌వర్కులు వంటి ఐపీఈఎఫ్‌ కార్యక్రమాలను సమావేశంలో ప్రకటించారు.

పీజీఐఐ ఇన్వెస్టర్ల ఫోరంతో పాటు, ఒక రోజు సమయంలోనే ఏపీఈసీ నాయకులతో విందు సమావేశం, ఐపీఈఎఫ్‌ ప్రతినిధులతో సమావేశాల సహా ప్రపంచ నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలతో ద్వైపాక్షిక, ముఖాముఖి సమావేశాల్లో శ్రీ పీయూష్‌ గోయల్‌ పాల్గొన్నారు. పెరు విదేశీ వాణిజ్యం & పర్యాటక మంత్రి జువాన్ కార్లోస్ మాథ్యూస్‌తో సమావేశమైన శ్రీ పీయూష్‌ గోయల్‌, ద్వైపాక్షిక వాణిజ్యం & పెట్టుబడి సంబంధాలను పెంచుకునే మార్గాలపై చర్చించారు, ద్వైపాక్షిక ఎఫ్‌టీఏ చర్చల పురోగతిని సమీక్షించారు, వేగంగా ముగించాలని సూచించారు. క్వాల్కమ్‌ టెక్నాలజీ లైసెన్సింగ్ & గ్లోబల్ అఫైర్స్ అధ్యక్షుడు అలెక్స్ రోజర్స్‌తో ముఖాముఖిలోనూ మంత్రి పాల్గొన్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ల వ్యవస్థ, క్వాల్కమ్‌ వంటి సంస్థలకు ఉన్న బలమైన ఆవిష్కరణ అవకాశాలు, ప్రభుత్వ సహకారంపై విస్తృతంగా చర్చించారు.

 

****



(Release ID: 1977777) Visitor Counter : 41