నీతి ఆయోగ్

జీ 20 ఫీడర్ థీమ్ వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న నీతి ఆయోగ్


జీ-20 నేతల డిక్లరేషన్ అమలు జరిగేలా చూసేందుకు ప్రణాళిక సిద్ధం చేయడానికి వర్క్‌షాప్‌ల నిర్వహణ
డిక్లరేషన్ అమలులో ఎదురయ్యే చిక్కులు, అమలుపై విస్తృతంగా చర్చించనున్న వర్క్‌షాప్‌లు

Posted On: 31 OCT 2023 4:19PM by PIB Hyderabad

న్యూఢిల్లీ లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో వివిధ అంశాలపై  జీ-20 దేశాల నాయకులు చర్చించి ఆమోదించి ప్రకటించిన  తీర్మానాలు (న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్) కార్యరూపం దాల్చడానికి అమలు చేయాల్సిన చర్యలు రూపొందించడానికి   జీ 20 ఫీడర్ థీమ్ వర్క్‌షాప్‌లను నీతి ఆయోగ్ నిర్వహించనుంది. 2023 నవంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు నీతి ఆయోగ్ 10 ఫీడర్ థిమాటిక్ వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. జీ-20 నుంచి జీ-21 వరకు, అభివృద్ధి సాధనకు అవసరమైన సమాచారం,  పర్యాటక రంగం,డిజిటల్ మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వాణిజ్యం, అభివృద్ధి సాధనకు భారతదేశం అమలు చేస్తున్న విధానం, మహిళల సారధ్యంలో అభివృద్ధి సాధన, సంస్కరణలు,బహుళ అభివృద్ధి బ్యాంకులు,  క్లైమేట్ ఫైనాన్స్, గ్రీన్ డెవలప్మెంట్ లాంటి అంశాలపై వర్క్‌షాప్‌లు జరగనున్నాయి. వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించి న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాయి. 

ఆయా రంగాల్లో ప్రావీణ్యం ఉన్ననిపుణులు, విధానకర్తల  సహకారంతో వర్క్ షాప్ లను నిర్వహిస్తున్నారు. ఓఆర్ఎఫ్, ఎంఈటీవై, ఇండియా ఫౌండేషన్, ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ (ఐఎ్సపీఆర్ఐటీ), సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ (సీఎస్ఈపీ), ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ (ఐహెచ్డీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ), అగ్రో ఫౌండేషన్, ఇన్స్టిట్యూట్ ఫర్ వాట్ వర్క్స్ టు అడ్వాన్స్డ్ జెండర్ ఈక్వాలిటీ (ఐడబ్ల్యూడబ్ల్యూఏజీ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్), కౌన్సిల్ ఆన్ ఎనర్జీ,  ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) ల ప్రతినిధులు, ఇతర నిపుణులు వర్క్‌షాప్‌లో పాల్గొంటారు.  

 ప్రతి వర్క్ షాప్ 10-12 పేజీల నివేదిక రూపొందించి న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ అమలు కోసం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ ఆమోదించిన వివిధ అంశాలను సమగ్రంగా విశ్లేషించి, తీర్మానం కార్యరూపం దాల్చడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని నివేదికలో పొందుపరుస్తారు. 

ప్రతి వర్క్‌షాప్‌  ముఖ్య లక్ష్యాలు : 

*న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ సిఫార్సులపై సమీక్ష : క్షేత్రస్థాయిలో జీ 20 న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ సిఫార్సులు అమలు జరిగేలా చూడడం 

*కీలక సమస్యలు/కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం : న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్లో పొందుపరిచిన  కీలక అంశాలను గుర్తించి వీటిని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం 

*అదనపు సమస్యలు/అంశాలను గుర్తించడం: తక్షణం దృష్టి సారించాల్సిన సమస్యలు/అంశాలను గుర్తించి తగిన చర్యలు సిఫార్సు చేయడం  

*ఉత్తమ విధానాలు  గుర్తించడం : గుర్తించిన ప్రాంతాల్లో రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి  ఉత్తమ విధానాలు సిఫార్సు చేయడం 

*అమలు వ్యూహాలను రూపొందించడం: గుర్తించిన అంశాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వ్యూహాలను రూపొందించడం.

ప్రతి వర్క్‌షాప్‌లో  20-30 మంది నిపుణులు, నిర్దిష్ట అంశంలో లో ప్రత్యేకత కలిగిన 8-10 మంది విద్యావేత్తలతో సహా సుమారు 30-40 మంది పాల్గొంటారు. అనుభవజ్ఞులైన నిపుణుల నాయకత్వంలో చర్చలు జరుగుతాయి.  

ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ ను ఆమోదించింది. న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ అమలుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.ప్రణాళిక కార్యరూపం దాల్చేలా చూసేందుకు అవసరమైన ప్రణాళికను  సంబంధిత మంత్రిత్వ శాఖలు/డిపార్ట్ మెంట్ లు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, విద్యావేత్తలు, విద్యార్థులు, యువత, మహిళలు, రాష్ట్రాలు, నిపుణుల సహకారంతో రూపొందించడానికి నీతి ఆయోగ్ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. 

 

***



(Release ID: 1973589) Visitor Counter : 56


Read this release in: English , Urdu , Hindi , Tamil