వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ముగిసిన 16వ 'అగ్రికల్చరల్ సైన్స్ కాంగ్రెస్'

Posted On: 13 OCT 2023 6:09PM by PIB Hyderabad

'నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్' (నాస్‌) నిర్వహించిన 16వ 'అగ్రికల్చరల్ సైన్స్ కాంగ్రెస్' (ఏఎస్‌సీ) ఈ రోజు కోచిలో ముగిసింది. వ్యవసాయ పరిశోధన & విద్య విభాగం కార్యదర్శి, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఇక్రా) డైరెక్టర్ జనరల్ డా.హిమాన్షు పాఠక్ ముగింపు ప్రసంగం చేశారు. భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎక్కువ మంది యువత ఈ రంగంలోకి ఎంతో ఉత్సాహంతో అడుగు పెడుతున్నారని చెప్పారు.

'అగ్రికల్చరల్ సైన్స్ కాంగ్రెస్'లో మాట్లాడుతున్న డా.హిమాన్షు పాఠక్

ఈ సందర్భంగా, విశ్వవిద్యాలయం విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

భూమి, నీరు, వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థలు, ఉత్పత్తులు, వ్యవసాయ యంత్రాలు, వాతావరణ మార్పులు, ఆర్థిక విషయాలు, పునరుత్పాదక లేదా ప్రత్యామ్నాయ ఇంధన శక్తి, ప్రత్యామ్నాయ వ్యవసాయ వ్యవస్థలు, తీర ప్రాంత వ్యవసాయం, భవిష్యత్‌ సాంకేతికతలు సహా వ్యవసాయం & అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని సమస్యలపై, 10 నేపథ్య అంశాల ద్వారా ఏఎస్‌సీ చర్చించింది. ఈ సదస్సులో 114 పరిశోధన పత్రాలను సమర్పించారు.

16వ ఏఎస్‌సీలో వ్యవసాయం & అనుబంధ రంగాల్లోని ప్రముఖ వ్యక్తులు ఆరు ప్లీనరీ ఉపన్యాసాలు చేశారు. మూడు ప్యానెళ్ల చర్చలు, అనేక అంశాలతో కూడిన నాలుగు సింపోజియమ్‌లను కూడా ఏఎస్‌సీలో నిర్వహించారు.

ప్రముఖులు, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులు

భారత్‌తో పాటు విదేశీ ప్రతినిధులు కలిపి మొత్తం 1500 మంది కాంగ్రెస్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో, ప్రభుత్వ & ప్రైవేటు రంగ పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ పరిశ్రమలు, అనుబంధ సంస్థలు, ఎన్‌జీవోలు వినూత్న వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శించాయి.

***



(Release ID: 1967658) Visitor Counter : 47


Read this release in: English , Hindi , Urdu