ఆర్థిక మంత్రిత్వ శాఖ

రేపు 40వ స్థాపక దినోత్సవాన్ని జరుపుకోనున్న కస్టమ్స్, ఎక్సైజ్ మరియు సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సీఈఎస్ఏటి)


40 సంవత్సరాల కాలంలో సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా కార్యక్రమాలు

ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ దినేష్ మహేశ్వరి

గౌరవ అతిథిగా హాజరు కానున్న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ

Posted On: 17 MAR 2023 12:02PM by PIB Hyderabad

40 సంవత్సరాల కాలంలో సాధించిన ప్రగతి, విజయాలు గుర్తు చేసుకుంటూ రేపు కస్టమ్స్, ఎక్సైజ్ మరియు సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సీఈఎస్ఏటి)  ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ప్రారంభ కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి  శ్రీ జస్టిస్ దినేష్ మహేశ్వరి ముఖ్య అతిధిగా పాల్గొంటారు. కార్యక్రమంలో గౌరవ అతిధిగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ హాజరవుతారు.  ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి,  జస్టిస్ యశ్వంత్ వర్మ, రెవెన్యూ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీ సంజయ్ మల్హోత్రా, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసి) చైర్మన్ శ్రీ వివేక్ జోహ్రీ కూడా ప్రారంభ  కార్యక్రమంలో పాల్గొంటారు. 40 సంవత్సరాల కాలంలో సాధించిన ప్రగతి, విజయాలతో రూపొందించిన ఒక సావనీర్ ను కార్యక్రమంలో విడుదల చేస్తారు. 

సీఈఎస్ఏటి అధ్యక్షుడు జస్టిస్ దిలీప్ గుప్తా నేతృత్వంలో  ఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్ సభ్యులతో పాటు  సీఈఎస్ఏటి  7 ఇతర ప్రాంతీయ బెంచ్‌లు, ట్రిబ్యునల్ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి ట్రిబ్యునల్‌ సభ్యులు, దేశం వివిధ ప్రాంతాలకు చెందిన  బార్‌ సభ్యులు, డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధులు హాజరుకానున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, సీబీఐసీ సభ్యులు, ప్రిన్సిపల్ కమిషనర్లు, చీఫ్ కమిషనర్లు,  డిపార్ట్‌మెంట్ కమిషనర్లు కూడా హాజరుకానున్నారు.

ప్రారంభోత్సవం తర్వాత రెండు వర్కింగ్ సదస్సులు జరుగుతాయి. ఉంటాయి. మొదటి సదస్సులో ‘త్వరిత న్యాయాన్ని అందించడానికి ట్రిబ్యునళ్లలో సాంకేతికతను ఉపయోగించడం' అనే అంశం’పై చర్చ జరుగుతుంది. సదస్సుకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి   శ్రీ జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా అధ్యక్షత వహిస్తారు. 'ట్రిబ్యునళ్ల  ప్రయోగాలు - విజయాలు, సమస్యలు ' అనే అంశంపై మరో సదస్సు జరుగుతుంది. సుప్రీంకోర్టు  న్యాయమూర్తి  శ్రీ జస్టిస్ పంకజ్ మిథాల్ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు.అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్ కూడా సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

సీఈఎస్ఏటి గురించి:

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 323 బి , కస్టమ్స్ చట్టం, 1962 లోని సెక్షన్ 129 ప్రకారం కస్టమ్స్, ఎక్సైజ్ మరియు సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ 1982లో అక్టోబర్ 11న ఏర్పడింది. కస్టమ్స్ చట్టం, 1962 తో సహా కొన్ని చట్టాలను  సవరించడానికి ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం, 2021 అమల్లోకి వచ్చింది.  పైన పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 3 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించడం కోసం ట్రిబ్యునల్ (సేవా నిబంధనలు) రూల్స్, 2021 రూపొందాయి. 

 

ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీలో ఉంది. తొలుత  ముంబై, చెన్నై, కోల్‌కతాలో  ట్రిబ్యునల్‌ 3 ప్రాంతీయ బెంచ్‌లు ఉండేవి. ఆ తర్వాత మరో 5 ప్రాంతీయ బెంచ్‌లు ఏర్పాటయ్యాయి. ట్రిబ్యునల్ బెంగళూరు బెంచ్ 30.11.2000న, అహ్మదాబాద్ బెంచ్ 03.03.2006న, అలహాబాద్ బెంచ్ 14.08.2015న, చండీగఢ్ బెంచ్ 04.11.2015న, హైదరాబాద్ బెంచ్ 06.511.2000న ఏర్పాటయ్యాయి. అధ్యక్షుడు కాకుండా    ట్రిబ్యునల్ లో 16 మంది జ్యుడీషియల్ సభ్యులు  16 మంది సాంకేతిక సభ్యులు ఉంటారు.

కోవిడ్ మహమ్మారి కాలంలో, ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్‌, ట్రిబ్యునల్‌ 8 ప్రాంతీయ బెంచ్‌లు వర్చువల్ విధానంలో  కార్యకలాపాలు నిర్వహించాయి. డంపింగ్ వ్యతిరేక అంశాలతో సహా మిగిలిన అంశాలపై ఈ కాలంలోనే ట్రిబ్యునల్ నిర్ణయాలు తీసుకుంది. 

 

ట్రిబ్యునల్ పనితీరును మెరుగు పరిచేందుకు గత నాలుగు సంవత్సరాలుగా అనేక చర్యలు అమలు జరిగాయి.  ట్రిబ్యునల్ ఆమోదించిన అన్ని ఉత్తర్వులు, తుది ఉత్తర్వులు లేదా మధ్యంతర ఉత్తర్వులు లేదా రోజువారీ ఉత్తర్వులు ఏవైనా ఆలస్యం లేకుండా ట్రిబ్యునల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. దీనివల్ల సమస్య పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన వారికి  ప్రొసీడింగ్‌ల గురించి సకాలంలో సమాచారం అందుతుంది.  ట్రిబ్యునల్ నిర్ణయించిన తదుపరి తేదీలకు సంబంధించి పార్టీలకు వ్యక్తిగత నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.  కోర్టు గదులు ట్రిబ్యునల్‌లోని ఇతర ముఖ్యమైన  ప్రదేశాలలో డైనమిక్ డిస్‌ప్లే బోర్డు కూడా ఏర్పాటు అయ్యింది. 

 

****



(Release ID: 1908076) Visitor Counter : 127