రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

యూపీలోని అయోన్లా, ఫూల్పూర్ లో ఇఫ్కో నానో యూరియాలిక్విడ్ ప్లాంట్లను ప్రారంభించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


నానో యూరియా హరిత సాంకేతికత, మట్టిని కాపాడుతుంది-ఉత్పత్తిని పెంచుతుంది - డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 14 FEB 2023 7:39PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఉత్తరప్రదేశ్ లోని అయోన్లా, ఫూల్పూర్ లో ఇఫ్కో నానో యూరియా లిక్విడ్ ప్లాంట్లను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ నానో యూరియా ప్లాంట్లను జాతికి అంకితం చేసినందున ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు. రాబోయే కాలంలో నానో యూరియా రైతుల పురోగతికి, వారి ఆదాయాన్ని పెంచడానికి దోహదపడుతుందని, . ఆ విధంగా ఇది మన రైతుల భవిష్యత్తును

మారుస్తుందని అన్నారు.

 

నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర మంత్రి వివరించారు, ఇది ఉత్తమ హరిత సాంకేతిక పరిజ్ఞానం అని, కాలుష్యానికి పరిష్కారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.

ఇది నేలను సంరక్షిస్తుంది. ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అందువల్ల రైతులకు ఉత్తమమైనది. నానో డీఏపీకి ప్రభుత్వ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపిందని, త్వరలోనే డీఏపీ స్థానంలో రానుందని తెలిపారు. నానో-డీఏపీ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, డీఏపీ ధరలో సగం ధరకే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

 

నానో యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని డాక్టర్ మాండవీయ వివరించారు. నానో యూరియా తీసుకురావడంలో వివిధ శాఖల నుంచి అనుమతులు పొందడం, రైతులను ఒప్పించడం నుంచి సంప్రదాయ యూరియా లాబీని ఎదుర్కోవడం వరకు ఉన్న సవాళ్లను ఆయన ప్రస్తావించారు.

 

ఇది ప్రత్యామ్నాయ ఎరువు అని డాక్టర్ మాండవీయ తెలిపారు. ‘‘కొన్నేళ్లుగా మనం ఉత్పాదకత పెంచడానికి యూరియా, డీఏపీలను

ఉపయోగిస్తున్నాము. యూరియాను ఉపయోగించినప్పుడు, పంటకు 35% నత్రజని (యూరియా) మాత్రమే ఉపయోగించబడుతుంది మిగిలింది నేలను ప్రభావితం చేస్తుంది. ఈ రోజు భూసారం ఉత్పాదకత స్థాయి తగ్గి పంట ఉత్పత్తి ఇంకా పెరగని స్థితి వచ్చింది. కనుక ప్రత్యామ్నాయ ఎరువుల అవసరం ఏర్పడింది‘‘ అని కేంద్ర మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతుల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని ప్రశంసించిన కేంద్ర మంత్రి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ,వారి శ్రేయస్సు కోసం ప్రకృతి వ్యవసాయం, బయో ఫెర్టిలైజర్స్ ,ప్రత్యామ్నాయ ఎరువుల పై మన ప్రధాన మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. కోవిడ్ సమయంలో ప్రధాన మంత్రి పాత్రను ఆయన ప్రశంసించారు, ఎరువుల ధరలు పెరిగి ఒక యూరియా బస్తా రూ .4000 కు

చేరినా ప్రధాన మంత్రి ఎరువుల ధర పెరగనివ్వలేదని, సబ్సిడీని పెంచండి కాని పెరిగిన ధరల భారం మన రైతులపై పడకూడకుండా ఆదేశాలు ఇచ్చారని శ్రీ మాండవీయ గుర్తు చేశారు.

 

ఇఫ్కో కృషిని కేంద్ర మంత్రి ప్రశంసిస్తూ, సహకారానికి వాణిజ్యం, వ్యాపారం, లాభమే ప్రదానం కాదని, రైతుల సంక్షేమమే కూడా ముఖ్యమని ఆయన అన్నారు.

 

రైతులు నానో యూరియా వాడాలని డాక్టర్ మాండవీయ సూచించారు. ఒక రైతు మరో రైతు సలహాలు బాగా వింటాడని చెప్పారు. ఒక రైతు తన పొలంలో నానో యూరియాను ఉపయోగిస్తే ఉత్పత్తి పెరిగిందని, మట్టి కూడా దెబ్బతినదని, ఖర్చు కూడా తగ్గుతుందని తెలిస్తే నానో యూరియా వాడమని ఇతరులకు కూడా సలహా ఇవ్వాలనీ సూచించారు.

 

ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఇఫ్కో చైర్మన్ శ్రీ దిలీప్ సంఘాని, ఇఫ్కో వైస్ చైర్మన్ శ్రీ బల్వీర్ సింగ్, ఇఫ్కో ఎండి ,సిఇఒ డాక్టర్ ఉదయ్ శంకర్ అవస్థి, శ్రీమతి కేసరి దేవి ఎంపి ఫుల్పూర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

****



(Release ID: 1899349) Visitor Counter : 146


Read this release in: English , Urdu , Hindi