మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పరీక్షా పే చర్చా 2023 లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని సంభాషణ


“దృష్టి కేంద్రీకరిస్తే అంచనాల వత్తిడి నుంచి బైటపడవచ్చు”

“మనసు తాజాగా ఉన్నప్పుడు ఏ మాత్రం ఆసక్తిలేని, కష్టమైన అంశాలు చేపట్టాలి”

“మోసం ద్వారా జీవితంలో విజయం సాధించలేం”

ముఖ్యమైన విషయాలలో తెలివిగా కష్టపడాలి

“ఎక్కువమంది సగటు, సాధారణ వ్యక్తులే. వీళ్ళే అసాధారణమైన పనులతో అద్భుతాలు సాధిస్తారు”

“వర్ధిల్లే ప్రజాస్వామ్యాన్ని శుద్ధి చేసేది విమర్శే”

“ఆరోపణలకూ, విమర్శలకూ చాలా పెద్ద తేడా ఉంది”

“దేవుడు మనకు స్వయం నిర్ణయాధికారం, వ్యక్తిత్వం ఇచ్చాడు; ఎలక్ట్రానిక్ పరికారాలకు బానిసలుగా మారకూడదన్న స్పృహ మనకు ఉండాలి”

“వెండితెర, బుల్లి తెర, ఫోన్ తెర చూసే సగటు సమయం కలవరపెడుతోంది”

“ఒక పరీక్షతో జీవితం పూర్తి కాదు, ఫలితం గురించి రోజూ ఆలోచించటం మంచిది కాదు”

“ఒక ప్రాంతీయ భాష నేర్చుకోవటానికి ప్రయత్నించటం ద్వారా కేవలం ఆ భాష గురించే కాదు, ఆ ప్రాంత చరిత్రకు, వాసత్వ సంపదకు తలుపులు తెరుస్తున్నట్టే”

“క్రమశిక్షణ కోసం కఠిన శిక్ష అమలు చేయయటం మంచిది కాదు. సంభాషణ ద్వారా సత్సంబంధం పెంచాలి”

“సమాజంలో వైవిధ్యమైన అనుభవాలను తల్లిదండ్రులు పిల్లలకు చూపాలి”

“ పరీక్షల వత్తిడి తగ్గించి దాన్నొక

Posted On: 27 JAN 2023 4:53PM by PIB Hyderabad

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు 6 వ విడత ‘పరీక్షా పే చర్చ’ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషించారు. అక్కడ విద్యార్థులు ఏర్పయాఉ చేసిన ప్రదర్శనలో ఉంచిన వస్తువులను చూశారు. జీవితానికి, పరీక్షలకు సంబంధించిన అంశాల మీద విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సంభాషించటానికి ప్రధాని ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం “పరీక్షా పే చర్చ”. ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమానికి 155 దేశాలనుంచి 38 లక్షల 80 వేలమంది నమోదు చేసుకున్నారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ప్రసంగిస్తూ, మొదటి సారిగా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పరీక్షా పే చర్చ జరుగుతోందన్నారు. దీనివలన ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారు గణతంత్ర వేడుకలు చూసే అవకాశం కూడా లభించిందన్నారు. పరీక్షా పే చర్చ ప్రాధాన్యం గురించి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కోసం వచ్చిన లక్షలాది ప్రశ్నలు చూస్తుంటే భారత యువతరం మనసులోకి తొంగిచూడగలుగుతున్నానన్నారు. ఈ ప్రశ్నలు ఒక గనిలా ఉన్నాయని, వీటన్నిటినీ చేర్చి రానున్న కాలంలో సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తే ఒక అద్భుతమైన సిద్ధాంత పత్రం తయారవుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

 

నిరుత్సాహాన్ని ఎదుర్కోవటం ఎలా 

 

తమిళనాడులోని మదురై కేంద్రీయ విద్యాలయం విద్యార్థిని అశ్విని, ఢిల్లీ పితంపుర కేంద్రీయ విద్యాలయం విద్యార్థి నవతేజ్, పాట్నా లోని నవీన్ బాలికా స్కూల్ విద్యార్థిని ప్రియాంకా కుమారి తక్కువ మార్కుల వలన కుటుంబం నిరాశ చెందటాన్ని ప్రస్తావించగా, కుటుంబం ఎక్కువ ఆశలు పెట్టుకోవటం తప్పేమీ కాదని, సామాజిక హోదా కోసం అలా జరుగుతుందని ప్రధాని నచ్చజెప్పారు. ప్రతి విజయంతోనూ అంచనాలు మరింతగా పెరుగుతాయన్నారు. అంతమాత్రాన చుట్టూ పెరిగే అంచనాలతో భయపడాల్సిన అవసరం లేదని, సామర్థ్యంతో, ఆలోచనలతో, ప్రాధాన్యాలతో బేరీజు వేసుకొని ముందుకు నడవాలని హితబోధ చేశారు. క్రికెట్ ను ఉదాహరిస్తూ, ప్రేక్షకులు ఎప్పుడూ ఫోర్లు, సిక్స్ లు కోరుకోవటం సహజమే అయినా ఆటగాడు ఇవేవీ పట్టించుకోకుండా తన సామర్థ్యం కొద్దీ ఆడతాడని గుర్తు చేశారు. అందువలన ఆటగాడు ఆటమీద దృష్టి పెట్టినట్టే విద్యార్థులు ఇతరుల ఆకాంక్షల మీద కంటే చదువు మీద దృష్టిపెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ అంచనాలను, ఆకాంక్షలను పిల్లలమీద రుద్దవద్దని ప్రధాని సూచించారు. విద్యార్థులు తమ శక్తిని బట్టి తమను తాము అంచనావేసుకోవాలని హితవు పలికారు. అలా జరగనప్పుడు నిరుత్సాహం ఎదురయ్యే ప్రమాదముందన్నారు. 

 

పరీక్షలకు సిద్ధం కావటం, సమయ నిర్వహణ

 

పరీక్షలకు సిద్ధం కావటం ఎప్పుడు మొదలు పెట్టాలి, వత్తిడి వలన మతిమరపు రావటం మీద డల్హౌసీ కేంద్రీయ విద్యాలయం 11 వ తరగతి విద్యార్థిని ఆరుషి, రాయపూర్ కృష్ణా పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అదితీ దివాన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పరీక్షలు ఉన్నా, లేకపోయినా సాధారణ జీవితంలో కూడా సమయ నిర్వహణ చాలా ముఖ్యమని ప్రధాని చెప్పారు. పనివాళ్ళ అలసిపోవటం ఉండదని, పనిచేయకపోవటమే అలపు తెప్పిస్తుందని అన్నారు. రోజు వారీ పనుల్లో దేనికెంత సమయం కేటాయిస్తున్నామో రాసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నచ్చిన పనులకే ఎక్కువ సమయం కేటాయించటం సహజమని, అందుకే మనసు తాజాగా ఉన్నప్పుడు ఏ మాత్రం ఆసక్తిలేని, కష్టమైన అంశాలు చేపట్టాలని చెప్పారు. అప్పుడే క్లిష్టమైనవి కూడా సులభంగా తలకెక్కుతాయన్నారు. ఇంట్లో తల్లులు సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారో గమనించాలని విద్యార్థులను కోరారు. వాళ్ళు సకాలంలో అన్నీ పనులూ పూర్తి చేస్తూనే కొంత సమయాన్ని సృజనాత్మకమైన పనులకు కూడా కేటాయిస్తారన్నారు. ఇంత చేసినా ఎప్పుడూ అలసిపోరని చెబుతూ, ఒక్కో సబ్జెక్ట్ కూ నిర్దిష్టమైన సమయం కేటాయిస్తూ చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. 

పరీక్షల్లో తప్పుడు పనులు, అడ్డదారులు వద్దు

 

పరీక్షల్లో అక్రమ పద్ధతులను నివారించటం మీద బస్తర్ లోని స్వామి ఆత్మానంద్ గవర్నమెంట్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి రూపేష్ కశ్యప్, ఒడిశాలోని కోణార్క్ పూరీ విద్యార్థిని తన్మయీ బిశ్వాల్ పరీక్షల్లో మోసాల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, పరీక్షల్లో తప్పుడు విధానాల మీద విద్యార్థులు గొంతెత్తటాన్నిప్రధాని అభినందించారు. కొంతమంది విద్యార్థులు ఇన్విజిలేటర్ ను మోసం చేయటం గర్వంగా భావిస్తుంటారని, ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని, ఇలాంటి ధోరణి మారాలని చెప్పారు. కొన్ని స్కూళ్ళు, కొంతమంది టీచర్లు ట్యూషన్లు నడుపుతూ వాళ్ళ విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకునేలా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు. విద్యార్థులు అలాంటి అడ్డదారుల గురించి ఆలోచించకుండా, ఆ సమయాన్ని చదువు కోసం వెచ్చించాలన్నారు. మారుతున్న కాలంలో ఇప్పుడు అడుగడుగునా పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాని గుర్తు చేశారు. అక్రమాలకు పాల్పడే వారు తాత్కాలికంగా గెలిచినా, ఆ తరువాత జీవితంలో ఓటమి చవిచూడక తప్పదన్నారు. మోసంతో పాసయ్యే వాళ్ళతో పోల్చుకొని నిజాయితీ పరులైన విద్యార్థులు నిస్పృహ చెందకూడదని చెప్పారు. “ పరీక్షలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ జీవితం మాత్రం సంపూర్ణంగా జీవించాల్సి ఉంటుంది” అన్నారు. రైల్వే స్టేషన్లలో వంతెన మీద కాకుండా పట్టాలు దాటివెళ్ళే వాళ్ళతో అలాంటి వాళ్ళను పోల్చారు. 

 

కష్టపడి చదవటం – తెలివిగా చదవటం

 

కష్టపడి పనిచేయటానికి, తెలివిగా పనిచేయటానికి మధ్య తేడా, వాటి అవసరం గురించి కేరళలోని కోజీకోడ్ కు చెందిన ఒక విద్యార్థి అడిగాడు. దీనికి సమాధానంగా, దాహంతో ఉన్న కాకి నీళ్ళకోసం రాళ్ళు ఏరి తెచ్చి కుండను నింపటాన్ని ప్రధాని ఉదాహరించారు. ఈ కథలో నీతిని జాగ్రత్తగా గమనించాలని సూచించారు. ఒక మెకానిక్ రెండు వందలు తీసుకొని రెండు నిమిషాల్లో జీప్ రిపేర్ చేయటాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, ఎంత సేపు పనిచేశామనే దానికంటే ఎంత అనుభవంతో ఎంత చాకచక్యంగా పనిచేశామన్నది ముఖ్యమన్నారు. కేవలం కష్టపడి పనిచేయటం ద్వారాన్నే అన్నీ సాధించలేమని చెబుతూ,. ఆటలలో కూడా ప్రత్యేక శిక్షణ చాలా ముఖ్యమన్నారు. తెలివిగా కష్టపడటం మీద దృష్టి సారిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు.

 

సొంత సామర్థ్యాన్ని గుర్తించటం

 

గురుగ్రామ్ లోని జవహర్ నవోదయ విద్యాలయకు చెందిన 10 వ తరగతి విద్యార్థి జోవితా పాత్రా ఒక సగటు విద్యార్థి పరీక్షలు బాగా రాయటం ఎలా అని అడిగింది. విద్యార్థులు తమ గురించి తాము ఒక వాస్తవిక అంచనా వేసుకోవటాన్ని ప్రధాని అభినందించారు. అలా గ్రహించినప్పుడు తగిన లక్ష్యాలు పెట్టుకోవటం కూడా సాధ్యమవుతుందన్నారు. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సామర్థ్యాన్ని గుర్తించగలిగినప్పుడు లక్ష్యాలు పెట్టుకోవటం సులభమవుతుందన్నారు. ఎక్కువమంది సగటు, సాధారణ వ్యక్తులేనని, వీళ్ళే అసాధారణమైన పనులతో అద్భుతాలు సాధిస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందన్నారు. భారత ఆర్థిక వేత్తలను కూడా గుర్తించని రోజులనుంచి ఇప్పుడు ప్రపంచం మనవైపే చూస్తున్న పరిస్థితి వచ్చిందన్నారు. మనం సగటు స్థితిలో ఉన్నామనే భావన వల్ల వచ్చే వత్తిడికి గురి కాకూడదని, నిజంగా సాధారణ వ్యక్తులైనా, మనలోని అసాధారణ శక్తిని గుర్తించి దాన్ని పెంపొందించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

 

విమర్శలను ఎదుర్కోవటం 

 

చండీగఢ్ లోని సెంట్ జోసెఫ్ సెకండరీ స్కూల్ విద్యార్థి మన్నత్ బజ్వా, ఆహామమాదాబాద్ కి చెందిన 12 వ తరగతి విద్యార్థి కుంకుమ్ ప్రతాప్ భాయ్ సోలంకి, బెంగళూరు వైట్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ 12 వ తరగతి విద్యార్థి ఆకాశ్ దరీరా ప్రధాని పట్ల వ్యతిరేక భావం ఉండేవాళ్ళతో ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. దక్షిణ సిక్కింలోని డీఏవీ స్కూల్ 11 వ తరగతి విద్యార్థి అష్టమీ సేన్ కూడా మీడియాను ఎదుర్కోవటం మీద ఇలాంటి ప్రశ్నే అడిగారు. విమర్శ అనేది శుద్ధి చేసే యజ్ఞం లాంటిదిగా భావిస్తానని, ప్రజాస్వామ్యం వర్ధిల్లటానికి అది చాలా అవసరమని ప్రధాని సమాధానమిచ్చారు. అభిప్రాయాలు తెలుసుకోవటం చాలఆ అవసరమని చెబుతూ, ప్రోగ్రామర్ తన కోడ్ ను ఓపెన్ సోర్స్ లో పెట్టి మెరుగుదల కోసం అభిప్రాయాలు తీసుకోవటాన్ని పోల్చి చెప్పారు. కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను మార్కెట్లో పెట్టి వాటిలో లోపాలు చెప్పాల్సిందిగా వినియోగదారులను అడగటం కూడా అలాంటిదేనన్నారు. ఈ మధ్య తల్లిదండ్రులు కూడా పిల్లల మాటలని అడ్డుకుంటున్నారే తప్ప నిర్మాణాత్మక విమర్శలు చేయటం లేదన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఎన్ని అవరోధాలు కల్పిస్తున్నా, మాట్లాడటం ఆపని సభ్యుల గురించి ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే విమర్శలకు, ఆరోపణలకూ మధ్య తేడా గుర్తించాలని ప్రధాని కోరారు.  

ఆన్‌లైన్‌ ఆటలు… సామాజిక మాధ్యమ వ్యసనం

   ఏకాగ్రతకు భంగం కలిగించే ఆన్‌లైన్‌ ఆటలు, సామాజిక మాధ్యమ వ్యసనం పర్యవసానాల గురించి నలుగురు విద్యార్థులు- భోపాల్‌ నుంచి దీపేష్‌ అహిర్వార్, ఇండియా టీవీద్వారా పదో తరగతి విద్యార్థి ఆదితాబ్, రిపబ్లిక్ టీవీ ద్వారా కామాక్షి, జీ టీవీ ద్వారా మనన్ మిట్టల్ ప్రశ్నించారు. వారి ప్రశ్నలపై ప్రధానమంత్రి స్పందిస్తూ- మీరు చురుకైనవారా… మీ చేతిలోని ఉపకరణం (గ్యాడ్జెట్) చురుకైనదా? అన్నది ముందుగా తేల్చుకోవాలన్నారు. మీకన్నా మీ చేతిలోని గ్యాడ్జెట్ చురుకైనదని మీరు భావించారంటే సమస్య మొదలైనట్టేనని హెచ్చరించారు. ఉపకరణాన్ని వివేచనతో వాడుకున్నపుడే ఉత్తమ ఫలితాల సాధనకు తోడ్పడేవిగా వాటిని మీరు పరిగణించగలరు. భారతీయుల సగటు స్క్రీన్ సమయం దాదాపు ఆరు గంటలుగా ఉందని ఒక అధ్యయనంలో తేలినట్లు పేర్కొంటూ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మనం గ్యాడ్జెట్‌ బానిసలుగా మారినట్లేనని స్పష్టం చేశారు. “దేవుడు మనకు ఆలోచనా స్వేచ్ఛ, స్వతంత్ర వ్యక్తిత్వం ప్రసాదించాడు. కాబట్టి ఉపకరణాలకు బానిసలు కావడమనే అంశంపై మనం సదా వివేచనతో ఉండాలి” అని ప్రధానమంత్రి హితవు చెప్పారు.

   ఈ సందర్భంగా ‘నేనెంతో చురుగ్గా ఉంటాను… కానీ, మొబైల్ ఫోన్‌తో కనిపించడం చాలా అరుదు’ అంటూ తననుతానే ఉదాహరణగా చూపారు. ఉపకరణాలో పని ఉంటే అందుకోసం నిర్దిష్ట సమయం కేటాయిస్తానని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తప్పనిసరి… అయినప్పటికీ అవసరానికి తగినట్లుగా మాత్రమే దాన్ని వాడుకునేలా మనను మనం మలచుకోవాలని చెప్పారు. విద్యార్థులు ఒక ఎక్కం అప్పజెప్పలేని స్థితిలో ఉండటాన్ని ఈ సందర్భంగా ప్రధాని ఉదాహరించారు. జన్మతః అబ్బిన ప్రాథమిక జ్ఞానాన్ని కోల్పోకుండా మన సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలన్నారు. ఈ కృత్రిమ మేధోయుగంలో మన సృజనాత్మకత పరిరక్షణ కోసం పరీక్ష-అభ్యాసం ప్రక్రియను కొనసాగించాలి. నిర్దిస్ట విరామాల్లో ‘సాంకేతిక ఉపవాసం’ చేయాలని, ప్రతి ఇంట్లోనూ ‘సాంకేతికత రహిత ప్రదేశం’ ఒకటి ఏర్పరచుకోవాలని ప్రధాని సూచించారు. ఇది జీవితానందాన్ని ఇనుమడింపజేసి, ఉపకరణ బానిసత్వం నుంచి మనను విముక్తుల్ని చేస్తుందని చెప్పారు.

పరీక్షల తర్వాత ఒత్తిడి

   పరీక్షలకు ముందు కఠోరంగా శ్రమించినా ఆశించిన ఫలితం రానప్పుడు కలిగే ఒత్తిడిని తట్టుకోవడంపై జమ్మూలోని ప్రభుత్వ మోడల్ హైసెకండరీ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని ‘నిదా’ ప్రశ్నించగా, ఫలితాలపై ఒత్తిడి చూపించే దుష్ప్రభావం గురించి హర్యానాలోని పాల్వాల్‌లోగల షహీద్ నాయక్ రాజేంద్ర సింగ్ రాజ్‌కియా పాఠశాల విద్యార్థి ప్రశాంత్ ప్రశ్నించాడు. ప్రధానమంత్రి వారికి జవాబిస్తూ- పరీక్షల్లో చక్కగా రాశామా.. లేదా? అన్న సందిగ్ధమే పరీక్షానంతర ఒత్తిడికి ప్రధాన కారణమన్నారు. అలాగే సహ విద్యార్థులతో పోటీ కూడా ఒత్తిడి కలిగించే అంశమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ అంతర్గత సామర్థ్యాలను పెంచుకోవడంతోపాటు తమ అనుభవాల నుంచి, పరిసరాలనుంచి నేర్చుకోవడం అవసరమని సూచించారు. జీవన దృక్పథం గురించి చెబుతూ- పరీక్షలు మాత్రమే జీవిత లక్ష్యం కాదని, ఫలితాల గురించి అతిగా ఆలోచించడం రోజువారీ జీవితంలో ఒక అంశం కారాదని ప్రధాని వ్యాఖ్యానించారు.

కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

   కొత్త భాషలు నేర్చుకోవడం ఎలా… వాటివల్ల ప్రయోజనాలేమిటి? అని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోగల జవహర్ నవోదయ విద్యాలయ 9వ తరగతి విద్యార్థిని ఆర్.అక్షరసిరి, భోపాల్‌లోని రాజకీయ మాధ్యమిక విద్యాలయ 12వ తరగతి విద్యార్థిని రితిక ప్రశ్నించారు. ప్రధానమంత్రి స్పందిస్తూ- భారత సంస్కృతీ వైవిధ్యం, సుసంపన్న వారసత్వం గురించి గుర్తుచేశారు. మన దేశం వందలాది భాషలు, వేలాది మాండలికాలకు నిలయం కావడం మనకు గర్వకారణమన్నారు. కొత్త భాషలు నేర్చుకోవడమంటే- కొత్త సంగీత వాద్యం నేర్చుకోవడం వంటిదేనని చెప్పారు. “ఒక ప్రాంతీయ భాష నేర్చుకునే ప్రయత్నంలో అది వ్యక్తీకరణగా మారడం గురించి తెలుసుకోవడమే కాకుండా ఆ ప్రాంతంతో ముడిపడిన చరిత్ర-వారసత్వానికీ మీరు తలుపులు తెరిచినట్లే కాగలదు” అని ప్రధాని వివరించారు. చరిత్ర, వారసత్వాల గురించి తెలుసుకోకుండా కొత్త భాషను నేర్చుకోవడం దైనందిన కార్యకలాపాలకు భారం కాగలదన్నారు. దేశంలో రెండు వేల ఏళ్ల కిందట నిర్మితమైన ఒక స్మారక చిహ్నం పౌరులకు గర్వకారణంగా నిలవడంలోని సారూప్యాన్ని వివరిస్తూ- భూమిపై అత్యంత పురాతన భాషగా పేరుగాంచిన తమిళం విషయంలోనూ దేశం అంతే గర్వపడాలని ప్రధాని అన్నారు.

   ఐక్యరాజ్యసమితి సంస్థలనుద్దేశించి తన చివరి ప్రసంగాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ- ప్రాచీన భాషలకు నిలయమైన భారతదేశ పౌరుడినైనందుకు తానెంత గర్విస్తానో ప్రపంచానికి వివరించానని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన తమిళ భాష గురించి అనేక వాస్తవాలను ప్రత్యేకంగా వెల్లడించడాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక ద‌క్షిణ భార‌త రుచికరమైన ఆహారాన్ని ఎంతో ఇష్టంతో ఆరగించే ఉత్త‌ర భార‌త ప్రజానీకం గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. మాతృభాష కాకుండా కనీసం ఒక ప్రాంతీయ భాషనైనా నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. అక్కడివారితో ఆ భాషలో మాట్లాడినప్పుడు వారి వదనాలు ఎంత వెలిగిపోతాయో ఒక్కసారి ఊహించుకోవాల్సిందిగా కోరారు. గుజరాత్‌లోని ఒక వలస కార్మిక కుటుంబంలో 8 ఏళ్ల బాలిక బెంగాలీ, మలయాళం, మరాఠీ, గుజరాతీ వంటి అనేక భాషలు మాట్లాడటాన్ని ప్రధాని ఉదాహరించారు. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట బురుజుల నుంచి తన ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ- ‘పంచప్రాణ్‌’ (ఐదు సంకల్పాలు)లో ఒకటైన మన వారసత్వంపై గర్వించడం గురించి ప్రధాని నొక్కిచెప్పారు. ఈ మేరకు దేశంలోని భాషా వైవిధ్యంపై ప్రతి భారతీయుడూ గర్వపడాలని పేర్కొన్నారు.

విద్యార్థులను ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుల పాత్ర

   విద్యార్థులను ప్రోత్సహించడం, తరగతి గదిలో ఆసక్తికర బోధన, క్రమశిక్షణ పాటించేలా చేయడం గురించి ఒడిషాలోని కటక్‌ నగరం నుంచి ఉపాధ్యాయురాలు సునన్య త్రిపాఠి ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ- పాఠ్యాంశాలు, బోధనాంశం విషయంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కఠినంగా కాకుండా సరళంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి సూచించారు. విద్యార్థులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, వారిలో సదా ఉత్సుకతను రగిలించడమే పెద్ద బలమని వివరించారు. విద్యార్థులు నేటికీ తమ ఉపాధ్యాయులకు ఎంతో విలువ ఇస్తున్నారని అన్నారు. వారికి ఎప్పుడూ ఏదో ఒక మంచి విషయం చెప్పడానికి సమయం కేటాయించాలన్నారు. క్రమశిక్షణ పాటించేలా చేయడంపై మార్గాల గురించి ప్రస్తావిస్తూ- తరగతి గదిలో వెనుకబడే విద్యార్థులను దూషించడం వంటి చర్యలతో కించపరచరాదని ప్రధాని స్పష్టం చేశారు. అందుకు బదులు కాస్త ముందంజలో ఉన్నవారిని ప్రశ్నలడిగి, జవాబిచ్చేవారికి ఏదైనా బహుమతి ఇవ్వడం ద్వారా అందరిలోనూ ప్రేరణ కలిగించాలన్నారు. అలాగే క్రమశిక్షణ అంశంపై విద్యార్థులతో చర్చగోష్ఠి ఏర్పాటు ద్వారా వారి ప్రవర్తనను సరైన దిశలో నడిపించవచ్చునని చెప్పారు. “క్రమశిక్షణ నేర్పడమంటే బెత్తం ప్రయోగించడం కాకుండా సాన్నిహిత్యం, సంభాషణతో సత్సంబంధాలకు ప్రాధాన్యమివ్వాలని నేను విశ్వసిస్తాను” అన్నారు.

విద్యార్థుల ప్రవర్తన

   సమాజంలో విద్యార్థుల ప్రవర్తన గురించి న్యూఢిల్లీకి చెందిన మహిళ శ్రీమతి సుమన్ మిశ్రా ప్రశ్నకు సమాధానంగా- సమాజంలో విద్యార్థుల ప్రవర్తన పరిధికి తల్లిదండ్రులు గిరిగీయరాదని ప్రధాని వ్యాఖ్యానించారు. “సమాజంలో విద్యార్థి వికాసానికి సమగ్ర విధానం అవశ్యం” అని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల సామాజిక పరిధి సంకుచితం కారాదని, అది విస్తృతంగా ఉన్నపుడే వారిలో వికాసం సాధ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పరీక్షలు ముగిశాక ఎక్కడికైనా ప్రయాణించేలా వారిని ప్రోత్సహించి, వారి అనుభవాలకు అక్షర రూపమిచ్చేలా చూడాలని లోగడ తన కార్యక్రమంలో ఇచ్చిన సలహాను గుర్తుచేశారు. ఇలా వారికి స్వేచ్ఛనివ్వడం ద్వారా విద్యార్థులు ఎంతో నేర్చుకునే వీలుంటుందని చెప్పారు. ఈ మేరకు 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక వారిని ఇతర రాష్ట్రాల సందర్శనకు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాంటి కొత్త అనుభవాల ద్వారా జీవిత సత్యాలు తెలుసుకునే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. అదే సమయంలో వారి స్థితిగతులు, భావోద్వేగాలు తదితరాలపై అప్రమత్తత అత్యంత అవసరమని నొక్కిచెప్పారు. భగవంతుడు తమకు ప్రసాదించిన బిడ్డలకు సంరక్షకులుగా తల్లిదండ్రులు తమనుతాము భావించినప్పుడు ఇది సాధ్యమేనని చెప్పారు.

   చివరగా- కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పరీక్షల వేళ ఒత్తిడి వాతావరణాన్ని గరిష్ఠ స్థాయిలో తగ్గించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంరక్షకులు శ్రద్ధ వహించాలని కోరారు. తద్వారా పరీక్షలంటే తమ జీవితంలో ఉత్సాహం నింపే ప్రక్రియగా విద్యార్థులు భావిస్తారని, ఆ ఉత్సాహమే వారి ప్రతిభా ప్రదర్శనకు భరోసా ఇస్తుందని స్పష్టం చేస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

 

 



(Release ID: 1894191) Visitor Counter : 199


Read this release in: Odia , English , Urdu , Marathi , Hindi