వ్యవసాయ మంత్రిత్వ శాఖ

డిజిటల్ ఇండియా అవార్డు 2022 : పౌరుల డిజిటల్ సాధికారత విభాగంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ కు చెందిన ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-ఎన్.ఏ.ఎం) ప్లాటినం (ప్రథమ) అవార్డు గెలుచుకుంది

Posted On: 07 JAN 2023 2:56PM by PIB Hyderabad

ఈరోజు న్యూఢిల్లీలో ప్రదానం చేసిన డిజిటల్ ఇండియా అవార్డ్స్-2022 లో ప్రజల డిజిటల్ సాధికారత విభాగంలో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రధాన కార్యక్రమం ఈ-ఎన్.ఏ.ఎం., ప్లాటినం అవార్డు గెలుచుకుంది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత రాష్ట్రపతి, శ్రీమతి ద్రౌపది ముర్ము, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఎన్. విజయ లక్ష్మి కి డిజిటల్ ఇండియా అవార్డ్స్- 2022 ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు, కమ్యూనికేషన్ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రదానం చేశారు. 

 

ఈ-ఎన్.ఏ.ఎం. అనేది 22 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 1,260 ఏ.పి.ఎం.సి. మండీలను కలిపే ఒక డిజిటల్ వేదిక.  203 వ్యవసాయ, ఉద్యానవన వస్తువులను ఆన్‌-లైన్ లో విక్రయించుకోడానికి వీలు కల్పిస్తూ, రైతులు తమ ఉత్పత్తులకు మంచి లాభదాయక ధరలు పొందేలా ఈ వేదిక దోహదపడుతుంది.  మండి కార్యకలాపాల డిజిటల్ పరివర్తనతో పాటు, వ్యవసాయ వస్తువుల ఈ-ట్రేడింగ్‌ కు ఈ-నామ్ వేదిక ఎంతగానో ఉపయోగపడుతోంది.  2022 డిసెంబర్, 31వ తేదీ నాటికి, 1.74 కోట్ల మంది రైతులు, 2.39 లక్షల మంది వ్యాపారులు ఈ-నామ్ పోర్టల్‌ లో నమోదు చేసుకున్నారు.  69 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తులకు మొత్తం 2.42 లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపారం ఈ-నామ్ వేదిక ద్వారా నమోదయ్యింది. 

ఈ-నామ్ పోర్టల్ -  రైతులకు, ఇతర భాగస్వాములకు మొబైల్ యాప్‌ లో ప్రస్తుత వస్తువు ధరను అందుబాటులో ఉంచడం,   రూట్ మ్యాప్‌ తో పాటు ~100 కిలోమీటర్ల పరిధిలోని ఇ-నామ్ మండిలు, మండి ధరలను సంగ్రహించే జి.పి.ఎస్. ఆధారిత వ్యవస్థ,  అడ్వాన్స్ లాట్ రిజిస్ట్రేషన్, లాట్ యొక్క చివరి బిడ్ ధర, చెల్లింపు రసీదు గురించి ఎస్.ఎం.ఎస్. హెచ్చరిక, ఈ-నామ్ ద్వారా సకాలంలో పోటీ ధర బిడ్డింగ్, ఖచ్చితమైన బరువు కోసం బరువు అనుసంధానం, మొబైల్‌ లో బిడ్డింగ్ పురోగతి అందుబాటు,  రైతు, వ్యాపారి మధ్య ప్రత్యక్ష వాణిజ్యాన్ని సులభతరం చేయడం,  రైతుల బ్యాంకు ఖాతాకు నేరుగా చెల్లింపు, కొనుగోలుదారులు, అమ్మకందారుల లావాదేవీ ఖర్చులలో తగ్గింపు, ఈ-నామ్ మొదలైన వాటి ద్వారా ఈ-ట్రేడ్ చేయడానికి ఎఫ్.పి.ఓ. లను సులభతరం చేయడానికి ఎఫ్.పి.ఓ. ట్రేడింగ్ మాడ్యూల్ వంటి వివిధ ప్రయోజనాలు / సదుపాయాలను అందిస్తోంది.

ఈ-నామ్ కింద “ప్లాట్‌ఫారమ్-ఆఫ్-ప్లాట్‌ఫారమ్‌" లు (పి.ఓ.పి.ఎస్) ప్రారంభించడంతో పాటు, అగ్రి వాల్యూ చైన్‌ లోని వివిధ విభాగాలలో వ్యక్తిగత సేవా వేదికల నైపుణ్యాన్ని ప్రభావితం చేసే డిజిటల్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం జరిగింది.   ఈ-నామ్ అనేది రైతులకు మెరుగైన ధర కల్పించడం కోసం సౌలభ్యం, సౌకర్యం, పారదర్శకత, కార్యకలాపాల సామర్థ్యం, డిజిటలైజేషన్ ద్వారా పౌరులను శక్తివంతం చేస్తోంది.

డిజిటల్ గవర్నెన్స్ రంగంలో వివిధ ప్రభుత్వ సంస్థలు వినూత్న డిజిటల్ పరిష్కారాలు / ఆదర్శప్రాయమైన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, గౌరవించేందుకు నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎం.ఈ.ఐ.టి.వై. ద్వారా డిజిటల్ ఇండియా అవార్డ్స్ (డి.ఐ.ఏ) ను ఏర్పాటు చేయడం జరిగింది.  డిజిటల్ ఇండియా విజన్‌ ను నెరవేర్చడంలో ప్రభుత్వ సంస్థలతో పాటు అంకుర సంస్థలకు కూడా స్ఫూర్తి నిచ్చి, ప్రేరేపించాలని డిజిటల్ ఇండియా అవార్డ్స్-2022, లక్ష్యంగా పెట్టుకుంది.  పౌరుల డిజిటల్ సాధికారత, పబ్లిక్ డిజిటల్ వేదికలు, అంకురసంస్థల సహకారంతో డిజిటల్ ఇనిషియేటివ్‌లు, వ్యాపారం చేయడం సౌలభ్యం కోసం డిజిటల్ ఇనిషియేటివ్, సామాజిక ఆర్థికాభివృద్ధికి డేటా భాగస్వామ్యం, ఉపయోగం, క్షేత్ర స్థాయిలో డిజిటల్ కార్యక్రమాలు, ఉత్తమ వెబ్, మొబైల్ కార్యక్రమాలు మొదలైన ఏడు విభిన్న కేటగిరీల కింద డిజిటల్ ఇండియా అవార్డ్స్ 2022 ప్రదానం చేయడం జరిగింది.  వివిధ విభాగాల్లో గెలుపొందిన బృందాలకు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. 

 

 

*****



(Release ID: 1889496) Visitor Counter : 183