వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆంధ్రప్రదేశ్‌లో మాండౌస్ తుఫానువల్ల నష్టపోయిన 28 వేల మందికిపైగా ‘ఎఫ్‌సివి’ పొగాకు రైతులకు తక్షణ ఉపశమనం

Posted On: 04 JAN 2023 7:04PM by PIB Hyderabad

    ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ ప్రాంతాల (దక్షిణ తేలికపాటి నేలలు-నల్లరేగడి నేల)లో పొగాకు బోర్డు పరిధిలోని సాగుదారుల సంక్షేమ పథకాల కింద ప్రతి సభ్యునికీ పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి నుంచి రూ.10,000 వంతున ప్రత్యేక వడ్డీ రహిత రుణం మంజూరు కోసం రూ.28.11 కోట్లు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. ఈ మేరకు మొత్తం 28,112 మంది రైతులకు ప్రయోజనం చేకూరే ప్రతిపాదనను కేంద్ర వాణిజ్య-పరిశ్రమలు; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఆమోదించారు. మాండౌస్‌ తుపాను వర్షాల వల్ల నష్టపోయిన ‘ఎఫ్‌సివి’ పొగాకు రైతులు ఆ కష్టం నుంచి కోలుకునేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. తదనుగుణంగా వారు తక్షణ నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి ఇతోధికంగా తోడ్పడుతుంది.

   ఆంధ్రప్రదేశ్‌లోని 10 జిల్లాల్లో 66,000 హెక్టార్ల విస్తీర్ణంలో 121 మిలియన్‌ కిలోల (2021-22) వార్షిక ఉత్పత్తితో ప్రధాన వాణిజ్య పంటగా ‘ఎఫ్‌సివి' పొగాకును సాగుచేస్తారు. భారతదేశం నుంచి ఎగుమతి చేసే ముడి పొగాకులో ఈ ‘ఎఫ్‌సివి' రకం ప్రధానమైనది. ఈ మేరకు మొత్తం ముడి పొగాకు ఎగుమతులలో (తిరస్కరణకు గురైనది మినహా) ‘ఎఫ్‌సివి' రకం 2021-22లో పరిమాణం పరంగా 53.62 శాతం కాగా, విలువ పరంగా 68.47 శాతంగా నమోదైంది.

   ఈ రకం పొగాకు సాగుచేసే రైతులు తమ ఉత్పత్తులను పొగాకు బోర్డు ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్న ఇ-వేలం వేదికద్వారా పారదర్శక రీతిలో విక్రయిస్తూ న్యాయమైన, లాభదాయక ధరను పొందుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధ సంస్థ ‘పొగాకు బోర్డు’ అర్హులైన ‘ఎఫ్‌సివి' పొగాకు రైతులకు వడ్డీ రహిత రుణమంజూరు వ్యవహారాలను నిర్వహిస్తుంది.      

******



(Release ID: 1888733) Visitor Counter : 159


Read this release in: English , Urdu , Hindi