వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వర్చువల్ విధానంలో సమావేశం అయిన భారత్-అమెరికా సీఈఓ ఫోరం


సమావేశానికి సహ అధ్యక్షత వహించిన శ్రీ పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో

వివిధ రంగాలకు చెందిన అంశాలను చర్చించేందుకు సమర్ధ వేదికగా ఫోరం

రెండు దేశాల మధ్య పటిష్టమైన ఆర్థిక సంబంధాలను సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించిన వాణిజ్య మంత్రి

సుస్థిరత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ప్రపంచవ్యాప్తంగా స్థితిస్థాపకంగా సరఫరా గొలుసు వ్యవస్థ మరియు చిన్న వ్యాపారాలను ప్రోత్సహించే ఉమ్మడి ఆసక్తితో కొనసాగుతున్న భారత్ -అమెరికా ఆర్థిక సంబంధాలు: శ్రీ పీయూష్ గోయల్

Posted On: 10 NOV 2022 10:29AM by PIB Hyderabad

 కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య కార్యదర్శి శ్రీమతి జినా రైమోండో సహ అధ్యక్షతన భారతదేశం-అమెరికా సీఈఓ ఫోరమ్  ఈరోజు వర్చువల్‌గా సమావేశం అయింది. 

రెండు దేశాల   ప్రభుత్వాలు డిసెంబర్ 2014లో ఫోరంను పునర్నిర్మించాయి. పునర్నిర్మించిన తర్వాత ఫోరం ఆరవసారి సమావేశమైంది. కీలక రంగాలకు సంబంధించిన వివిధ అంశాలను ఫోరం చర్చించి  రెండు దేశాల  ఆర్థిక వ్యవస్థల పరస్పర ప్రయోజనాల కోసం సన్నిహిత సహకారం కోసం ప్రాంతాలను గుర్తించడానికి సమర్థవంతమైన వేదికగా కొనసాగుతోంది. అమెరికాలోని భారత రాయబారి శ్రీ తరంజిత్ సంధు తో సహా ప్రభుత్వ సీనియర్ అధికారులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భారతదేశం, అమెరికాకు చెందిన ప్రముఖ  కంపెనీల  సీఈవోలు సభ్యులుగా ఉన్న ఫోరం  సహ-అధ్యక్షులుగా  టాటా సన్స్ చైర్మన్ శ్రీ. ఎన్ .చంద్రశేఖరన్ మరియు లాక్‌హీడ్ మార్టిన్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ  జేమ్స్ టైక్లెట్  వ్యవహరిస్తున్నారు. 

సుస్థిరత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ప్రపంచవ్యాప్తంగా స్థితిస్థాపకంగా సరఫరా గొలుసు వ్యవస్థ  మరియు చిన్న వ్యాపారాలను ప్రోత్సహించే ఉమ్మడి ఆసక్తితో కొనసాగుతున్న భారత్ -అమెరికా ఆర్థిక సంబంధాలు సాధించిన ప్రగతిని శ్రీ పీయూష్ గోయల్ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇటువంటి సమావేశాలు  సంబంధాలు మరింత బలోపేతం కావడానికి సహకరిస్తాయని శ్రీ గోయల్ అన్నారు. సమావేశంలో పాల్గొన్న శ్రీ గోయల్, సహ అధ్యక్షులు, సీఈవో ఫోరం సభ్యులకు  కృతజ్ఞతలు తెలిపిన కార్యదర్శి రైమోండో ఇరుదేశాలకు ఆసక్తి కలిగిన రంగాలను గుర్తించి పనిచేయడం ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక  సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు. 

ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు రెండు దేశాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంస్కరణలు మరియు కార్యక్రమాల పట్ల రెండు దేశాలకు చెందిన సీఈఓలు హర్షం వ్యక్తం చేసి  రెండు ప్రభుత్వాలకు అభినందనలు తెలిపారు.  వ్యవస్థాపకత మరియు చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం, ఆరోగ్య సంరక్షణ  మరియు ఫార్మాస్యూటికల్స్, విమానయాన రంగం, రక్షణ రంగం , ఐసిటి మరియు డిజిటల్ మౌలిక సౌకర్యాలు,ఇంధనం, జలవనరులు పర్యావరణం,  మౌలిక సదుపాయాలు మరియు తయారీ, ఆర్థిక సేవలు, వాణిజ్యం మరియు పెట్టుబడులు  వంటి వివిధ కీలక రంగాల్లో పరస్పర సహకారానికి అందుబాటులో ఉన్న అవకాశాలు, అభివృద్ధిపై రెండు దేశాలకు చెందిన సీఈఓలు నివేదిక సమర్పించారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న భారత్-అమెరికా   ఆరవ ఎడిషన్‌లో నిర్దిష్ట సిఫార్సులు రూపొందించడానికి ఈ రోజు జరిగిన ఫోరం సమావేశంలో జరిగిన చర్చలు ఉపయోగపడతాయి. 

****



(Release ID: 1874888) Visitor Counter : 116