ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రెండో జి-20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో భారత ఆరోగ్య మంత్రి డా.మన్సుఖ్ మాండవీయ ముగింపు ప్రసంగం
"అవసరానికి సరిగ్గా సరిపోయే" ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సృష్టించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించిన మంత్రి
"కొవిడ్-19 మహమ్మారిని నిర్వహించడానికి జి-20 తీసుకున్న ప్రయత్నాలను ఏకీకృతం చేయాలి. ఇందుకు ఒక శాశ్వత వైద్య ప్రతిస్పందన వేదికను సృష్టించాలి. సురక్షితమైన, నాణ్యమైన, సరసమైన ధరలకు టీకాలు, చికిత్స విధానాలు అందుబాటులో ఉండేలా నిర్ధరించాలి: డాక్టర్ మాండవీయ
“ఆరోగ్య అత్యవసర నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందనకు భారతదేశం ప్రాధాన్యత ఇస్తోంది. సురక్షిత, ప్రభావవంతమైన, నాణ్యమైన, సరసమైన ధరల్లో వైద్య చికిత్సల లభ్యత, అందుబాటుపై దృష్టి సారించి ఔషధ రంగంలో సహకారాన్ని బలోపేతం చేస్తోంది. సార్వత్రిక ఆరోగ్య కవరేజీకి సహాయం చేయడానికి, హెల్త్ వర్కింగ్ గ్రూపుల కోసం ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, పరిష్కారాలకు ప్రాధాన్యం ఇస్తోంది"
Posted On:
28 OCT 2022 1:18PM by PIB Hyderabad
"అవసరానికి సరిగ్గా సరిపోయే (ఫిట్ ఫర్ పర్పస్) ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను రూపొందించడం కోసం డబ్ల్యూహెచ్వో (సెటా), జీఏవీఐ, జి-7, జి-20లో సభ్యులైన ప్రభుత్వ సంస్థల మధ్య స్థిరమైన నిధులు, ఐహెచ్ఆర్ సంస్కరణలు, నిరవధిక చర్చలు ఉండేలా చూడడం అవసరం. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన రెండో జి-20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో, తన ముగింపు ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఇవాళ ఈ వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో వచ్చే వైద్య పరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండేలా చూసేందుకు, వైద్య ప్రతిస్పందనల 'తయారీ & పరిశోధన' కేంద్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఇండోనేషియా పిలుపుకు మద్దతు ఇస్తూ భారత కేంద్ర మంత్రి మాండవీయ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "శాశ్వత వైద్య ప్రతిస్పందన వేదికను సృష్టించడం ద్వారా సురక్షిత, నాణ్యమైన, సరసమైన ధరలకు టీకాలు, చికిత్సలు అందుబాటులోకి తెచ్చేలా, కొవిడ్-19 మహమ్మారిని నిర్వహించడానికి జి-20 తీసుకున్న ప్రయత్నాలను ఏకీకృతం చేయాల్సిన అవసరాన్ని" కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.

ఇండోనేషియా, ఇటలీ, సౌదీ అరేబియా సహా జి-20 సమావేశాలకు గతంలో అధ్యక్షత వహించిన దేశాలను మంత్రి ప్రశంసించారు. "ఆరోగ్య అత్యవసర నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఇవ్వడానికి భారతదేశం రూపొందించుకున్న ప్రణాళికను వివరించారు. సురక్షితమైన, ప్రభావవంతమైన, నాణ్యమైన, సరసమైన ధరలకు వైద్య సేవల లభ్యత, అందుబాటుపై దృష్టి సారించి ఔషధ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం; సార్వత్రిక ఆరోగ్య కవరేజీకి సహాయం చేయడానికి, హెల్త్ వర్కింగ్ గ్రూపుల కోసం ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, పరిష్కారాలకు ప్రాధాన్యం ఇవ్వడం గురించి వివరించారు.
వైద్య ప్రతిస్పందన చర్యలు, విలువకు తగ్గ వైద్య ప్రయాణాలు, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణల అందుబాటును విస్తరించడానికి పరస్పర సహకార పరిశోధనలపై డిజిటల్ ఆరోగ్య వర్క్షాపుల నిర్వహణ వంటి కార్యక్రమాలను డాక్టర్ మాండవ్య ప్రతిపాదించారు. సాంప్రదాయ ఔషధాల ద్వారా జి-20 చర్చలకు మద్దతు ఇవ్వడం, మెరుగుపరచడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
భారతదేశం నిర్వహించబోయే తదుపరి జి-20 ఆరోగ్య మంత్రుల సమావేశానికి జి-20 ఆరోగ్య మంత్రులను, పాల్గొనే ఇతరులను సాదరంగా ఆహ్వానించి డాక్టర్ మాండవీయ తన ప్రసంగాన్ని ముగించారు. అందరికీ సమానంగా అందుబాటులో ఉండే అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థను రూపొందించడంలో అందరి మద్దతు, సహకారాన్ని కూడా భారత ఆరోగ్య శాఖ మంత్రి కోరారు.
****
(Release ID: 1871845)