హోం మంత్రిత్వ శాఖ

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నిలువెత్తు విగ్రహం ఆవిష్కరణ! లోక్ నాయక్ విగ్రహావిష్కరణతో


ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్‌ భేటీ ప్రతిపాదన
జె.పి. 121జయంతికి నేరవేరిందన్న అమిత్ షా..
దేశ స్వరాజ్యం కోసం ఉద్యమం ప్రారంభించిన
లోక్‌నాయక్, స్వాతంత్ర్యం అనంతరం
గాంధీ మార్గాన్నే అనుసరించారన్న అమిత్ షా..

జె.పి. సన్యాసివలె అధికారాన్ని త్యజించి,.
ఆచార్య వినోబా భావే సర్వోదయ ఉద్యమంలో
చేరారని, నిరుపేదలు, అణగారిన వర్గాలు,
వెనుకబడిన వారి సంక్షేమం కోసం
తన జీవితమంతా పోరాడారని అమిషా వెల్లడి..


దేశంలో ఎమర్జెన్సీని విధించిన
అవినీతి ప్రభుత్వంపై పోరుకు ప్రతిపక్షాలను
సమైక్యం చేయడం ద్వారా తొలిసారిగా
కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు...

అధికారానికి దూరంగా ఉండటం ద్వారా
దేశానికి అద్భుత నిదర్శనంగా నిలిచారు.

జె.పి., వినోబా భావే సూత్రాలను సమ్మిళతం చేస్తూ
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ
కనీవినీ ఎరుగని కృషి చేస్తున్నారు...

దేశంలోని కోట్లాదిమంది పేదల జీవన ప్రమాణాలను
మెరుగుపరుస్తూ జె.పి. సంపూర్ణ విప్లవ మంత్రాన్ని
సాకారం చేస్తున్న ప్రధాని మోదీ..

జె.పి. ఆలోచనలతో స్ఫూర్తి పొందడం ద్వారా
రానున్న తరం దేశాభివృద్ధికి కొత్త ఊపు తెస్తుంది..
ఇందుకోసం జ

Posted On: 11 OCT 2022 7:31PM by PIB Hyderabad

    లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా, బీహార్‌లోని ఆయన జన్మస్థలమైన సితాబ్ దియారాలో జయప్రకాశ్ నారాయణ్ విగ్రహాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయమంత్రి అశ్విన్ చౌబే మరియు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001E724.jpg

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జయప్రకాశ్ నారాయణ్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట ఇచ్చారని, మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదన తెచ్చారని, ఈ రోజు జయప్రకాశ్ నారాయణ్ 121వ జయంతి సందర్భంగా ప్రధాని ఇచ్చిన మాట నెరవేరిందని అన్నారు. జయప్రకాశ్ నారాయణ్ జీవితం అనేక ప్రత్యేకతల సమాహారమని ఆయన అన్నారు. విముక్తి కోసం జయప్రకాశ్ ఉద్యమమార్గంలో పోరాడడమే కాకుండా మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని కూడా అనుసరించారని అమిత్ షా అన్నారు. స్వాతంత్య్రానంతరం, అధికారం చేపట్టే సమయం వచ్చినప్పుడు, జయప్రకాశ్ నారాయణ్ మాత్రం సన్యాసివలె పదవులు వదులుకుని వినోబా భావేతో కలిసి సర్వోదయ ఉద్యమంలో చేరారని అన్నారు. భూమిలేని పేదలు, అణగారిన వర్గాలు, వెనుకబడిన ప్రజల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. సామ్యవాదం, సర్వోదయం, కులరహిత సమాజ స్థాపన వంటి భావజాలాన్ని సాకారం చేసేందుకు జయప్రకాశ్ నారాయణ్ ఎన్నో కొత్త ప్రతిపాదనలు తెచ్చారని కేంద్ర హోంమంత్రి తెలిపారు. అయితే, అవినీతికి, అవినీతి ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1970వ దశకంలో ఆయన చేపట్టిన ఉద్యమం, మాత్రం దేశానికి ఆయన చేసిన అతిపెద్ద సేవగా పరిగణించవచ్చని అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0028R7Y.jpg

  1973లో అప్పటి గుజరాత్‌ ప్రభుత్వం బాహాటంగా నిధుల సేకరణకు ఆదేశించిందని, ఫలితంగా  మొత్తం అవినీతి ప్రారంభమైందని అమిత్ షా అన్నారు. దీనికి వ్యతిరేకంగా జయప్రకాశ్  నారాయణ్ నాయకత్వంలో గుజరాత్ విద్యార్థులు బలమైన ఉద్యమం నిర్వహించారని, గుజరాత్ లో ప్రభుత్వాన్నే మార్చివేశారని అన్నారు. ఆ తర్వాత బీహార్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయని, అక్కడ గాంధీ మైదాన్‌లో జరిగిన ర్యాలీని చూసి అప్పటి ప్రధానమంత్రి ఆందోళన చెందారని, తరువాత, అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీని) ప్రకటించారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన జరిపిన జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు, పలువురు ప్రతిపక్ష నాయకులను జైళ్లలో నిర్బంధించారని కేంద్రమంత్రి అన్నారు. జైళ్లలో నిర్బంధించడం ద్వారా జయప్రకాశ్ నారాయణ్‌, మొరార్జీ దేశాయ్‌, ఎల్.కె. అద్వానీ, మొరార్జీ వంటి  నేతల మనోస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చని అప్పటి ప్రధాని భావించారని,  1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనపుడు హజారీబాగ్‌లోని జైళ్లు కూడా జయప్రకాశ్ నారాయణ్‌ను ఆపలేకపోయాయని, అప్పటి చిత్రహింసలు కూడా ఏమీ చేయలేకపోయాయని అమిత్ షా అన్నారు. ఎమర్జెన్సీ విధించిన అవినీతి ప్రభుత్వానికి, అన్యాయమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ దేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారని అమిత్ షా అన్నారు. అయితే, అధికారానికి, పదవులకు దూరంగా ఉండడం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ (జె.పి.) దేశం ముందు ఒక అద్భుతమైన ఆదర్శ నాయకుడుగా నిలిచారని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003043B.jpg

  జయప్రకాశ్ నారాయణ్, వినోబా భావే ప్రవచించిన సర్వోదయ సూత్రాన్ని అంత్యోదయతో ఏకీకరణ చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదల సంక్షేమం కోసం ఇదివరకెన్నడూ లేని రీతిలో కృషి చేస్తున్నారని అమిత్ షా అన్నారు. అవసరమైన నిరుపేదలకు బీమా సదుపాయం కల్పించారని, రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను 60 కోట్ల మందికి కల్పించారని అన్నారు. ప్రతి పేదవాడి ఇంటికి వంట గ్యాస్, మరుగుదొడ్లు, ప్రతి పేదవాడికి రెండున్నరేళ్ల పాటు ఉచిత రేషన్, ప్రతి ఇంటికి విద్యుత్ సదుపాయం కల్పించారని అన్నారు.  రోడ్లు నిర్మించడం ద్వారా ప్రధాని ప్రతి గ్రామానికి అనుసంధానం కల్పించారన్నారు. జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవ నినాదం ఇచ్చారని, అయితే  ఆ నినాదాన్నివిజయవంతం చేసేందుకు మాత్రం ఏ ప్రతిపక్ష పార్టీ ప్రయత్నించలేదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషిచేస్తూ,  జె.పి. సంపూర్ణ విప్లవ మంత్రాన్ని సాకారం చేసేందుకు నరేంద్ర మోదీ కృషి చేశారని అమిత్ షా చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, ఉపాధి అవకాశాలు కల్పించడం,  వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ 60 కోట్ల మంది ప్రజలకు ఆశాకిరణంగా నిలిచారన్నారు.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004NCEA.jpg

      బీహార్‌లో రాజకీయాలకు అతీతంగా 1974లో జె.పి. ప్రారంభించిన ఉద్యమంలో అన్ని భావజాలాలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారని, జె.పి. పేరుచెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఇప్పుడు పార్టీ మారి, ఆయన సిద్ధాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వారంతా ఇపుడు అధికారాన్ని అనుభవించేందుకు  ప్రతిపక్షాల ప్రభుత్వంలో కూర్చున్నారని అన్నారు. లోక్‌నాయక్ జె.పి. చూపిన బాటలో పయనిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమా,...  లేక జె.పి. బాట నుంచి తప్పుకుని అధికారం కోసం పొత్తులు పెట్టుకునే ప్రభుత్వాన్ని బలపరచడమా... అనేది బీహార్ ప్రజలు నిర్ణయించుకోవాలని అమిత్ షా అన్నారు. ఈ రోజు జె.పి. సిద్ధాంతాల స్ఫూర్తితో కోసం ఆయన జన్మస్థలంలో భారీ స్మారక చిహ్నం నిర్మించామని అన్నారు. జె.పి. ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే తరం దేశాభివృద్ధికి కొత్త ఊపును అందించాలన్నారు  ఇందుకోసం ఇక్కడ స్మారక చిహ్నంతో పాటు పరిశోధనా, అధ్యయనా కేంద్రాన్ని కూడా నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్టు అమిత్ షా తెలిపారు. ఇక్కడ పరిశోధనా, అభివృద్ధి అధ్యయన కేంద్రం ఏర్పడిన తర్వాత, జె.పి. సూత్రాలను, గ్రామాల అభివృద్ధికి ఆయన అందించిన కృషిని విద్యార్థులు పరిశోధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సహకార ఉద్యమం, గ్రామీణాభివృద్ధి,  సర్వోదయ కార్యకలాపాల్లో జె.పి. అపారమైన కృషి చేశారని, నేడు ఆయన జయంతి సందర్భంగా దేశం ఆయన్ను స్మరించుకుంటోందని, ఘనంగా నివాళులర్పిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/tC847YDBCairQmNwFmvfR3XN1ecVGTOhZPgpzXjne1BfL-v35FPHH9w7QV9H19qPuOzwcAzfdbJuGg9fmqWpIqfySpyrfp7-FypcdmgHXqS1ygG_x03Jw0h6DQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005REOV.jpg

***



(Release ID: 1867051) Visitor Counter : 124


Read this release in: English , Urdu , Marathi