ఆయుష్

"మానవత్వం కోసం యోగా" - 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తం గా ఎంపిక


“మన్ కీ బాత్” ప్రసంగంలో ఇతివృత్తాన్ని ప్రకటించిన - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Posted On: 30 MAY 2022 5:39PM by PIB Hyderabad

8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని "మానవత్వం కోసం యోగా" అనే ఇతివృత్తంతో నిర్వహించనున్నారు.   భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, 2022 జూన్, 21వ తేదీన, 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022 నిర్వహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఇతివృత్తాన్ని ఎంపిక చేసింది.  అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022 ప్రధాన కార్యక్రమం కర్ణాటకలోని మైసూరులో జరుగుతుంది.  గత ఏడాది కోవిడ్-19 మహమ్మారి సమయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, “ఆరోగ్యానికి యోగా” అనే ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన “మన్ కీ బాత్” ప్రసంగంలో ఈ ఇతివృత్తాన్ని ప్రకటించారు.  చాలా చర్చలు / సంప్రదింపుల తర్వాత ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తాన్ని ఎంపిక చేయడం జరిగింది.  కోవిడ్-19 మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో, యోగా బాధలను తగ్గించడంలో మానవాళికి ఎలా ఉపయోగపడిందో తెలియజేయడంతో పాటు, కోవిడ్ అనంతర అభివృద్ధి చెందుతున్న భౌగోళిక-రాజకీయ దృష్టాంతంలో కూడా, ఇది తగిన విధంగా ప్రతిబింబించనుంది.  ఇది కరుణ, దయ ద్వారా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు, ఐక్యతా భావాన్ని పెంపొందించి, ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో స్థితిస్థాపకత ను మెరుగు పరుస్తుంది. 

"మానవత్వం కోసం యోగా" అని, ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తాన్ని మన ప్రధానమంత్రి ఎంతో సముచితంగా ప్రకటించారని, కేంద్ర ఆయుష్, ఓడరేవులు, నౌక రవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ తెలియజేశారు.  యోగా అంటే, మనకు ఆనందం, ఆరోగ్యం, శాంతిని కలిగించే అభ్యాసం అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.  ఇది ఒక వ్యక్తి అంతర్గత స్పృహ మరియు బాహ్య ప్రపంచం మధ్య నిరంతర సంబంధాన్ని బలోపేతం చేస్తుంది.  ఈ ఇతివృత్తాన్ని తగిన విధంగా ప్రచారం చేయడంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022 విజయవంతమవుతుంది.

మానవత్వం కోసం యోగా అనే అంశంపై దృష్టి సారించి, ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తులు, వికలాంగులు, లింగమార్పిడి జనాభా, మహిళలు, పిల్లల కోసం ఈ సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది.  యోగా విద్య లో అంతర్భాగమైన మానవ విలువల పై కూడా పాఠశాలలు దృష్టి సారిస్తున్నాయి.  కామన్-యోగా-ప్రోటోకాల్ (సి.వై.పి) అభ్యాసం మరియు శిక్షణను కామన్ సర్వీస్ సెంటర్లు (సి.ఎస్.సి) ప్రోత్సహిస్తున్నందున ఈ సంవత్సరం మన గ్రామాలు / గ్రామ పంచాయతీలు కూడా భారీ భాగస్వామ్యాన్ని చూపించనున్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో లక్షలాదిగా  గ్రామస్థులు పాల్గొంటారని భావిస్తున్నారు. 

8వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అనేక అంశాలు ప్రప్రథమంగా జరుగుతున్నాయి. వాటిలో ఒకటి "గార్డియన్ రింగ్" అనే వినూత్న కార్యక్రమం.  ఇది సూర్యుని కదలిక కు అనుగుణంగా ఉంటుంది.   వివిధ దేశాల నుండి సూర్యుని కదలిక తో పాటు యోగా చేసే వ్యక్తుల భాగస్వామ్యం జరుగుతుంది,  ఇది తూర్పు నుండి ప్రారంభమై పడమర వైపు సాగుతుంది.  ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని దూరదర్శన్ ఛానెళ్ళు ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నాయి. 

దేశం కూడా "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" జరుపుకుంటున్న సందర్భంగా, 75 జాతీయ స్థాయి ముఖ్య ప్రదేశాల్లో జూన్ 21వ తేదీన సామూహిక కామన్-యోగా-ప్రోటోకాల్ (సి.వై.పి) ప్రదర్శన కూడా ఉంటుంది.  అదేవిధంగా, ఆయా రాష్ట్రాలు కూడా వారి ఎంపిక ప్రకారం 75 ముఖ్యమైన ప్రదేశాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐ.డి.వై-2022) కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ తో కలిసి అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.   100 రోజుల కౌంట్‌-డౌన్‌ కు గుర్తుగా "కర్టెన్-రైజర్" కార్యక్రమాన్ని 2022 మార్చి, 13వ తేదీన నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా 2022 మార్చి, 13వ తేదీ నుంచి జూన్, 21వ తేదీ వరకు "100 రోజులు-100 నగరాలు-100 సంస్థలు" అనే ప్రచారాన్ని ప్రారంభించింది.  ఆ తర్వాత, న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద 75 రోజుల కౌంట్-డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.  అదేవిధంగా, 50 రోజుల కౌంట్‌-డౌన్‌ కార్యక్రమాన్ని అస్సాంలోని శివసాగర్‌లోనూ; 25 రోజుల కౌంట్‌-డౌన్‌ కార్యక్రమాన్ని తెలంగాణలోని హైదరాబాద్‌ లోనూ  నిర్వహించడం జరిగింది. 

 

*****



(Release ID: 1829594) Visitor Counter : 301


Read this release in: Hindi , English , Odia , Urdu , Marathi