ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2022-23 రూపకల్పనపై సన్నాహక సమావేశాలు నిర్వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
వర్చువల్ విధానంలో జరిగిన సమావేశాలకు హాజరైన ఏడు వర్గాలకు చెందిన 120 మంది ఆహ్వానితులు
నాడు పోస్టు చేయడమైనది:
22 DEC 2021 5:18PM by PIB Hyderabad
కేంద్ర బడ్జెట్ 2022-23 రూపకల్పనపై కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సన్నాహక సమావేశాలు జరిగాయి. 2021 డిసెంబర్ 15 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరిగాయి.
ఈ సమావేశాలకు ఏడు వర్గాలకు చెందిన 120 మంది ఆహ్వానితులు హాజరయ్యారు. వ్యవసాయం,వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక రంగం, మౌలిక వసతులు, వాతావరణ మార్పులు, ఆర్థిక పెట్టుబడి రంగాలు, సేవలు వాణిజ్య రంగం, సామాజిక రంగం, కార్మిక సంఘాలు,సంస్థలు, ఆర్థికవేత్తలు సమావేశాలలో పాల్గొన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు శ్రీ పంకజ్ చౌదరి, డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరద్, ఆర్థిక కార్యదర్శి శ్రీ టి.వి. సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్, పెట్టుబడులు,ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి శ్రీ తుహిన్ కాంత పాండే, ఆర్థిక సేవల కార్యదర్శి శ్రీ దేబాశిష్ పాండా, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి శ్రీ రాజేష్ వర్మ, రెవెన్యూ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్ , ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సంబంధిత ఇతర మంత్రిత్వ శాఖలు/విభాగాల కార్యదర్శులు ఆన్లైన్ విధానంలో సమావేశానికి హాజరయ్యారు.
బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు పలు సూచనలు అందించారు. పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు పెంచాలని, డిజిటల్ సేవలకు మౌలిక సదుపాయాల గుర్తింపు ఇవ్వాలని, హైడ్రోజన్ ఇంధన నిల్వలకు ప్రోత్సాహకాలు అందించాలని, ఆదాయం పన్ను పన్ను శ్లాబ్లను హేతుబద్దీకరించాలని, ఆన్లైన్ పెట్టుబడులకు భద్రత మొదలైన అనేక అంశాలపై సమావేశాలకు హాజరైన ప్రతినిధులు ఆర్థిక మంత్రికి సూచించారు.
విలువైన సూచనలు అందించిన ప్రతినిధులకు ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్ కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ 2022-23 రూపకల్పనలో ఈ సూచనలను జాగ్రత్తగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 1784398)
సందర్శకుల సూచీ సంఖ్య : : 273