ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ భారతీ పవార్
' ప్రధానమంత్రి ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ పునాదిగా ఉంటుంది'
ప్రతి ఒక్కరి విశ్వాసం, సహకారం, ప్రయత్నం మహమ్మారిపై జరిగిన పోరులో సహకరించాయి.. డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
Posted On:
13 DEC 2021 3:41PM by PIB Hyderabad
' ప్రధానమంత్రి ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ పునాది గా ఉంటుంది' అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు.ఈ రోజు జరిగిన సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం-2021 కార్యక్రమానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ' ఏ ఒక్కరి ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు: ఆరోగ్య సంరక్షణ పై పెట్టుబడులు' అనే అంశంపై సాంకేతిక చర్చలు, ఒక రోజు సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ప్రజలందరికి ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మూడు దశల్లో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. “సబ్కా సాత్ మరియు సబ్కా విశ్వాస్” లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ యోజన 2018 కార్యక్రమాన్ని ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య సేవలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలన్న లక్ష్యంతో కార్యక్రమం మొదటి దశను 2018 లో ప్రారంభించామని వివరించారు. దీనిని మరింత పటిష్టం చేయాలన్న లక్ష్యంతో 2018 సెప్టెంబర్ నెలలో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఈ ఏడాది ఆయుష్మాన్ డిజిటల్ మిషన్, పీఎం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను ప్రారంభించామని మంత్రి వివరించారు. ఆరోగ్య సంరక్షణ, మెరుగైన సంరక్షణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. కోవిడ్ వల్ల ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు భారతదేశంలో కూడా అనేక పనులు మందగించాయని అన్న మంత్రి దీని ప్రభావం ఆరోగ్య రంగంపై ఎక్కువగా లేదని వివరించారు. ప్రజారోగ్య సంరక్షణ కోసం దేశంలో ప్రస్తుతం 81,000 హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు పనిచేస్తున్నాయని డాక్టర్ పవార్ తెలిపారు. దేశంలో 1.10 లక్షల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని 2022 మార్చి నాటికి చేరుకుంటామని మంత్రి అన్నారు.
సమాజం సౌభాగ్యం గా ఉండాలన్న సంకల్పంతో సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నామని డాక్టర్ పవార్ అన్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో ఎదురైన పరిస్థితిని ఎదుర్కోవడంలో సహకరించిన ఆరోగ్య కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ ఆరోగ్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఆరోగ్య కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తున్నారని ఆమె అన్నారు.దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న టీకాల కార్యక్రమంలో 133 కోట్ల టీకా డోసులు వేసిన రాష్ట్రాలు, ఆరోగ్య కార్యకర్తలతో సహా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ మంత్రి అభినందించారు.
వివిధ తరగతుల్లో ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలకు మంత్రి అవార్డులు అందించి సత్కరించారు. ' ఆయుష్మాన్ భారత్ - ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ'' ”, “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం”, " ఆయుష్మాన్ భారత్ - ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఎన్ సి డీ, సాధారణ కాన్సర్ పరీక్షల నిర్వహణ" " డిజిటల్ హెల్త్ ఐడీ ల జారీ" రంగాల్లో ఆమె అవార్డులను అందించారు. ఉత్తమ, ఆచరణాత్మక ఆరోగ్య సంరక్షణ విధానాలు, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది బృందాలకు శిక్షణ అంశాలపై రూపొందించిన నియమావళిని మంత్రి విడుదల చేశారు. కాన్సర్, మధుమేహం, గుండెపోటు నివారణ, నియంత్రణ అంశాలపై అమలు జరుగుతున్న జాతీయ కార్యక్రమం పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటైన ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని మంత్రి ప్రారంభించారు.
కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, ఎన్ హెచ్ ఎ సీఈఓ డాక్టర్ ఆర్.ఎస్. శర్మ, ఎన్ హెచ్ ఎం ఎండీ శ్రీ వికాస్ షీల్, మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సర్ విశాల్ చౌహాన్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రతినిధి డాక్టర్ రోడెరికో ఓర్ఫిన్, యూఎస్ ఎయిడ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత పటేల్ తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1781129)
Visitor Counter : 122