వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్తో మోడల్ ఎంఓయుపై సంతకం చేసిన కేంద్రం
- ఈ ఒప్పందం చౌక ధరల దుకాణాల వ్యాపార అవకాశాలు మరియు ఆదాయాన్ని పెంచుతుంది
- ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడానికి సీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాలతో జతకడుతుంది
- చౌక ధరల దుకాణాల ఆదాయం, వ్యాపార అవకాశాలను పెంచేలా సరికొత్త అవకాశాల్ని అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వాలకూ సూచన
Posted On:
20 SEP 2021 5:47PM by PIB Hyderabad
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ,
సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఒక మోడల్ అవగాహన ఒప్పందం (ఎంఓయు) చేసుకుంది. ఈ ఒప్పందం ఆసక్తి గల చౌక ధరల దుకాణం (ఎఫ్పీఎస్) డీలర్ల ద్వారా సీఎస్సీ సేవలను అందించి ఆయా దుకాణాల వారి వ్యాపార అవకాశాలు మరియు ఆదాయాన్ని పెంచే దిశగా తోడ్పడుతుంది. ఈ మోడల్ ఎంఓయూపై కేంద్ర ప్రజా పంపిణీ శాఖ డిప్యూటీ కార్యదర్శి శ్రీమతి జ్యోత్స్న గుప్తా, సీఎస్సీ ఉపాధ్యక్షుడు శ్రీ సార్తిక్ సచ్దేవాలు సంతకం చేశారు. ఆహార & ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సుధాంశు పాండే, సీఎస్సీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్శి శ్రీ దినేష్ కుమార్ త్యాగి సమక్షంలో ఈ సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఎఫ్పీఎస్లు సీఎస్సీ సేవా కేంద్రంగా పనిచేయడానికి వీలు కలుగుతుంది. వినియోగదారునికి యుటిలిటీ బిల్లు చెల్లింపులు, పాన్ అప్లికేషన్, పాస్పోర్ట్ అప్లికేషన్, ఎన్నికల కమిషన్ సేవలు తదితర కార్యకలాపాలను గుర్తించి వాటిని అందించేందుకు వీలు పడుతుంది. దీంతో ప్రజలకు వివిధ సేవలు అందుబాటులో లభించడంతో పాటు ఇదే సమయంలో ఆయా ఎఫ్పీఎస్లకు అదనపు ఆదాయాన్ని అందించడానికి కూడా వీలు పడుతుంది. సీఎస్సీ సేవల డెలివరీకి ఆసక్తి ఉన్న ఎఫ్పీఎస్ డీలర్లకు డిజిటల్ సేవా పోర్టల్ (డీఎస్పీ) యాక్సెస్ అందించడానికి గాను ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాల కోసం సీఎస్సీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో జతకడుతుంది. సీఎస్సీ సాంకేతిక పరిజ్ఞానం మరియు సామర్ధ్యం పెంపొందించడానికి కూడా ఈ భాగస్వామ్యం కట్టుబడి ఉంటుంది. సీఎస్సీ సర్వీసుల పంపిణీకి అనుమతించడం ద్వారా సరసమైన ధరల షాపు ఆదాయం మరియు వ్యాపార అవకాశాలను పెంచే అవకాశాలను అన్వేషించే దిశగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ కనబరచాలని కూడా సూచించడమైంది. దీనికి తడు వినియోగదారులకు సౌలభ్యం కొరకు రేషన్ కార్డు సేవలను సులభంగా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని సూచించడమైంది. కొత్త కార్డ్ల కోసం దరఖాస్తు, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డును అప్డేట్ చేయడం, ఆధార్ సీడింగ్ అభ్యర్థనలు, రేషన్ లభ్యత యొక్క స్థితి, తనిఖీ మరియు నమోదు వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అందించే రేషన్ కార్డ్ సేవలను కూడా సీఎస్సీ ద్వారా అందించే విషయాన్ని రాష్ట్రాలు అన్వేషించి ఎంపిక చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ తమ అభీష్టానుసారం ఆయా సేవలకు సంబంధించిన సమాచార భద్రత, చట్టబద్ధమైన నిబంధన మరియు ఇతర సంబంధిత మార్గదర్శకాలకు సంబంధించి తగిన శ్రద్ధను నిర్ధారిస్తూ ఆయా సేవలకు అనుమతినివ్వవచ్చు.
***
(Release ID: 1756569)
Visitor Counter : 262